Sharmila
వ్రతం చెడ్డా ఫలితం దక్కలేదు వైఎస్ తనయ షర్మిలకి .. కాంగ్రెస్ లో విలీనం అంటూ వచ్చిన వార్తలే షర్మిల పార్టీ భవిష్యత్తును అథ: పాతాళానికి తొక్కేశాయనుకోవాలి. ఢిల్లీ వెళ్లి పడిగాపులు పడి సోనియా, రాహుల్,ప్రియాంకలను కలసినా పలితం మాత్రం దక్కలేదు. తన అభీష్టానికి విరుద్ధంగా తిట్టిన నోటితోనే కాంగ్రెస్ పెద్దలను పొగిడినా.. షర్మిల రాజకీయ భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిపోయింది. తెలంగాణ రాజకీయాల్లో ఆమె వేలు పెడితే ఊరుకోబోమంటూ కాంగ్రెస్ లో ఓ వర్గం సీనియర్లు ( వైఎస్ వ్యతిరేకులు) షర్మిల రాకను తీవ్రంగా వ్యతిరేకించారు. ఆమె సేవలు ఏపీకి పరిమితం చేయాలని ఒకరంటే..అసలు కర్ణాటకనుంచి రాజ్యసభకు పంపాలని మరికొందరు ఉచిత సలహాలు పడేశారు. దాంతో కాంగ్రెస్ హై కమాండ్ కూడా షర్మిలను లైట్ తీసుకున్నట్లు కనిపిస్తోంది.
ఈ మొత్తం గేమ్ లో షర్మిల బదనామ్ అయ్యింది. ఆమెను పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు చేస్తూనే..ఏ విషయమూ తేల్చకుండా..కాంగ్రెస్ హై కమాండ్ విషయాన్ని నాన్చడం షర్మిల స్థాయిని తగ్గించేసింది.రెండు,మూడుసార్లు ఢిల్లీకి వెళ్లి సుదీర్ఘ మంతనాల తర్వాత కూడా విషయం మళ్లీ మొదటికే వచ్చింది. పైగా ఓ వైపు తెలంగాణలో రైజింగ్ లో ఉన్న కాంగ్రెస్ ఈసారి అధికారంలోకి రావడం ఖాయమనే అంచనాలు వినిపిస్తున్నాయి. అలాంటి తరుణంలో షర్మిల ను విలీనం పేరుతో పిలిచి అభాసు పాలు చేసి కాంగ్రెస్ మైండ్ గేమ్ ఆడటం ద్వారా ఆమెను ప్రజల్లో చులకన చేసిందని, ఆమె చరిష్మా, ఇమేజ్ పైనా దెబ్బ కొట్టారని ఇదంతా వ్యూహం ప్రకారమే జరిగిందని మరికొందరు విశ్లేషిస్తున్నారు.
తెలంగాణ సెంటిమెంట్ అడ్డు Sharmila
నేనిక్కడే పుట్టా.. ఇక్కడి అబ్బాయినే పెళ్లి చేసుకున్నా.. ఇక్కడే ఇద్దరు బిడ్డల్ని కన్నా.. నేను పక్కా తెలంగాణ వాదినేనని షర్మిల ఎంతలా ప్రజలను కన్విన్స్ చేసినా ఆమె ప్రయత్నాలు కలసి రాటం లేదు. చివరకు తన భాషను,యాసను కూడా ఆమె మార్చుకున్నారు. అయినా షర్మిలను అసలు తెలంగాణ బిడ్డగా తాము గుర్తించేది లేదంటోంది కాంగ్రెస్ లో ఓ వర్గం. అందుకే ఆమె సేవలు ఏపీలో వాడుకోవాలంటోంది. వైఎస్ బతికున్నప్పుడు ఆయన వ్యతిరేకులుగా ముద్రపడిన వారంతా ఇప్పుడు తమకు టైమ్ వచ్చిందనుకుంటున్నారు. వీళ్లకి తోడు రేవంత్ రెడ్డికి కూడా షర్మిల పొడగిట్టడం లేదు.
మొదట్నుంచి ఆమెను వ్యతిరేకిస్తున్నరేవంత్ అందుకు తగిన మద్దతు కూడా బానే కూడగట్టారు. చేయాల్సిన రాజకీయం చేశారు. అందుకే ఆమె అడిగిన పాలేరు సీటు గానీ, ఖమ్మం సీటు గానీ దక్కకుండా పావులు కదిపారు. షర్మిల అడిగిన పాలేరు సీటుకి తుమ్మలని,పొంగులేటిని రేసులోకి దించి అడ్డు పుల్ల వేశారు రేవంత్. అలాగే ఖమ్మం నుంచైనా నిలబడదామనుకుంటే రేణుకా చౌదరి కయ్యి మంటూ లేచారు.పైగా తెరపైకి కుల సమీకరణాలు కూడా వచ్చాయి. కమ్మ సామాజక వర్గానికి తగిన సీట్లు ఇవ్వాలంటూ రేణుకా చౌదరి పట్టుబడుతున్నారు. ఇలా కాంగ్రెస్ నేతలంతా సహాయనిరాకరణ చేయడంతో షర్మిల వెనక్కి తగ్గక తప్పలేదు. తన పార్టీని విలీనం చేయడానికి ఆమె పెట్టిన షరతులు కూడా ప్రతిబంధకంగా మారాయన్నది ఒక టాక్… Sharmila
ఒంటరి పోరాటం తప్పదా?
ఇటు తెలంగాణలో ఎన్నికల కోడ్ కూడా వచ్చేసింది. ఇక షర్మిల ఒంటరి పోరాటం చేయాల్సిందే.. తెలంగాణలో 119 స్థానాలకూ అభ్యర్ధులను నిలబెట్టాలని ఆమె నిర్ణయించారు. వైఎస్సార్ టీపీ పరిస్థితి కూడా ఏపీలోజనసేన లాగే ఉంది. లీడర్లు లేరు.. కేడర్లు లేరు.. ఏదో సామాన్య జనం ఆమె వెంట నిలిచారు తప్ప ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకత్వం అసలు లేనే లేదు.. వ్యూహం లేదు. భవిష్యత్ ప్రణాళికలు లేవు. పార్టీపెట్టి రెండేళ్లయినా షర్మిల దాని నిర్మాణం కోసం చేసిన ప్రయత్నాలూ కలసి రాలేదు. మూడువేల కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర తో తన పార్టీకి గట్టి పునాదులు పడతాయని ఆమె వేసిన ఎత్తుగడ కూడా ఫలించలేదు. ఈ మధ్య కాలంలో కేసీఆర్ కు గట్టి కౌంటర్ ఇచ్చిన ప్రత్యర్ధుల్లో షర్మిల ఒకరు. అయినా ఆమెకు తగిన గుర్తింపు రాలేదు.
పాలేరులో నెగ్గుకు రాగలరా?
పార్టీలోకి చేరిన వారంతా ఒక్కొక్కరుగా జారిపోతుండటంతో కాంగ్రెస్ లో విలీనం చేయాలని ఆమె ప్రయత్నించారు. కానీ దానిపై ఈరోజుకీ స్పష్టత రాలేదు. కాంగ్రెస్ పార్టీకి ఆమె పెట్టిన డెడ్ లైన్ ముగియడంతో ఇక సొంతంగా ఎన్నికల బరిలోకి దిగక తప్పలేదు. ఇప్పుడు అతిరథ మహారథులు నిలబడుతున్న పాలేరులో షర్మిల తట్టుకుని నిలబడి గెలవగలరా? అంగబలం, అర్ధబలం పుష్కలంగా ఉన్న తుమ్మల లాంటి నేతను ఢీకొనడమంటే చిన్న విషయం కాదు..పరిస్థితి ఎలా తయారయిందంటే కనీసం తానొక్కరు గెలిచి అసెంబ్లీలోకి అడుగు పెట్టినా పార్టీని నిలబెట్టుకునే ఛాన్స్ వస్తుందని ఆశపడుతున్నారామె. మరి ఆమె ఆశ ఫలిస్తుందా? కనీసం పాలేరులోనైనా షర్మిల గెలుస్తుందా? షర్మిలకు రాజకీయాలు అచ్చి వస్తాయో రావో … Sharmila