మలేషియా లోని మహా ప్రత్యంగిరా దేవి (Pratyangira Devi) ఆలయంలో అమ్మవారిని సర్పంలోకి ఆవాహన చేసి అర్చించి, నీరాజనాలు సమర్పిస్తారు, మహా ప్రత్యంగిరా దేవి విశిష్టత లక్ష సింహ ముఖాలతో భగభగమండే కేశాలతో త్రినేత్రాలతో అవతరించి రాక్షస సంహారం గావించిన ఆదిపరాశక్తి ప్రత్యంగిరా దేవి (Pratyangira Devi) అని పురాణప్రతీతి. ఉగ్రస్వరూపిణి అయిన ఈ అమ్మవారికి ఆలయాలు అత్యంత అరుదు. అంతటి అరుదైన ప్రత్యంగిరా ఆలయం మన రాష్ట్ర రాజధానిలోనే ఉంది.
శ్రీరాముడు, హనుమంతుడు, శ్రీకృష్ణుడు, ధర్మరాజు వంటి మహనీయులెందరో పూజించిన దేవత ప్రత్యంగిరా దేవి అని పురాణప్రతీతి. కానీ ఉగ్రస్వరూపిణి కావడంతో కలికాలంలో ఈ అమ్మవారికి ఆలయం నిర్మించి పూజించేవారే కరవయ్యారు. ఉత్తరాదిన హిమాలయాల్లోని మానససరోవరం సమీపంలో ‘కృత్య’గానూ దక్షిణాదిన కుంభకోణం (తమిళనాడు)లోని అయ్యావరే అడవిలో నికుంభిలగానూ… ఇలా కొన్నిచోట్ల మాత్రమే పూజలందుకుంటోంది ఈ అమ్మవారు.
ఈ విషయం తెలుసుకున్న ములుగు మల్లికార్జునరావు గత నలభయ్యేళ్లుగా ఎన్నో గ్రంథాలు పరిశీలించి ప్రత్యంగిరా దేవి (Pratyangira Devi) గురించి ఎన్నో వివరాలు తెలుసుకున్నారు. మానససరోవరం, కుంభకోణంలో కొలువైన ఆ ఉగ్రస్వరూపిణిని దర్శించి పూజాదికాలు నిర్వహించారు. అమ్మవారిపై భక్తితో హైదరాబాద్లోని దిల్సుఖ్నగర్ ప్రాంతంలో (రామకృష్ణాపురం రోడ్ నెంబర్ 1, అష్టలక్ష్మీ ఆలయ సమీపంలో)ని కుర్తాళం పీఠంలో ప్రత్యంగిరాదేవిని ప్రతిష్ఠించారు. ఆ అమ్మతో పాటు ఆదిపరాశక్తి సాత్విక, రౌద్ర అంశలుగా భావించే కాళి, తార, చిన్నమస్తా, త్రిపుర భైరవి, భగళాముఖి, ధూమావతి, మాతంగి, షోడశి(లలితాత్రిపురసుందరి), కమలాత్మిక (లక్ష్మీదేవి) అమ్మవార్లనూ ప్రతిష్ఠించారు
శత్రుసంహారం, దారిద్య్రనివారణ, మంచి ఆరోగ్యం కోసం ప్రత్యంగిరాదేవిని (Pratyangira Devi) పూజిస్తారు. శనీశ్వరుడి శంఖం పేరు ప్రత్యంగిర. ఏలినాటి శని దోషంతో బాధపడేవారు ప్రత్యంగిరా దేవిని పూజిస్తే మంచిదని చెబుతారు పెద్దలు. సంతానం లేనివారు ఈ అమ్మవారిని ఆరాధిస్తే సంతానం కలుగుతుందని ప్రతీతి. రజోగుణ ప్రధాన దేవత కనుక ప్రత్యంగిరాదేవికి ఎండుమిరపకాయలు, తెల్ల ఆవాలు, నల్ల ఉప్పు, శొంఠి, సమిదల వంటి రాజద్రవ్యాలతో అదీ అమావాస్యనాడు ప్రత్యేక అభిషేకాలూ హోమాలూ నిర్వహిస్తారు
ఓం శ్రీ ప్రత్యంగిరా దేవ్యై నమః