Qatar
దేశం కానీ దేశంలో బతుకు తెరువు కోసం వెళ్లి అక్కడ గూఢచర్యం ఆరోపణల్లో చిక్కుకుని మరణ శిక్ష పడితే ఆ బాధ ఎలా ఉంటుందో ఊహించడానికి కూడా కష్టం.. మన దేశంలో త్రివిధ దళాల్లో ఒకటైన భారత నావికా దళంలో అత్యంత సీనియర్ స్థాయిలో సేవలందించిన 8 మంది భారత మాజీ నేవీ అధికారులు ఇప్పుడు ఇదే సంక్లిష్ట పరిస్థితుల్లో చిక్కుకుని నిద్రాహారాలు లేక అల్లాడుతున్నారు. వీరిలో విశాఖకు చెందిన ఓ తెలుగు అధికారి కూడా ఉండటం విషాదకరం.. వారి విడుదలకు అవసరమైన న్యాయ మార్గాలన్నింటినీ అన్వేషిస్తున్నామని కేంద్రం చెబుతున్నా ఆ అధికారుల కుటుంబాలు బిక్కు బిక్కు మంటూ తమ వారి కోసం ఎదురు చూస్తున్నాయి. ప్రాణాలతో తిరిగొస్తారనే ఆశలు అడుగంటడంతో క్షణమొక యుగంలా గడుపుతున్నాయి.
వివరాల్లోకి వెళితే…
ఖతార్ లో 8 మంది భారతీయ నేవీ మాజీ అధికారులకు మరణ శిక్ష విధించారు. గూఢచర్యానికి పాల్పడి ఇజ్రాయెల్ కు సహకరిస్తున్నారన్న ఆరోపణలపై 8 మంది భారతీయులు ఇప్పటికే కఠిన జైలు శిక్షను అనుభవిస్తున్నారు. ఈ ఎనిమిది మందిని గత ఏడాది ఆగస్టులో అరెస్టు చేశారు. అప్పటినుంచి వారంతా ఏకాంత కఠిన కారాగార వాసాన్ని అనుభవిస్తున్నారు.
భారత్ తీవ్ర దిగ్భ్రాంతి… Qatar
9మంది మాజీ నేవీ అధికారులకు ఇంత కఠినమైన శిక్ష విధించడం పట్ల భారత్ తీవ్రమైన దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేసింది. వారిని రక్షించేందుకు ఉన్న అన్ని లీగల్ అవకాశాలను పరిశీలిస్తోంది. వీరందరూ కూడా నేవీలో మంచి కమిట్ మెంట్ తో సర్వీస్ చేసినవారే. వీరిలో ఓ తెలుగు అధికారి కూడా ఉండటం విశేషం. కమాండర్లు పూర్ణేందు తివారీ, సుగుణాకర్ పాకాల, అమిత్ నాగ్ పాల్, సంజీవ్ గుప్తా, కెప్టెన్ నవతేజ్ సింగ్ గిల్, కెప్టెన్ బీరేంద్ర కుమార్ వర్మ, కెప్టెప్ సౌరభ్ వశిష్ట్, సైలర్ రాగేష గోపకుమార్ వీరంతా గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వీరిలో సుగుణాకర్ పాకాల అన్న అధికారి విశాఖకు చెందిన వారు. వీరంతా నేవీలో అత్యున్నత స్థాయిలో 20 ఏళ్ల పాటు సేవలందించారు. జూనియర్స్ కు శిక్షణ, గైడెన్స్ ఇచ్చిన వారు.
వీరిలో కమాండర్ పూర్ణేందు తివారీకి ప్రవాస భారతీయ సమ్మాన్ అనే ప్రవాస భారతీయులకిచ్చే అత్యున్నత అవార్డు కూడా ఇచ్చారు. భారత దేశ ఖ్యాతిని విదేశాల్లో వ్యాపింప చేసినందుకు ఆయనకు దోహాలో ఇండియన్ ఎంబసీలో ఉద్యోగం చేస్తున్న సమయంలో ఈ అవార్డును ఇచ్చారు.
ఖతార్ లో వీరంతా ఏం చేశారు?
వీరంతా దోహాలోని దహ్రా గ్లోబల్ టెక్నాలజీస్, అండ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ అనే ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేశారు. ఖతార్ ఆర్మీ బలగాలకు ఈ కంపెనీ శిక్షణ ఇవ్వడమే కాక ఇతర సర్వీసులు కూడా అందించింది.రాయల్ ఒమన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన ఖమీస్ ఆల్ అజ్మీ అనే రిటైర్డ్ స్వ్కాడ్రన్ లీడర్ ఈ కంపెనీని స్థాపించాడు. అయితే ఈ ఎనమండుగురు భారతీయులతోనూ ఖమిస్ ను కూడా అరెస్టు చేసినా 2022లో నవంబర్ లో అతడిని వదిలిపెట్టారు. Qatar
అత్యంత సెన్సిటివ్ ప్రాజెక్ట్ చేస్తున్న భారతీయులు
మరణ శిక్ష పడిన మన భారతీయ అధికారులంతా ఇటాలియన్ టెక్నాలజీతో రూపొందిస్తున్న అత్యంత రహస్య మైన స్టెల్త్ లక్షణాలు కలిగిన మిడ్జెట్ జలాంతర్గాముల ప్రాజెక్టు కోసం పనిచేస్తున్నారు. ఈఏడాది మేలో ఆల్ దహరా గ్లోబల్ సంస్థ తన ఆపరేషన్స్ అన్నింటినీ మూసివేయడంతో అందులో పనిచేసే భారతీయులంతా స్వదేశానికి వచ్చేశారు.
అరెస్టుకు కారణాలేంటి? Qatar
ఖతార్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ 2022 ఆగస్టు 30న ఈ 8 మంది భారతీయులను అరెస్టు చేసింది. అయితే అరెస్టుకు కారణాలను అటు ఖతార్ అధికారులు కానీ, ఇటు భారత అధికారులు కానీ బయటకు వెల్లడించలేదు. గూఢచర్యానికి పాల్పడ్డారనే ఆరోపణలపైనే ప్రధానంగా వారిని అరెస్టు చేశారు. ఖతారీ చట్టాల ప్రకారం వారిపై విచారణ కూడా పూర్తయ్యింది. బెయిల్ కోసం వారు పెట్టుకున్న దరఖాస్తులను అనేక మార్లు తిరస్కరించారు. వీరికి మరణశిక్ష విధించినట్లు చేసిన ప్రకటన అక్కడ సంచలనంగా మారింది.
మరి భారత్ ఏం చేస్తుంది?
అయితే తీర్పుకు సంబంధించిన పూర్తి కాపీ కోసం ఎదురు చూస్తున్నట్లు వారిని రక్షించేందుకు అవసరమైన అన్ని న్యాయ పరమైన అవకాశాలను పరిశీలిస్తున్నట్లు భారత్ ప్రకటించింది. వారి కుటుంబ సభ్యులతోనూ, న్యాయవాదులతోనూ సంప్రదింపులు జరుపుతున్నామని, రక్షణకు అవకాశమున్న అన్ని మార్గాలను పరిశీలిస్తున్నామని విదేశాంగ శాఖ ప్రకటించింది. ఖతార్ లో ఉన్న భారతీయులందరికీ కాన్సులర్, న్యాయపరమైన సహాయాన్ని కొనసాగిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే మరణ శిక్ష పడిన తమ వారందరికీ క్షమా భిక్ష పెట్టాలంటూ ఆయా నేవీ అధికారుల కుటుంబాలు ఎమిర్ ఆఫ్ ఖతార్ కు దరఖాస్తు చేసినట్లు వార్తలు వస్తున్నా వాటిని ఇంకా థృవీకరించలేదు. Qatar