BJP
సినీ నటి గౌతమి బీజేపీకి రాజీనామా చేశారు. తమిళనాడు బిజేపీకి 20 ఏళ్లుగా సేవలందిస్తున్న గౌతమి ఇటీవల తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. తన ఆస్తులు, ఇతర డాక్యుమెంట్లను చోరీ చేసి పరారీలో ఉన్న అళగప్పన్ అనే వ్యక్తికి బీజేపీ సీనియర్లు పరోక్షంగా సహాయ సహకారాలు అందిస్తుండటం తనను కలచి వేసిందని, పార్టీని నమ్ముకుని ఇన్నేళ్లు జీవితాన్నే అంకితం చేసిన తనకు ఇంత నిరాదరణ చూపడం అన్యాయమని గౌతమి ఆవేదన వ్యక్తం చేశారు.
అందుకే బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు సుదీర్ఘ లేఖను విడుదల చేశారు. తాను ఒంటరి తల్లినని, తన కుమార్తెతో కలసి ఉంటున్న తనను పార్టీ ఆదుకుని, సామాజిక భద్రత కల్పించాల్సింది పోయి, పార్టీలోని వ్యక్తే మోసగిస్తే.. చర్యలు తీసుకోకుండా వెనకేసుకు రావడం తనను బాధపెట్టిందని తన సుదీర్ఘమైన లేఖలో గౌతమి పేర్కొన్నారు. 17 ఏళ్ల వయసులో సినీ రంగంలోకి అడుగు పెట్టి, యావద్దేశం గుర్తుంచుకునే పాత్రలను చేసిన తాను జాతీయతా భావంతోనే బీజేపిలో చేరి పార్టీ కోసం నిస్వార్ధంగా పనిచేశానని చెప్పారు. తాను చెమటోడ్చి సినీ రంగంలో కష్టపడి సంపాదించిన ఆస్తులను, సంబంధిత పత్రాలు, ఇతర డాక్యుమెంట్లను న్యాయంచేస్తానంటూ అళగప్పన్ తీసుకుని ఇన్నేళ్లుగా ఏమీ చేయలేదని అన్నారు. ఆపై తమ కుటుంబంలో భాగమేనని నమ్మబలికి తన దగ్గర నుంచి పత్రాలను తీసుకుని ఉడాయించాడని అతగాడిపై చర్యలు తీసుకోకుండా పార్టీ పెద్దలే వెనకేసుకు రావడం ఆశ్చర్య పరిచిందన్నారు.
ఆస్తి పత్రాలతో ఉడాయించిన BJP నేత
తల్లి దండ్రులను కోల్పోయి చిన్న బిడ్డతో ఓంటరి జీవితం గడుపుతున్న తనను నమ్ముకున్న పార్టీయే నట్టేట ముంచిందన్నారు. 2018 ఎన్నికల్లో రాజ్ పాళ్యం నియోజక వర్గం టిక్కెట్ ను ఆశించిన గౌతమి అది దక్కకపోవడంతో నిరాశ పడ్డారు. అయినప్పటికీ పార్టీ కోసం కష్ట పడి పనిచేసి, ప్రచారం చేశారు. అప్పటినుంచీ పార్టీ కోసం కష్టపడుతూనే ఉన్నారు.పార్టీకి చెందిన సీనియర్ నేత అళగప్పన్ ను నమ్మి తన ఆస్తుల నిర్వహణ భాధ్యతలను ఆమె అప్పగించారు.
తన భూముల విక్రయ బాధ్యతలను అప్పగిస్తే మోసం చేసిన అళగప్పన్ అప్పటినుంచి పరారీలో ఉన్నాడన్నారు. తన కుటుంబంలోకి తనను , తన కుమార్తెను స్వాగతిస్తున్నట్లు నటిస్తూనే నమ్మక ద్రోహానికి పాల్పడ్డాడని ఆరోపించారు. అ ళగప్పన్ పై సుదీర్ఘ కాలంగా న్యాయ పోరాటం చేస్తున్నా, పార్టీనుంచి ఎలాంటి సహాయ సహకారాలు లేకపోవడం నిరాశపరిచిందన్నారు. పైపెచ్చు పార్టీలో సీనియర్లు అళగప్పన్ కు మద్దతు తెలపడం దారుణమని గౌతమి ఆరోపించారు. తాను కోల్పోయిన ఆస్తుల విక్రయ పత్రాలను, ఇతర డాక్యుమెంట్లను సాధించేందుకు పోరాటం చేస్తున్నట్లు ముఖ్యమంత్రి స్టాలిన్, పోలీసులు, ఇతర న్యాయవ్యవస్థలు తనకు న్యాయం చేస్తాయన్న నమ్మకంతో ఉన్నట్లుగా గౌతమి బీజేపీ కేంద్ర కార్యాలయానికి రాసిన లేఖలో తెలిపారు.
నేను ఒంటరి మహిళను…
బీజేపీకి బాధా తప్త హృదయంతోనే రాజీనామా చేస్తున్నానని గౌతమి తెలిపారు. ఒక సింగిల్ పేరెంట్ గా, ఒంటరి మహిళగా, తన కోసం, తన కుమార్తె భవిషయత్తు కోసం పోరాటాన్ని కొనసాగిస్తున్నానన్నారు. విశాఖ పట్నం గీతం కాలేజీ విద్యార్ధిని అయిన గౌతమి 17 ఏళ్ల వయసులోనే సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. చేసిన పాత్రలు తక్కువే అయినా మంచి పేరు, గుర్తింపు తెచ్చుకున్నారు. మధ్య లో కేన్సర్ బారిన పడినా కోలుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించారు.నటుడు కమల్ హాసన్ తో కొంతకాలం కలసి ఉన్నా ఆ తర్వాత అభిప్రాయ బేధాలు రావడంతో విడిపోయారు. అప్పటినుంచి బీజేపీ పార్టీకి పనిచేస్తూ ఉన్నారు. గౌతమి తాజా నిర్ణయం తమిళనాడు బీజేపీకి కొంత దెబ్బే.. పార్టీ అధినాయకత్వం ఇప్పటి వరకూ దీనిపై స్పందించలేదు.