ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి దేవీ నవరాత్రులు జరుపుకుంటాం. ఎనిమిదవ రోజు.. అంటే ఆశ్వయుజ అష్టమి దుర్గాష్టమి (Durgastami) లేదా మహాష్టమి పర్వదినం. వినాయక చవితి మాదిరిగానే దుర్గాష్టమి (Durgastami) నాడు విద్యార్థులు తమ పుస్తకాలను పూజలో ఉంచి ప్రార్ధిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో స్థిరపడినవారు అస్త్ర పూజ చేస్తారు. తమ వృత్తికి సంబంధించిన సామగ్రిని, ముఖ్యమైన పరికరాలను అమ్మవారి ఎదుట ఉంచి పూజ చేస్తారు.పాండవులు అరణ్యవాసం ముగించి, అజ్ఞాతవాసానికి వెళ్తూ జమ్మిచెట్టు కొమ్మల మధ్య తమ ఆయుధాలను దాచివెళ్లారు. తిరిగి వచ్చిన తర్వాత అర్జునుడు జమ్మిచెట్టుపై దాచిన ఆయుధాలను తీసి, పూజించి, ఉత్తర గోగ్రహణ యుద్ధం చేశాడు. శత్రువులను జయించి విజయుడయ్యాడు. ఆయుధాలకు రక్షణ కల్పించిన జమ్మిచెట్టు పవిత్రతను సంతరించుకుంది. కనుకనే ఇప్పటికీ జమ్మిచెట్టుకు భక్తిగా పూజలు చేస్తాం.
కొన్ని ప్రాంతాలవారు కాళీమాత నుదుటి నుండి దుర్గాదేవి ఉద్భవించిందని నమ్ముతారు. కనకదుర్గమ్మను కాళీమాతగా, చండీదేవిగా, రక్తబీజగా పూజిస్తారు. మహాష్టమి నాడు 64 యోగినులను, దుర్గాదేవి రూపాలైన అష్ట నాయికలను అర్చిస్తారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో బ్రాహ్మణి, మహేశ్వరి, కామేశ్వరి, వైష్ణవి, వరాహి, నార్సింగి, ఇంద్రాణి, చాముండి – అనే ఎనిమిది శక్తి రూపాలను కొలుస్తారు. నవరాత్రులను పవిత్ర దినాలుగా భావించి ఈరోజుల్లో నియమనిష్ఠలతో ఉంటారు. ధూమపానం, మద్యపానం లాంటి అలవాట్లు ఉన్నవారు కూడా ఈ విశేష దినాల్లో వాటి జోలికి వెళ్లరు. వాటిని సేవించినట్లయితే దేవికి అపచారం చేసినట్లే అని భావిస్తారు, భయపడతారు. తమ పిల్లలను పాఠశాలలో చేర్చే వయసు గనుక అయితే తల్లిదండ్రులు ఇతర రోజుల కంటే దుర్గాష్టమి లేదా విజయదశమి రోజున విద్యాభ్యాసం చేయించడం ఉత్తమంగా భావిస్తారు. ఈ రోజుల్లో గనుక చిన్నారుల చేత ”ఓంకారం” రాయించి విద్యాభ్యాసం చేయిస్తే చదువు బాగా వస్తుందని విశ్వసిస్తారు.
వ్యాపారులు తమ షాపులు లేదా సంస్థలను పూవులతో అలంకరించుకుని దుర్గాదేవి పూజ చేసుకుంటారు. కొత్తగా వ్యాపారం ప్రారంభించేవారు దుర్గాష్టమి, విజయదశమి రోజుల్లో ఆరంభించడం శుభసూచకంగా భావిస్తారు. సినిమా పరిశ్రమలోనూ ఈ నమ్మకం ఉంది. ఈ రోజుల్లో అనేక సినిమాలను విడుదల చేస్తారు. స్త్రీ, పురుషులనే తేడా లేకుండా అందరూ దుర్గాదేవిని అర్చిస్తారు. దుర్గాష్టమి రోజున ఉపవాసం ఉంటారు. నవరాత్రులను పురస్కరించుకుని భక్తులు శక్తిపీఠాలను దర్శించుకుంటారు. దుర్గాష్టమి, విజయదశమి విశేష పర్వదినాల్లో ప్రత్యేకంగా అమ్మవారి ఆలయాలకు వెళ్ళి పూజలు చేయించుకుంటారు.నిత్యజీవితంలో ఎన్నో కష్టాలు మనల్ని వెంటాడుతూ భయకంపితుల్ని చేస్తుంటాయి. దుఃఖసంద్రంలో ముంచెత్తి మానసికమైన ఒత్తిళ్ళకు గురి చేస్తుంటాయి. దారిద్ర్యం తాండవిస్తూ మనల్ని నిరాశావాదమనే ఊబిలోకి నెట్టేస్తుంది. ఇలాంటి క్లిష్టపరిస్థితులలో ఒక్కసారి అమ్మ నామాన్ని స్మరించడాం, అమ్మ గుణాల్ని కీర్తించడం, అమ్మ రూపాన్ని దర్శించడం వల్ల ఎనలేని కష్టాలూ, అంతులేని అవాంతరాలూ అంతరించిపోతాయి. మన దుఃఖాలు, దారిద్ర్యం భయం, పోయేందుకు దుర్గాదేవిని స్తుతించాలని ’దేవీ మహాత్మ్యం’ సూచిస్తోంది.
దుర్గే స్మృతా హరసి భీతి మశేష జన్తోః
స్వస్థై స్మృతా మతిమతీవ శుభాం దదాసి
దారిద్ర్య దుఃఖ భయహారిణి కా త్వదన్యా
సర్వోపకార కరణాయ సదార్ద్ర చిత్తా!! (దేవీ మాహాత్మ్యం 4-17)
ప్రపంచాన్ని అంతటినీ పట్టి పీడిస్తున్న దుర్గమాసురుణ్ణి సంహరించడం బ్రహ్మాది దేవతలకు దుర్గమమైంది. అప్పుడు దుర్గమాసురుని బారినుండి తమను రక్షించాల్సిందిగా ఋషులు పార్వతీదేవిని వేడుకున్నారు. కరుణాస్వరూపిణి అయిన అమ్మ మనస్సు కరిగి, దుర్గమాసురుణ్ణి సంహరించింది. జగన్మాత, దుర్గమాసురుణ్ణి సంహరించడం వల్ల ’దుర్గ’గా ఆరాధనలు అందుకుంటోంది. మనకు కలిగే దుర్గమమైన కష్టాలను సైతం అంతరింపజేస్తుంది.
దేవి నవరాత్రులలో ఎనిమిదవ రోజు విశేషాలు…
తేదీ | 22 అక్టోబర్ 2023 |
వారం | ఆదివారం |
తిధి | అష్టమి |
అమ్మవారి అవతారం | శ్రీ మహాదుర్గ దేవి |
అమ్మవారి వస్త్ర అలంకారం | ఎరుపు రంగు చీర |
అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యం | కదంబం / కలగలుపు కూర |
అమ్మవారికి సమర్పించవలసిన పుష్పాలు | ఎర్రటి పువ్వులు |
చదవవలసిన శ్లోకం / స్తోత్రం | దుర్గా అష్టోత్తరం, దుర్గా సూక్తం, దుర్గాసప్తశతీ పారాయణ |