తెలంగాణ తెలుగు దేశం పార్టీ (TDP) కి కాసాని జ్నానేశ్వర్ రాజీనామా చేశారు. పార్టీని పునర్నిర్మించి, మళ్లీ జవ జీవాలు పోయాలనుకున్న కాసానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మైండ్ బ్లాంక్ అయ్యేలాంటి ఆదేశాలిచ్చారు. తెలంగాణలో టీడీపీ పోటీ చేయదు అని.. ఆదెబ్బకి కాసానికి దిమ్మ తిరిగి బొమ్మ కనపడింది. తెలంగాణలో తెలుగు దేశాన్ని బతికించుకోడానికి తన సొంత ఆస్తులు కూడా కరిగించి కాసాని కష్టపడ్డారు. తెలుగు దేశం పార్టీకి ఉన్న కేడర్ ను, జనం బలాన్ని సమీకరించుకుని కనీసం కొన్ని స్థానాల్లోనైనా గెలిచి సత్తా చాటాలన్నది కాసాని ఆలోచన. అందుకే టీడీపీ పగ్గాలు కూడా తీసుకున్నారు.
తాను , తన కొడుకు కూడా టీడీపీ టిక్కెట్ పై పోటీ చేసి గెలవాలన్నది కాసాని ప్లాన్. కానీ ఈప్లాన్ ను చంద్రబాబు దెబ్బ తీశారు. పార్టీని నిలువునా, అధినేతే ఎందుకు పాతర వేసేస్తున్నారో అర్ధం కాక జ్నానేశ్వర్ నిన్న తల్లడిల్లిపోయారు. అంతకు ముందురోజు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో తెలుగు తమ్ముళ్లు పోటీ చేస్తామంటూ ఆవేశపడ్డారు. ఘర్షణ కూడా జరిగింది. తమ్ముళ్ల ఆవేశాన్ని కంట్రోల్ చేయడం కాసాని వల్ల కూడా కాలేదు. ఆ పరిస్థితిని వివరించడానికి లోకేష్ కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా కనీసం ఎత్తి మాట్లాడలేదన్న విషయాన్ని కూడా బయటపెట్టారు. చివరకు బాలయ్య కూడా తన ఫోన్ ఎత్త లేదని, దాంతో టీడీపీ వ్యూహం మరెదో ఉందని అర్ధమవుతోందని అలాంటి పనికి మాలిన వ్యూహాలకు తాను బలి కాదలచుకోలేదని కాసాని ప్రకటించారు.
జైల్లో ఉన్నా వ్యూహం పన్నిన బాబు (TDP)
తెలంగాణలో ఈసారి కాంగ్రెస్, బీఆర్ ఎస్ మధ్య హోరా హోరీ పోరు ఉంది. బీజేపీ మూడో స్థానంలోకి పడిపోయింది. తన ప్రియ శిష్యుడు, పీసీసీ చీఫ్ అయిన రేవంత్ రెడ్డి కి ఈ ఎన్నికలు జీవన్మరణ సమస్య లాంటివి. ఇప్పుడు సరైన రిజల్ట్ తేకపోతే పీసీసీ చీఫ్ పదవి కూడా పోతుంది. అసలే ఓటుకు నోటు కేసులో బాబు, రేవంత్ ఇద్దరూ దోషులుగా కోర్టు కేసు ఎదుర్కొంటున్నారు. ఈటైమ్ లో రేవంత్ కొమ్ము కాయడం ఉత్తమం అనిపించినట్లుంది చంద్రబాబుకి. అందుకే రేవంత్ కు సాయం చేసేందుకే పోటీ నుంచి తప్పుకున్నారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. తాము తప్పుకుని సెటిలర్లందరినీ కాంగ్రెస్ కి ఓటేయమని లోపాయికారిగా టీడీపీ చెప్పే ఆలోచనలో ఉన్నట్లుగా అనిపిస్తోంది.
తెలంగాణ ఫలితాలను ప్రభావితం చేసే సెటిలర్ల ఓట్ల పైనే అన్ని పార్టీల దృష్టి. నిజానికి సెటిలర్లంతా తమ వైపే అనుకుంటుంది టీడీపీ. అదే టైమ్ లో టీడీపీలో ఉన్న స్థానిక నేతలు కేసీఆర్ పార్టీలోకి ఫిరాయించినప్పటినుంచి సెటిలర్ల ఓట్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. నిజానికి హైదరాబాద్ లో సెటిలర్లు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో అత్యంత సురక్షితంగా, హాయిగా, భధ్రమైన జీవనం గడుపుతున్నారు. తలసాని, ఆరెకపూడి గాంధీ,రావుల లాంటి ఒకప్పటి టీడీపీ నేతలు సెటిలర్ల ఓటు బ్యాంకు పై పట్టు ఉన్న నేతలు. వీరంతా ఇప్పుడు బీఆర్ ఎస్ లో ఉన్నారు. కాబట్టి సెటిలర్ల ఓటు బ్యాంకు తమ గుప్పిట్లోనే ఉందని బీఆర్ ఎస్ అంటోంది. (TDP)
ఇదిలా ఉంటుండగా భాగ్యనగరంలో సెటిటర్ల ఓట్ల కోసం బీజేపీ కూడా ప్రయత్నిస్తోంది. సెటిలర్ల ఓట్ల కోసమే జనసేనాని పవన్ కల్యాణ్ ను బీజేపి రంగంలోకి దింపింది.అయితే తమకు పట్టున్న ప్రాంతాల్లో టిక్కెట్లివ్వాలని జనసేన పట్టుబడుతుంటే, ఆ స్థానాలకు ఇప్పటికే అభ్యర్ధులను నిర్ణయించేసింది బీజేపి. అయితే అవే సీట్లు తమకూ కావాలని జనసేన పట్టుబడుతోంది. సెటిలర్ల ఓటు బ్యాంకు తమ చేతుల్లో ఉందని జనసేన భావిస్తోంది. పవన్ కల్యాణ్ కు ఉన్న క్రేజ్ రీత్యా ఇక్కడా కొన్ని స్థానాలు గెలుస్తామని జనసేన ఆలోచనలో ఉంది.
బాలయ్య ఉత్తుత్తి లీడర్
ఇలా అన్ని పార్టీలూ సెటిలర్ల పైనే ఆశలు పెట్టుకున్నాయి. ఇప్పుడు టీడీపీకి రాజీనామా చేసిన కాసాని జ్నానేశ్వర్ కూడా ఈ ఓట్లపైనే గంపెడు ఆశలు పెట్టుకున్నారు. తెలంగాణ టీడీపీకి బాలకృష్ణ నాయకత్వం వహిస్తారని గతంలో ప్రకటించారు. ఆయన ఇక్కడకు వచ్చి ఒక మీటింగ్ కూడా పెట్టారు. బలమైన స్థానాల్లో పోటీ చేద్దామని కనీసం 80 స్థానాలపై దృష్టి పెట్టమని సలహా ఇచ్చారు. అయితే బాలయ్యను ఒప్పించి మొత్తం అన్ని స్థానాల్లోనూ పోటీ చేద్దామని కాసాని ప్లాన్ రచించుకున్నారు. పైగా అభ్యర్ధులంతా ఎవరికి వారు సొంతంగా ఎన్నికల ఖర్చును భరించాలని కూడా నిర్ణయించుకున్నారు. పార్టీ కోసం ఇంత ప్రో యాక్టివ్ గా కాసాని ఆలోచించినా, బీ ఫామ్ ఇచ్చేందుకు కూడా చంద్రబాబు ధైర్యం చేయడం లేదు.అందుకే కాసాని గుడ్ బై కొట్టేశారు. తెలంగాణలో టీడీపీని గాలికొదిలేశారని, నిక్షేపంలాంటి పార్టీని నిలువునా చంపేసారని కాసాని మండిపడుతున్నారు.మరిప్పుడు ఆయన అయన అనుచరగణం ఏం చేస్తారో చూడాలి. (TDP)