YSRTP
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు వైఎస్సార్టీపి అధినేత్రి షర్మిల దూరం అయ్యారు. తర్జన భర్జనల తర్వాత ఆమె ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలరాదన్న ఒకే ఒక ఉద్దేశంతో ఈ ఎన్నికల్లో పోటీ చేయరాదని నిర్ణయించుకున్నారు. ఈమేరకు కాంగ్రెస్ పెద్దలతో కుదిరిన అవగాహనా ఒప్పందం మేరకు వైఎస్సార్టీపీ కార్యకర్తలు, కేడర్ అంతా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ కు ఓటు వేయమని ప్రచారం చేస్తారు. తెలంగాణకు ఈ ఎన్నికలు అత్యంత కీలకమైనవని, కేసీఆర్ పతనం ఆరంభమైందని, ఏ ఒక్క ఓటు చీలినా కేసీఆర్ మళ్లీ గద్దె నెక్కడం ఖాయమని అందుకే ఈసారి రిస్క్ చేయడం లేదని అన్నారు. ఈసారి ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటే కీలకం కాబోతోంది. ఏమాత్రం తేడా జరిగినా.. మళ్లీ పాత కథే రిపీట్ అవుతుంది.
బీఆర్ఎస్ పార్టీ మళ్లి అధికారంలోకి వస్తుంది. అందుకనే ఈసారి కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చి బీఆర్ ఎస్ ను ఓడించాలని నిర్ణయించుకున్నామని షర్మిల తెలిపారు. అవినీతి ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాల్సిన తరణం వచ్చిందని అందుకే ఈసారి తాము ఎన్నికల్లో పోటీ చేయకుండా త్యాగం చేస్తున్నామని అన్నారు. ఎన్నికలపై వెలువడుతున్న అనేక సర్వేలు తమ పార్టీ పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుందని, అనేక చోట్ల కాంగ్రెస్ అవకాశాలకు అది నేరుగా గండి కొడుతుందని తేలిందన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు, భవిష్యత్తు రీత్యా తాను ఈ త్యాగం చేస్తున్నానని, అంతిమంగా ప్రజలకు మేలు జరగాలన్నది తన లక్ష్యమని అన్నారు.
వాస్తవానికి సెప్టెంబర్ నెలలోనే షర్మిల సోనియా, రాహుల్, ప్రియాంకలను కలిశారు. అప్పట్లో తమ మధ్య నిర్మాణాత్మక చర్చలు జరిగాయని ప్రకటించారు. అప్పట్లోనే పార్టీ విలీనం జరిగిపోతుందని అందరూ ఆశించారు. అయితే షర్మిలకు అప్పగించే బాధ్యతలపై రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు అధిష్టానానికి మధ్య భిన్నాభిప్రాయాలు వచ్చాయి. ఆమెకు ఏపీ బాధ్యతలు అప్పగించాలంటూ రేవంత్ వర్గం పట్టుబట్టగా, కొందరు మాత్రం ఆమె రాకను వ్యతిరేకించారు. దాంతో కాంగ్రెస్ అధిష్టానం వెనక్కు తగ్గింది. దాంతో షర్మిల ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. పాలేరునుంచే తలపడాలని, ఈనెల ఒకటనుంచి ప్రచారం, 4న నామినేషన్ దాఖలు చేసేలా ప్లాన్ చేసుకున్నారు.
మరోవైపు సునీల్ కనుగోలు సారధ్యంలో ఎన్నికలలో గెలుపు అవకాశాలను బేరీజు వేసుకుంటూ తమ ప్రణాళికల్లో మార్పు చేసుకుంటూ, టిక్కెట్ల కేటాయింపు దగ్గరనుంచి పలు జాగ్రత్తలు తీసుకుంటున్న కాంగ్రెస్ చివరి నిమిషంలో షర్మిలతో టచ్ లోకి వచ్చింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని షర్మిలను కోరారు. దాంతో ఆమె వెనక్కు తగ్గారు.
ఎన్నికలు భారమే YSRTP
వాస్తవానికి ఈ ఎన్నికలు వైఎస్సార్టీపీ YSRTP కి భారమైనవే..ఎందుకంటే ఎన్నికల్లో డబ్బును ధారాళంగా ఖర్చు చేసే లీడర్ గానీ, కేడర్ గానీ లేరు. పార్టీ పెట్టి రెండేళ్లవుతున్నా పార్టీ నిర్మాణం జరగలేదు. ఇప్పటికే బోలెడు డబ్బు ఖర్చు పెట్టిన షర్మిల కాంగ్రెస్ లో పార్టీని విలీనం చేసేద్దామనుకున్నారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ మధ్యవర్తిగా చాలా దఫాల చర్చలే జరిగాయి. కాంగ్రెస్ పెద్దలతో మాట్లాడినా తన కెరీర్ పై క్లారిటీ రాకపోవడంతో ఒంటరిగానే బరిలోకి దిగుతానని అనౌన్స్ చేశారు. అయితే కాంగ్రెస్ శ్రేణులు షర్మిలతో టచ్ లోనే ఉన్నాయి. నిన్న రాత్రి హై కమాండ్ షర్మిలతో ఫోన్లో మాట్లాడినట్లు సమాచారం. ఈ ఎన్నికల వరకూ కోపరేట్ చేయమని ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు సహకరించమని కోరారు. దాంతో ఆమె అంగీకరించారు.
రేవంత్ కి చెక్ పెట్టడానికేనా?
కాంగ్రెస్ పార్టీకి , రేవంత్ రెడ్డి నాయకత్వానికి ఈ ఎన్నికలు అగ్ని పరీక్ష లాంటివి. ముఖ్యంగా రేవంత్ కు ఇవి చావో, రేవో ఎన్నికలు. ఇప్పుడు గెలవక పోతే పీసీసీ చీఫ్ పదవిని ఊడగొట్టేందుకు పార్టీలో సీనియర్లే ఎదురు చూస్తున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతే రేవంత్ ను దింపేసి ఆ పదవి షర్మిలకు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే షర్మిల రాకపట్ల మరికొందరు సీనియర్లకూ అభ్యంతరాలున్నా వాటిని అధిష్టానం ఎలా పరిష్కరిస్తుందో చూడాలి. కాబట్టి ఎన్నికల తర్వాత షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేది లేనిదీ తేలే అవకాశముంది.