(TS)
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరుకుంది.
రేవంత్ వర్సెస్ కేటీఆర్ మాటల తూటాలు పేలుతున్నాయ్.. ఈసారి ఎన్నికలు అత్యంత కీలకం కాబోతున్నాయ్.. ఇలాంటి ఎన్నికల్లో తెలంగాణ గడ్డపై పుట్టిన ఓ పార్టీ మహాభినిష్క్రమణం దిశగా సాగుతోంది. తెలంగాణ గడ్డపై పుట్టిన తెలుగు దేశం పార్టీ ఈ ఎన్నికల తర్వాత ఈ ప్రాంతంలో అంతర్ధానమవుతుందా?పరిస్థితులు అలాగే కనిపిస్తున్నాయ్. చంద్రబాబు రాజమండ్రి జైలు కెళ్లడంతో టీడీపీ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుక చందంగా తయారైంది. ఏం చేయాలో తెలీదు. ఓ నిర్దిష్ట కార్యక్రమం లేదు. దిశా నిర్దేశం లేదు. ఏపీలో ప్రతీ లీడరు వీధికెక్కి జగన్ ను తిట్టేసి చేతులు దులిపేసుకుని పోయి చక్కా ఇంట్లో కూర్చుంటున్నారు.
అక్కడ అరెస్టు.. ఇక్కడ ఆక్రందనలు (TS)
చంద్రబాబు అరెస్టయ్యింది ఏపీలో అయితే తెలంగాణలో దాని రియాక్షన్ ఎక్కువ కనిపిస్తోంది. తెలంగాణలో తెలుగు తమ్ముళ్లు చొక్కాలు చింపేసుకుంటున్నారు.. ఇన్ సాలిడారిటీ విత్ బాబు లాంటి ప్లకార్డులతో ఐటీ ఉద్యోగులు వీధులకెక్కి ఉద్యమాలు చేసేస్తున్నారు. మెట్రో రైళ్లు ఆపేసి నానా యాగీ చేసేస్తున్నారు.ఐటి పితామహుడంటూ పొగడ్తలు కురిపిస్తున్నారు. మీరు లేకపోతే మా జీవితాలే లేవంటూ నిత్య హారతులు పడుతున్నారు.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలుగు దేశాన్ని గెలిపించుకుంటాం అన్నట్లుగా ఉంది వారి హడావుడి.. పార్టీ నేతలు, కేడర్, కార్యకర్తలు ఇంత జోష్ మీదుంటే చంద్రబాబు ఈ ఉత్సాహాన్ని, ఈ పట్టుదలని, ఈపంతాన్ని తుస్సుమనిపించేశారు. ఈసారి తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ తూచ్ అనేశారు. పోటీ కి దిగొద్దని సర్ది చెప్పేశారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో తెలుగు తమ్ముళ్లు ఈనిర్ణయంపై మండిపడ్డారు. బాహా బాహీకి దిగారు.. కాసాని జ్నానేశ్వర్ వారికి సర్ది చెప్పలేక నానా పాట్లూ పడ్డారు.
కేడర్ లో అంత ఊపు ఉన్నప్పుడు తెలుగు దేశం ఎందుకు తెలంగాణలో తోక ముడిచేసిందిన్నది ప్రశ్న… మనకి ఏపీ ఎన్నికలే ఇంపార్టెంట్. పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉంది సహకరించండి అంటూ చంద్రబాబు కాసానిని కోరారుట. దాంతో మింగా లేక , కక్కా లేక జ్నానేశ్వర నీళ్లు నమిలేశారు. అసలు తెలుగు దేశానికి తెలంగాణలో ఉన్న బలం వాపా, బలుపా అనే డౌట్ వస్తుంది. తెలుగు తమ్ముళ్లేమో ఓ లెవెల్లో చెలరేగి పోటీకి సై అంటుంటారు. తీరా ఎన్నికలు జరిగాక పార్టీ సోదిలోకి కూడా కనపడదు. కనీసం రెండు, మూడో స్థానంలో కూడా పార్టీ ఉండదు.. అయినా కేడర్ బలంగా ఉంది.. చెక్కు చెదర లేదు అనే వ్యాఖ్యానాలే వినిపిస్తుంటాయి. అయినా ఒక్కటంటే ఒక్క సీటు గెలిచింది లేదు. అక్కడా, అక్కడా మిగిలిన నేతలను బీఆర్ ఎస్ పార్టీ ఎగరేసుకు పోయింది. ఎంతో సౌమ్య శీలుడు, పెద్ద మనిషిగా పేరు పడ్డ రావుల చంద్రశేఖర్ రెడ్డి కూడా చివరికి బీఆర్ ఎస్ లో చేరిపోయారు.
(TS)
మరోవైపు తెలుగుదేశం తెలంగాణలో పోటీకి దిగకపోవడానికి మరో కారణం కూడా కనిపిస్తోంది. కేసీఆర్ తో అమీ తుమీకి సిద్ధపడ్డ రేవంత్ రెడ్డికి సాయపడటానికే చంద్రబాబు ఈ ఎన్నికల్లో పోటీకి దిగలేదన్నది మరో వాదన. తెలంగాణలో సెటిలర్లంతా ఈసారి కాంగ్రెస్ కి ఓటేసే అవకాశాలున్నాయని రేవంత్ సీఎం అవ్వొచ్చన్నది ఒక థియరీ. ఓటుకు నోటు కేసులో పట్టుబడి చంద్రబాబు కోసం నిందితుడి ముద్ర భరిస్తున్న రేవంత్ కు హైప్ వచ్చి సీఎం అయితే తనకు తెలంగాణపై కూడా పట్టు ఉంటుందని చంద్రబాబు లెక్కేసి ఉండొచ్చు.. రేవంత్ రెడ్డి చంద్రబాబుకి రామభక్త హనుమాన్ లాంటి వాడు.
పవన్ కోసమే ఈ నిర్ణయమా?
చంద్రబాబు పోటీకి దిగొద్దని చెప్పడానికి కారణం మరోటి ఉంది. జనసేనతో టీడీపీ ఏపీలో పొత్తులో ఉంది. అదే జనసేనానిని అమిత్ షా పిలిచి తెలంగాణ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు సంగతి తేల్చాలంటూ అల్టిమేటం ఇచ్చారు. అంటే జనసేన బీజేపీతో కలసి తెలంగాణలో పోటీ చేస్తోంది కాబట్టి జనసేనకు సంఘీభావంగా టీడీపీ పోటీలో లేదనే వివరణలు వినిపిస్తున్నాయి. ఏతావాతా టీడీపీ కమ్మ సామాజిక సెటిలర్ల ఓట్లన్నీ ఇప్పుడు పవన్ కల్యాణ్ ద్వారా (అంటే మిత్రుడైన చంద్రబాబు వర్గం ద్వారా) బీజేపీ ఖాతాలో పడేలా చేయాలన్నది అమిత్ షా జనసేనానికి పెట్టిన టార్గెట్ లా కనిపిస్తోంది. సెటిలర్ల ఓట్లు చీలకూడదన్న ఉద్దేశంతో చంద్రబాబు పార్టీని పోటీకి దిగొద్దన్నారా? బీజేపీ నేరుగా అడగక పోయినా ఆ పార్టీకి సాయం చేస్తున్నారా?దీని సంగతేమో కానీ చంద్రబాబు బయట ఉన్నప్పుడే సెటిలర్ల ఓట్లు టీడీపీకి పడలేదు. అవే పడి ఉంటే గతంలో కూకట్ పల్లినుంచి చంద్రబాబు మేనకోడలు నందమూరి సుహాసిని గెలిచి ఉండేది. ఇది వాస్తవం. అయినా కానీ తెలుగు దేశం తెలంగాణలో తమకేదో సీన్ ఉందని భ్రమిస్తూ ఉంటుంది. ఆ ఊహే ఆ పార్టీకి చాలా కొత్తగా, గమ్మత్తుగా అనిపిస్తుంది కామోసు. (TS)