Delhi
ఢిల్లీలో వాయు కాలుష్యం వణికిస్తోంది. గాలి పీల్చాలంటే అక్కడి జనం భయపడుతున్నారు. స్వచ్ఛమైన గాలి లేక అల్లాడుతున్నారు. ఢిల్లీ పరిసరాలన్నీ కొన్ని రోజులుగా పొగచూరి, మబ్బుగా అయిపోయాయి. దాంతో ప్రజలెవరూ ఇళ్లలోంచి బయటకు రావడం లేదు. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి సీఎం అరవింద్ కేజ్రీవాల్ రంగంలోకి దిగారు. కొద్దిసేపటి క్రితం అత్యవసర కేబినెట్ భేటీలో కొని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గతంలో అమలు చేసిన సరి , బేసి విధానాన్ని మళ్లీ అమల్లోకి తెస్తున్నారు. నవంబర్ 13నుంచి 20వ తేదీ వరకూ అంటే వారం పాటు ఈ సరి, బేసి విధానాన్ని అమలు చేస్తారు.
ఏంటీ సరి , బేసి విధానం? Delhi
వాహనాల నెంబర్ ప్లేట్లలో చివరి రెండు అంకెలు సరి సంఖ్య ఉన్న వారు ఒకరోజు బేసి సంఖ్య ఉన్నవారు మరుసటి రోజు మాత్రమే వాహనాలు నడపాలి. దీనివల్ల ట్రాఫిక్ వల్ల రేగే కాలుష్యం గణనీయంగా తగ్గనుంది. గతంలో కూడా ఇదేవిధానాన్ని అరవింద్ కేజ్రీవాల్ అమలు చేశారు. ఇక భవన నిర్మాణ పనులకుకొంత కాలం పాటు విరామమిచ్చారు. పబ్లిక్ ప్రాజెక్టులు, రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణాన్ని ఎక్కడికక్కడ ఆపేశారు. ఈనెల 10 నుంచి స్కూళ్లన్నింటికీ శెలవులు ఇచ్చేశారు. కేవలం పదోతరగతి, క్లాస్ ట్వల్వ్ లకు మాత్రం బోర్డు పరీక్షలను దృష్టిలో ఉంచుకుని శెలవులు ఇవ్వలేదు. బీఎస్ 3పెట్రోల్, బీఎస్4 డీజిల్ వాహనాలపై నిషేధం కొనసాగుతుంది. కేవలం ఎల్ ఎన్ జీ, సీఎన్ జీ ట్రక్కులను మాత్రం అదీ నిత్యావసరాల రవాణాకోసం ఢిల్లీలోకి అనుమతిస్తున్నారు. త్వరలోనే పబ్లిక్ , ప్రైవేట్ ఉద్యోగులలో సగం మందికి వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రకటించనున్నారు. Delhi
దీపావళితో మరింత దిగజారిన వాతావరణం..
సాధారణంగా శీతాకాలం మొదలవగానే ఢిల్లీలో ఈ రకమైన వాతావరణం కనిపిస్తుంది. దీపావళి పండుగ తర్వాత క్రాకర్స్ వదిలిన కాలుష్యంతో వాతావరణం మరింత దిగజారుతుంది. అటు పంజాబ్, హర్యానాలలో పంట వ్యర్ధాలను తగులబెట్టడంతో బూడిద ఎగిరి ఇంత దూరం ప్రయాణించి ఇక్కడి గాలిని కలుషితం చేస్తుంటుంది. అంతేకాదు… రాజస్థాన్ లో శీతల గాలుల ప్రభావం భారీ ఎత్తున ఇసుక, దుమ్ము గాల్లోకి ఎగిరి వచ్చి ఢిల్లీలో పడుతుంది. ఇవి ఒక్కోసారి ప్రమాదాలకు దారి తీస్తుంటాయి. ధూళి కుప్పలు రోడ్లపైనా జనం పైనా పడుతుంటాయి. అందుకే వాతావరణం మరీ కాలుష్యంగా ఉంటే ఢిల్లీ ప్రభుత్వం సైరన్ మోగిస్తుంది.
ప్రజలంతా ఇళ్లలోనే కాలక్షేపం చేయమని చెబుతుంది. చిన్న పిల్లలు, వృద్ధులు, గర్భిణులు ఈ వాయు కాలుష్యానికి అల్లాడిపోతున్నారు. కొందరికి శ్వాస కోశ సమస్యలు వస్తుంటే, ఉబ్బసం, ఆస్మా రోగులు నరక యాతన అనుభవిస్తున్నారు. చాలా మందికి విపరీతమైన దగ్గు, చలి, కళ్ల మంటలు, శ్వాస సమస్యలు, ఛాతీ పట్టేసినట్లుండటం లాంటి సమస్యలతో సతమతమవుతున్నారు. అన్ని వయసుల వారికీ ఇదే ఇబ్బంది. అందుకే ప్రజలు బయటకు వెళ్లినప్పుడు తప్పనిసరిగా మాస్కులు ధరించమని డాక్టర్లు సలహా ఇస్తున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో ఎటు చూసినా దట్టమైన పొగమంచుకనిపిస్తోంది. దీనివల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.ఉదయం 11 దాటితే గానీ ఎండ రావడం లేదు. ఎక్కువ సమయం మబ్బుగా ఉండటంతో ప్రజలంతా ఊపిరి సంబంధ సమస్యలతో అగచాట్లు పడుతున్నారు. రాజధాని నగరానికి ఇలాంటి దుస్థితి రావడం నిజంగా విషాదం.. Delhi