Varun – Rahul
వరుణ్ గాంధీ బీజేపీకి గుడ్ బై చెప్పబోతున్నారా? వాస్తవం ఏమో కానీ పుకార్లు మాత్రం షికారు చేస్తున్నాయి. గత బీజేపి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న మేనకాగాంధీ ఆ తర్వాత ఆపార్టీకి దూరమవుతూ వచ్చారు. ఈసారి ఎన్నికల్లో తల్లి, కొడుకులకు టిక్కట్లు వస్తాయో రావో కూడా తెలీదు. యూపీ నుంచి ఎంపీగా ఉన్న వరుణ్ గాంధీ ఈ మధ్య కాలంలో పెద్దగా యాక్టివ్ గా కూడా లేరు. వరుణ్ ను పెద్ద నేతగా చూడాలని కలలు కన్న మేనకాగాంధీ బీజేపి తన పట్ల అనుసరిస్తున్న నిర్లక్ష్య ధోరణిని సహించలేకే పార్టీకి దూరంగా ఉంటున్నారు. అలాగని మేనకా గాంధీ కుటుంబానికి సోనియా కుటుంబంతో కూడా సన్నిహిత సంబంధాలు లేవు. వారు ఇరువురు పరస్పరం మాట్లాడుకోరు కూడా… ఇలాంటి టైమ్ లో వరుణ్ గాంధీ, రాహుల్ గాంధీ ఒకేసారి తారసపడటం రాజకీయ విశ్లేషకులను విస్మయానికి గురి చేసింది.
కేదార్ నాథ్ ఆలయంలో రాహుల్, వరుణ్ Varun – Rahul
కేదార్ నాథ్ సందర్శనకు వెళ్లిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి అక్కడ బీజేపి ఎంపీ, స్వయానా సోదరుడు వరుణ్ గాంధీ తారసపడ్డారు. ఇద్దరూ కలసి కేదార్ నాథ్ ఆలయంలో పూజలు కూడా చేశారు. ఆ తర్వాత ఇద్దరూ ఏకాంతంగా మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. దాంతో వరుణ్ రాజకీయ భవితవ్యంపై ఊహాగానాలు రేగుతున్నాయి. ఇటీవల కాలంలో బీజేపితో అంటీ ముట్టనట్లు ఉంటున్న వరుణ్ గాంధీ కీలకమైన అంశాలపై బీజేపి పెద్దల నిర్ణయాలతో విబేదిస్తూ వచ్చారు. వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవడం లాంటి అంశాలపై పార్టీ స్టాండ్ కి వ్యతిరేకంగా మాట్లాడి సంచలనంగా మారారు.
పరస్పర పలకరింపులు..ఏకాంత భేటీ
కేదార్ నాథ్ ఆలయంలో అన్నదమ్ములిద్దరూ కలవడం కాకతాళీయమా? లేక వ్యూహమా అన్నది తెలియటం లేదు. ఇద్దరు ఒకరికొకరు తారసపడ్డారని ఆవెంటనే పలకరించుకుని ఆలయంలోకి కలిసే వెళ్లి పూజలు చేయించారని తెలుస్తోంది. ఆపై ఆలయ ప్రాంగణంలో కొద్దిసేపు ఏకాంతంగా భేటీ అయినట్లు, ఈ భేటీ మర్యాద పూర్వకంగా సాగిందని కాంగ్రెస్ వర్గాలు ప్రకటించాయి.
సోదరుని కుమార్తెకు పలకరింపు
వరుణ్ కుమార్తెను రాహుల్ పలకరించారు. ఇద్దరూ వరసకు సోదరులే అయినా పబ్లిక్ గా ఎప్పుడూ కలసుకున్నది లేదు. అయినప్పటికీ ఇద్దరి మధ్యా సత్సంబంధాలు ఉన్నాయి. గత ఏడాది ఒక మీటింగ్ లో వరుణ్ గాంధీని కాంగ్రెస్ లోకి ఆహ్వానిస్తారా అన్న ప్రశ్నకు రాహుల్ కాంగ్రెస్ లోకి ఎవరైనా రావొచ్చని, కానీ వరుణ్ గాంధీ బీజేపి, ఆరెస్సెస్ ఐడియాలజీని నమ్ముతున్నారని అన్నారు.అది కాంగ్రెస్ సిద్ధాంతాలకు పూర్తిగా వ్యతిరేకమన్నారు. రాహుల్ గాంధీ గత మూడు రోజులుగా ఉత్తరాఖండ్ లని కేదార్ నాథ్ ఆలయంలో ఉంటున్నారు. అదే టైమ్ లో వరుణ్ గాంధీ కుటుంబంతో సహా దర్శనానికి వచ్చారు.
కోడళ్లు ఎడ మొఖం పెడ మొఖం Varun – Rahul
ఇందిర కుటుంబంలోని ఇద్దరు కోడళ్లు ఎడమొఖం, పెడమొఖంగా ఉన్నా, వారి పిల్లలు మాత్రం సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. రాహుల్, ప్రియాంక, వరుణ్ మధ్య రాకపోకలు లేకపోయినా, ఎదురు పడితే పలకరించుకునే వాతావరణం ఉంది. సంజయ్ మరణం తర్వాత ఇందిర ఇంటినుంచి, కాంగ్రెస్ పార్టీనుంచి గెంటివేతకు గురైన మేనక సంజయ్ విచార్ మంచ్ పేరుతో పార్టీ పెట్టి ఆ తర్వాత దానిని బీజేపీలో విలీనం చేశారు. మేనకగాంధీ కేంద్రంలో మంత్రి పదవులు కూడా నిర్వహించారు. మరోవైపు సోనియా గాంధీ కాంగ్రెస్ అధినేత్రిగా పగ్గాలు చేపట్టి క్లిష్టసమయంలో పార్టీని కాపు కాశారు. అనారోగ్య కారణాలతో ఈమధ్య రాజకీయాలలో కీలక సమావేశాలకు తప్పితే హాజరు కావడం లేదు.