TDP
చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉండటం ఏమోగానీ తెలుగు దేశం దిక్కు తోచని స్థితిలో పడిపోయింది. ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ ఏం చేయాలో పాలు పోని పరిస్థితి.. దసరాకు టీడీపీ మేనిఫెస్టో విడుదల చేస్తామన్న పార్టీ ఇప్పుడు దిక్కులు చూస్తోంది. ఇక సెంటిమెంట్ అస్త్రమొక్కటే కష్టాలనుంచి బయట పడేస్తుందని పార్టీ నమ్ముతున్నట్లుగా ఉంది. అందుకే చంద్రబాబు జైలు నుంచి రాసినట్లుగా ఓ లేఖ బయటకొచ్చింది. ప్రజలకు అండగా ఉండేందుకు నారా భువనేశ్వరి జనంలోకి వస్తారన్నది ఆ లేఖ సారాంశం.. దీన్ని బట్టి చూస్తే లోకేష్ అరెస్టు కూడా ఎప్పుడో ఒకప్పుడు తప్పదు అనే అనుమానాలుండబట్టే ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. భువనేశ్వరి నిజం గెలవాలి అనే పేరుతో ఇప్పుడు జనం మధ్య తిరుగుతారట. చంద్రబాబు జైలు పాలవడం చూసి తట్టుకోలేక, తల్లడిల్లిపోయి చనిపోయిన కుటుంబాలను భువనేశ్వరి పలకరిస్తారని, పరామర్శిస్తారని వార్తలొస్తున్నాయి. చంద్రబాబు లేఖలో వాస్తవాలకన్నా.. కవితాత్మకంగా నిజానికి దూరంగా వ్యాఖ్యానాలున్నాయి. ఈ “చీకట్లు తాత్కాలికం.. సత్యం అనే సూర్యుడి ముందు కారు మబ్బులు విడిపోతాయి. సంకెళ్లు నా సంకల్పాన్ని బంధించలేవు. జైలు గోడలు ఆత్మ విశ్వాసాన్ని దెబ్బ తీయలేవు. జైలు ఊచలు ప్రజల నుంచి దూరం చేయలేవు “ అంటూ మోస్ట్ ఎమోషనల్ గా కవితాత్మకంగా ఆ లేఖ సాగింది. చంద్రబాబుది సాధారణంగా అంత ఎమోషనల్ గా స్పందించే నైజం కాదు. అసలు ఆయన నవ్వడమే తక్కువ. ఎప్పుడూ సీరియస్ గానే ఉంటారు. ఆయన బాడీ లాంగ్వేజ్ కు విరుద్ధంగా ఆయన రాసిన లేఖ ఉండటంతో అది టీడీపీలో ఎవరో సీనియర్లు రాసి ఉంటారనిపిస్తోంది.
యాత్ర నుంచి పేర్ల వరకూ అన్నీ కాపీనే… TDP
ఏదేమైనా టీడీపీ ఇప్పుడు వైసీపీనే అనుసరిస్తోంది. చివరకు ఇప్పుడు భువనేశ్వరి పరామర్శ యాత్ర కూడా కాపీనే. సవాళ్ళకు ఎదురొడ్డి పోరాడే నైజం కలిగిన జగన్ మోహన్ రెడ్డి ఆరోజు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు పెట్టినప్పుడు ధైర్యంగా జైలుకు వెళ్లారు. తనకు ఎదురొచ్చిన ప్రతీ అవమానాన్ని ధైర్యంగా స్వీకరించి ముందడుగేశారు. ఆయన కుటుంబానికున్న చరిష్మా అప్పట్లో ఒక పాజిటివ్ వేవ్ క్రియేట్ అవడానికి కారణమైంది. వైఎస్ చనిపోయినప్పుడు తల్లడిల్లి పోయి వందల సంఖ్యలో జనం ప్రాణాలొదిలారు. ఆ కుటుంబాలను పరామర్శించడానికే తదనంతర కాలంలో జగన్ ఓదార్పు యాత్ర చేపట్టారు. తెలుగు దేశం ఇప్పుడు ఈ పద్ధతిని కాపీ కొడుతోంది. చంద్రబాబు జైల్లో ఉండటం, లోకేష్ భవిష్యత్తు అగమ్య గోచరంగా ఉండటంతో భువనేశ్వరి రంగంలోకి దిగుతున్నారు. గతంలో జగన్ జైల్లో ఉన్నప్పుడు విజయమ్మ, షర్మిల రాష్ట్రం నలుమూలలా తిరిగి తమకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. ఆ మాదిరిగానే భువనేశ్వరి ఇప్పుడు రాష్ట్ట్రం అంతటా పర్యటిస్తారట. ఈ యాత్రకు నిజం గెలవాలి అని పేరు పెట్టారు. వైఎస్ భార్యను విజయమ్మ అని సంబోధించినట్లుగానే భువనేశ్వరిని కూడా భువనమ్మ అంటూ సంబోధిస్తూ వార్తలు రాస్తోంది టీడీపీ మీడియా. మరి చనిపోయిన కుటుంబాలకు డబ్బులు కూడా ఇస్తారా అన్నదానిపై క్లారిటీ లేదు.
పగ్గాలు నారా వారి చేతుల్లోనే
ఇంత సీరియస్ విషయంలోనూ పరిశీలించదగ్గ అంశం ఒకటుంది. అదే బాలకృష్ణ వ్యవహారం. చంద్రబాబు జైలు పాలవగానే రాష్ట్రమంతా కలియతిరిగి పార్టీని నిలబెడతానని స్వచ్ఛందంగా ముందుకొచ్చినా, బాలయ్యను పక్కన పెట్టి భువనేశ్వరిని తెరపైకి తేవడం చూస్తుంటే.. చింత చచ్చినా పులుపు చావలేదన్న సామెత గుర్తుకొస్తోంది. ఇంత జరిగినా టీడీపీ పగ్గాలు నందమూరి కుటుంబానికి దక్కకుండా నారా కుటుంబం చెప్పు చేతల్లోనే ఉండేలా బ్రహ్మాండమైన స్కెచ్ కు చంద్రబాబు, లోకేష్ తెర తీశారని తెలుగు తమ్ముళ్లే చెప్పుకుంటున్నారు.మొత్తం మీద భువనేశ్వరి మార్క్ ఓదార్పు యాత్ర “నిజం గెలవాలి” తిరుపతి నుంచి మొదలవుతుందని తాజా సమాచారం. శ్రీవారి దర్శనం అనంతరం మూడు రోజుల పాటు తిరుపతిలో భువనేశ్వరి బస్సు యాత్ర చేస్తారన్నది తాజా అప్డ్డేట్..టీడీపీ ఎమోషనల్ గేమ్ ఎంతవరకూ వర్కవుట్ అవుతుందో చూడాలి… TDP