train
ఇటీవల కాలంలో జరుగుతున్న రైలు ప్రమాదాల కారణాలు చూస్తే ఆ శాఖ అధికారులు, సిబ్బంది మొద్దు నిద్దరోతున్నట్లు కనబడుతోంది. విజయనగరం జిల్లా కంటకాపల్లి వద్ద రాయగడ విజయవాడ ఎక్స్ ప్రెస్ రైలుప్రమాదానికి గురైన తీరు రైల్వే శాఖ నిర్లక్ష్యానికి అడ్డం పడుతుంది. ఆగి ఉన్న ప్యాసింజర్ రైలును మరో రైలు వెనుక నుంచి ఢీ కొనడమా? ఆశ్చర్యం కదూ..? అప్పుడప్పుడు మనం పత్రికల్లో చూస్తుంటాం ఆగి ఉన్న లారీని వెనుక నుండి మరో వాహనం ఢీ కొని ప్రమాదం జరిగినట్లు..! అది నడిరోడ్డు కాబట్టి అప్పుడప్పుడు అలా జరుగుతుంటాయి. మరి రైల్వే శాఖలోనూ అదే తీరా..? రైల్వే అధికారులు గొప్పలు చెప్పుకునే అధునాతన.., అత్యాధునాతన టెక్నాలజీ, సిగ్నలింగ్ వ్యవస్థ.. సుశిక్షితులైన ఉద్యోగులు, సిబ్బంది..పటిష్ఠ భద్రతా చర్యలు ఇవన్నీ వట్టి మాటలేనా..! అవన్నీ రైలు ప్రమాదాలు జరుగుతున్నప్పుడు ఏమైపోయినట్టు..? రైలెక్కిన ప్రయాణికుడు ప్రాణాలతో గమ్యస్థానానికి చేరుకుంటే మరో జన్మ ఎత్తినట్లుగా పరిస్థితి అతి దారుణంగా తయారయింది.
ఈ అభద్రతా భావానికి పుల్ స్టాప్ ఎప్పుడు పడుతుంది..? ఆ శాఖ అధికారులే సమాధానం చెప్పాలి.
అలా అని ఏవో కుంటిసాకులు చూపించి తప్పించుకునే ధోరణి సరికాదు. బాలాసూర్ రైలు ప్రమాద ఘటన మరువక ముందే అదే తరహాలో మరో ఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో 14 మంది ప్రాణాలు కోల్పోగా వందలాది మంది క్షతగాత్రులు అయ్యారు. రాయగడ ఎక్స్ప్రెస్ మూడు భోగీలు, ఆగి ఉన్న పలాస ప్యాసింజర్ రెండు బోగీలు ధ్వంసమయ్యాయి. హుటాహుటిన అధికారులు ప్రభుత్వం స్పందించి సహాయక చర్యలు చేపట్టినా… ఎక్స్గ్రేషియోలు అందించినా… పోయిన ప్రాణాలను తీసుకురాలేవు….ఈ ప్రమాద ఘటనతోనైనా రైల్వే శాఖ ప్రయాణికుల భద్రతపై దృష్టి పెట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు.
కంటకాపల్లి రైలు ప్రమాదంతో ప్రయాణికుల అవస్థలు…
కంటకాపల్లి రైలు ప్రమాదంతో ప్రయాణికుల అవస్థలు విశాఖ మీదుగా వెళ్లాల్సిన 24 రైళ్ల రద్దు మరో 26 రైళ్ల దారి మళ్లించారు. విశాఖ రైల్వే స్టేషన్లో చిక్కుకున్న రైళ్లు ప్రయాణికులు వారంతా హెల్ప్ లైన్ కేంద్రాల వద్ద క్యూ ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తున్న హెల్ప్ లైన్ సిబ్బంది. రద్దైన రైళ్ల టికెట్ల సొమ్ము వాపసు చేసేందుకు రైల్వే అధికారుల కసరత్తులు చెస్తున్నారు. రోడ్డుమార్గం ద్వారా గమ్యస్థానాలకు చేరుతున్న కొంతమంది ప్రయాణికులు ప్రత్యామ్నాయ రైళ్ల కోసం స్టేషన్లో పడిగాపులు కాస్తున్న మరికొంత మంది ప్రయాణికులు.
రైలు ప్రమాదంలో మృతి చెందినవారు వీరే…. train
విజయనగరం రైలు ప్రమాదంలో ఇప్పటి వరకు మృతి చెందిన వారిలో గిడిజాల లక్ష్మీ, కంచు బాకత్ రవి, చల్లా సతీష్, లోకో పైలట్ ఎస్ ఎం రావు, కరణం అక్కల నాయుడు, నాగరాజు, టి. సుగుణమ్మలుగా గుర్తించారు అధికారులు. మృతులు అంతా ఉత్తరాంధ్రకు చెందిన వారేనని తెలుస్తోంది. కాగా, మృతదేహలను పోస్ట్ మార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
బాలాసోర్ ఘటన మరవకముందే.. మరో ఘోరం…..
బాలాసోర్ ఘటన జరిగి నాలుగు నెలలు గడిచినా ఆ మహా విషాదం ఇంకా కళ్లముందే కదులుతోంది. ఇంతలోనే మరో ఘోరం కళ్లు మూసి తెరిచేలోపు క్షణాల్లో ప్రమాదం జరిగిపోయింది. విజయనగరం జిల్లాలో జరిగిన రైలు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మరికాసేపట్లో విజయనగరం జిల్లాకు వెళ్లనున్నారు ఏపీ సీఎం జగన్. రైలు ప్రమాద ఘటనాస్థలాన్ని పరిశీలించి, ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శిస్తారు. ఇప్పటికే రైలుప్రమాద మృతుల కుటుంబాలకు పదిలక్షల చొప్పున, నష్టపరిహారం ప్రకటించారు.
రైలు ప్రమాదంపై రివ్యూ… train
కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రమాదంపై రివ్యూ నిర్వహించారు. అసలేం జరిగింది, ప్రమాదానికి కారణాలేంటి అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. మరోవైపు ప్రమాదం స్థలంలో కొనసాగుతున్న సహాయక చర్యలపై ఆరా తీస్తున్నారు మంత్రి. అటు ఇదే రైలు ప్రమాదం కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు తమిళనాడు సీఎం స్టాలిన్. తరచూ ఇలాంటి ప్రమాదాలు సంభవించడం ప్రమాద ఘంటికలను సూచిస్తోందని అని అన్నారు స్టాలిన్.
బాధితులకు జగన్ పరామర్శ
కంకటా పల్లి దగ్గర రైల్వే లైన్ పునరుద్ధరణ పనులు వేగం పుంజుకున్నాయి. మరోవైపు సీఎం జగన్ ఆ ప్రాంతానికి వస్తే సహాయ చర్యలు, పునరుద్ధరణ పనులు ఆలస్యమవుతాయని అధికారులు సూచించడంతో ఆయన తన ప్రయాణాన్ని కుదించుకున్నారు. ఆస్పత్రికి వెళ్లి బాధితులను పరామర్శించి, రైల్వేఅధికారులు, జిల్లా కలెక్టరుతో పరిస్థితిని సమీక్షించారు. రైలు ప్రమాద దృశ్యాల ఫోటోలను చూశారు. అనంతరం అక్కడనుంచి హెలికాప్టర్ల్లో బయల్దేరి వెళుతూ రైలు ప్రమాదం ఏరియల్ వ్యూ చూశారు.