(PK JSP)
జనసేనాని పవన్ కల్యాణ్ ఎట్టకేలకు ఎక్కడ పోటీ చేస్తారనే దానిమీద క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఆయన భీమవరం, పాత గాజువాకల నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. దాంతో ఆయనపై ట్రోలింగ్ బాగా జరిగింది. విశాఖ పట్నం లాంటి సిటీలో పట్టున్న చోట గెలవలేకపోతే ఇక పవన్ స్పెషాలిటీ ఏంటి అనే చర్చ వచ్చింది. సెలబ్రిటీ, అందునా ప్రబావ వంతమైన బలం కలిగిన కాపు సామాజిక వర్గం అండ దండలు, చిరంజీవి తమ్ముడు అనే గుర్తింపు, ఉత్తేజపూరితమైన పవన్ ఆవేశ పూరిత ప్రసంగాలు ఇవన్నీ ఆయన గెలుపును ఖాయం చేసి ఉండాలి వాస్తవానికి. కానీ వైసీపీ వెల్లువలో ఆయన రెండు సీట్లలోనూ ఓడిపోయారు. ఆయన పార్టీనుంచి గెలిచిన రాపాక వరప్రసాద్ కూడా పార్టీ మారిపోయారు. ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది. మరో ఆరు నెలల్లో జరిగే ఎన్నికల కోసం అన్ని పార్టీలు వ్యూహ రచన చేస్తున్నాయి. టీడీపీ , జనసేన ఈసారి పొత్తులో ఉండటం మరో విశేషం. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే ఉద్దేశంతోనే పొత్తు పెట్టుకున్నానని, తనకు సీఎం పదవి ముఖ్యంకాదని పవన్ అన్నారు.
తన సీటు కోసం సర్వే చేయించిన పవన్ (PK JSP)
తాజాగా ఆయన ఏ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తే గెలుస్తారన్న అంచనాల కోసం రాష్ట్ర వ్యాప్త సర్వే కూడా చేశారు. అయితే ఉభయ గోదావరి జిల్లాలు, లేదా విశాఖ లోని గాజువాక, భీమవరం, పిఠాపురం, కాకినాడ నియోజక వర్గాలు పవన్ కల్యాణ్ కు కలిసొస్తాయని ఒక అంచనాకు వచ్చారు. వీటిలో గాజువాకనుంచి మళ్లీ పోటీకి ప వన్ విముఖంగా ఉన్నారు. గత ఎన్నికల్లో మెజారిటీలను గమనిస్తే వైసీపీ అభ్యర్ధి గ్రంథి శ్రీనివాస్ గెలుపొందగా, పవన్ రెండో స్థానంలో నిలిచారు. టీడీపీ అభ్యర్ధి మూడో స్థానంలో నిలిచారు. టీడీపీకి, పవన్ కు పెద్దగా ఓట్ల తేడా కూడా లేదు.. స్వల్పమే. అప్పట్లో విడి విడిగా పోటీ చేయడం వల్ల ఇలా జరిగిందని ఇప్పుడు పొత్తులో ఉన్నాం కాబట్టి గెలుస్తామని జనసేన లెక్కలు వేసుకుంటోంది.
ఇదిలా ఉంటే గోదావరి జిల్లాల్లో కాపు సామజిక వర్గానికి పెద్ద తలకాయగా భావించే చేగొండి హరిరామ జోగయ్య పవన్ ను ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల్లో ఎక్కడ నుంచైనా పోటీ చేయమని సూచించారు. ఈస్థానాలన్నీ పవన్ గెలుపుకు అనుకూలమేనని, దగ్గరుండి గెలిపించుకుంటామని అంటున్నారు.
మరోవైపు ఈసారి ఎన్నికల్లో గెలవకపోతే ఇక పార్టీయే ఉండే అవకాశం లేదన్న భయం పవన్ కల్యాణ్ లో కనిపిస్తోంది. గత ఎన్నికల్లో ఓడిపోయినా, ఈసారి టీడీపీ సహకారంతో గెలిచి అసెంబ్లీలో అడుగు పెడతానని ఆయన అనుకుంటున్నారు.
ఈసారి అక్కడ నుంచే బరిలోకి?
పవన్ మూడ్ చూస్తే భీమవరం నుంచే బరిలోకి దిగాలని అనుకుంటున్నట్లు కనిపిస్తోంది. గతంలో అక్కడ జరిగిన త్రిముఖ పోరులో ఓట్లు చీలి వైసీపీ గెలిచింది. గ్రంథి శ్రీనివాస్ ఎమ్మెల్యే అయ్యారు.పవన్ స్వల్ప తేడాతో ఓడిపోయారు. భీమవరం ప్రజలు ఈసారి పవన్ ను గెలిపించుకోవాలన్న తపనలో ఉన్నారని పవన్ అక్కడనుంచైతే ఖచ్చితంగా గెలుస్తారని జనసేన నేతలు ఆశతో ఉన్నారు. పైకి ఇంకా ప్రకటించకపోయినా ఇదే ఖాయమని తెలుస్తోంది. పొత్తులో భాగంగా టీడీపీ, జనసేనకు 50 సీట్లు కేటాయిస్తుందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే 30 సీట్లపై క్లారిటీ వచ్చేసిందని, మిగిలిన 20 సీట్లపైనా స్పష్టత వస్తే దానిని బహిరంగంగా ప్రకటిస్తారనీ తెలుస్తోంది.