TS తెలంగాణలో ఈసారి త్రిముఖ పోటీ ఏ పార్టీని గెలుపు తీరాలకు చేరుస్తుందో చెప్పలేని పరిస్థితి. చాలా చాలా క్లోజ్ ఫైట్ తప్పదని తాజా పరిస్థితులు తెలియ చేస్తున్నాయి. మరోవైపు హంగ్ రావొచ్చంటూ మరికొందరు విశ్లేషిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు తమను గెలిపిస్తుందని కాంగ్రెస్ ఆశతో ఉంటే, అదే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి తాము గెలుస్తామని కేసీఆర్ భావిస్తున్నారు. మరోవైపు కింగ్ అయినా, కింగ్ మేకర్ అయినా, హంగ్ మేకర్ అయినా తామేనని అప్పుడు పరిస్థితిని బట్టి అవసరమైతే బీఆర్ఎస్ తో కలిసైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమన్నట్లుగా బీజేపి ధోరణి ఉంది. ఇక ఎన్నికల్లో పొటీ చేయబోమని చేతులెత్తేసిన టీడీపీ తమ ఓట్లన్నీ అంటే సెటిలర్ల ఓట్లన్నీ కాంగ్రెస్ కు పడాలని బలంగా కోరుకుంటోంది.
రేవంత్ రెడ్డి ఎలాగూ తమవాడే కాబట్టి కాంగ్రెస్ గెలవాలని టీడీపీ కోరుకుంటోంది. మరోవైపు తన మిత్ర పక్షమైన పవన్ కల్యాణ తో పొత్తు ద్వారా సెటిలర్ల ఓట్లన్నీ తమ వైపుకు తిప్పుకోవాలని బీజేపి ఎత్తుగడలు వేస్తోంది. అయితే సెటిలర్ల ఓట్లన్నీ తమకే పడతాయని బీఆర్ ఎస్ ఘంటా పథంగా చెబుతోంది. తెలంగాణ వచ్చాక ఒక సీమాంధ్ర వాసి కూడా నష్టపోలేదని ,పై పెచ్చు హయిగా కలిసిపోయి జీవిస్తున్నారని కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు అది ఖచ్చితంగా తమకు కలిసొచ్చే అంశమేనని బీఆర్ఎస్ చెప్పుకుంటోంది.
తేలని పొత్తుల ఎత్తులు.. ఇంకా రాని క్లారిటీ
అయితే ఇక్కడ కీలకమైన విషయం ఒకటుంది. కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలతోనూ, బీజేపి జనసేన తోనూ ఎన్నికల పొత్తు ప్రకటించింది. అయితే ఇప్పటి వరకూకమ్యూనిస్టులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లెన్నో స్పష్టం కాలేదు. ఎన్నికలకు కనీసం నెల్లాళ్ల టైమ్ కూడా లేదు. ఈ టైమ్ లో ఇంకా సీట్ల విషయంలో అస్పష్టత కామ్రేడ్ల కడుపు మండిస్తోంది. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం లేదని, తాము పోటీ చేసి తీరతామని సీపీఎం స్పష్టం చేసింది. మరోవైపు కమ్యూనిస్టులతో సీట్ల సర్దుబాటు అన్న మాటే లేదంటున్నారు కోమటిరెడ్డి లాంటి నేతలు.
జనసేనకు ఎన్ని సీట్లిస్తారు? TS
ఇక జనసేన, బీజేపిది మరో సమస్య. పొత్తులో భాగంగా ఎన్ని సీట్లు ఇచ్చేది బీజేపి జనసేనకు ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. అసలు జనసేన ఎన్ని సీట్లలో పోటీ చేయాలనుకుంటోందో కూడా క్లారిటీ లేదు. టైమ్ దగ్గర పడుతున్నా పవన్ కు ఈ విషయంపై సోయ కూడా లేదు. పెళ్లి వేడుకకోసం ఇటలీకి వెళ్లినా అసలు పార్టీకి రూట్ మ్యాప్ కూడా ఇచ్చినట్లు లేడు జనసేనాని. శివార్లలో సెటిలర్లు ఎక్కువగా ఉండే సీట్లు తమకు కావాలని జనసేన నోటి మాటగా బీజేపితో అన్నట్లు తెలుస్తోంది. అయితే ఆ సీట్లలో ఇప్పటికే తమ అభ్యర్ధులను ప్రకటించేసింది బీజేపి. కాబట్టి పవన్ కోరినట్లు ఇక్కడా సీట్ల కేటాయింపు జరగదు.
వాస్తవానికి ఎన్నికలంటే పవన్ కు భయమా అన్న డౌట్ కూడా వస్తుంది. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఆయన్లో కొంచమైనా సీరియస్ నెస్ కనపడదు. ఓట్లపైనా, సీట్లపైనా ఆసక్తి లేకుండా పార్టీని ఇలా ఎలా నడుపుతారోనని పవన్ పై ఇప్పటికే విమర్శలు కూడా ఉన్నాయి.వరుణ్ పెళ్లి నుంచి వచ్చాకైనా జనసేన తమకు కావాల్సిన సీట్లపై క్లారిటీతో అడుగులేస్తుందా? మూడు విడతలుగా అభ్యర్ధులను ప్రకటించినా సెటిలర్లు ఎక్కువగా ఉండే గ్రేటర్ పరిధిలోని శేరిలింగం పల్లి, కూకట్ పల్లి,నాంపల్లి, కంటోన్మెంట్ సీట్లకు బీజేపి అభ్యర్ధులను ప్రకటించలేదు. మరి జనసేన కు ఈ సీట్లు కేటాయిస్తారా? మొత్తం మీద సెటిలర్ల ఓట్లపైనే అందరి కళ్లూ పడ్డాయి. అటు కాంగ్రెస్ ను, ఇటు బీఆర్ఎస్ ను సెటిలర్లు ఏ తీరానికి చేరుస్తారో చూడాలి.