ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. మరో వందేభారత్ రైలును ఏపీకి కేటాయించింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని విజయవాడ నుంచి చెన్నైకు వందే భారత్ రైలును ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ రైలు ఈనెల 7వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వర్గాలు వెల్లడించాయి.
చెన్నైకు మరో రైలు…
ఇప్పటికే పినాకినీతో పాటు పలు రైళ్లు ఉన్నప్పటికీ వేగంగా వెళ్లేందుకు వీలుగా, సమయాన్ని ఆదా చేసుకునేందుకు వందేభారత్ రైలును అందుబాటులోకి తేవాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ తో పాటు చెన్నైకు కూడా ఆక్యుపెన్సీ రేషియో ఎక్కువగానే ఉంటుంది. వ్యాపారాల నిమిత్తం, ఉద్యోగాల కోసం అనేక మంది చెన్నైకు రాకపోకలు కొనసాగిస్తుంటారు.
ఏ ఏ స్టేషన్లు…
అయితే దీనికి సంబంధించిన షెడ్యూల్ ను త్వరలోనే రైల్వే శాఖ విడుదల చేయనుంది. ఈ రైలు ఏ ఏ స్టేషన్లలో ఆగనుందన్న విషయంపైనా రెండు రోజుల్లో స్పష్టత రానుంది. ఇప్పటికే వందే భారత్ రైలులో ప్రయాణం పట్ల ప్రయాణికులు ఆకర్షితులయ్యారు. రైళ్లన్నీ ప్రయాణికులతో నిండిపోతున్నాయి. విజయవాడ నుంచి చెన్నైకి సాధారణ రైలులో వెళ్లాలంటే ఆరు గంటల సమయం పడుతుంది. వందేభారత్ కారణంగా రెండు గంటల సమయం తగ్గే అవకాశముందని రైల్వే అధికారులు తెలిపారు.
Follow Us On : YouTube , Google News