AP-BJP
ఏపీ బీజేపి చీఫ్ పురందరేశ్వరి ఓ స్పెషల్ టాస్క్ మీదున్నారా? ఈమధ్య కాలంలో వైఎస్ జగన్ పై ఏ బీజేపి చీఫ్ చేయని విమర్శలకు పాల్పడుతూ సంచలనం సృష్టిస్తున్నారు. ఏపీలోఇసుకాసురులు తయ్యారయ్యారంటూ ఆరోపణలు చేశారు. ఇసుక దోపిడీలో మంత్రులు, ఎమ్మెల్యేలు ముందున్నారని జగన్ ప్రభుత్వం అవినీతి మయం అంటూ చిందులు తొక్కారు. కేంద్రం పథకాలకు నిధులిస్తుంటే వాటిని అమలు చేయకుండా ఆ పథకాలకు తమ పేర్లు పెట్టుకుంటున్నారని మండిపడ్డారు. సొమ్మొకడిది.. సోకొకడిదీ అంటూ నిప్పులు చెరిగారు.
ఆపై మద్యం అమ్మకాలపై పడ్డారు. అవినీతి తాండవిస్తోందని చీప్ బ్రాండ్లు అమ్ముతున్నారని, లిక్కర్ కట్టడి కావడంలేదని, మహిళల జీవితాలు బుగ్గవుతున్నాయంటూ ఆరోపణలు చేశారు. లిక్కర్ షాపులను సందర్శించారు. వివరాలు,లెక్కలు ఆరా తీశారు. ప్రభుత్వానికి రావాల్సిన సొమ్ము లిక్కర్ కాంట్రాక్టర్ల జేబులోకి పోతోందన్నారు. ఇలా ఒకటి రెండు, కాదు పొద్దున్న లేస్తే అన్నీ జగన్ పై ఆరోపణలే. చివరకు ఎంత దూరం వచ్చారంటే జగన్ కేసుల విచారణలో తీవ్ర జాప్యం జరుగుతోందంటూ ఏకంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు లేఖలు రాశారు.
ఏపీకి సంబంధించినంత వరకూ బీజేపితో వైసీపికి స్నేహ పూర్వక బంధమే ఉంది.. బీజేపికి టీడీపీ ప్రధాన శత్రువు. అధ్యక్షురాలి హోదాలో టీడీపీపైనా, చంద్రబాబు స్కాములపైనా కామెంట్ చేయాల్సిందిపోయి మరిదికి మేలు చేసే విధంగానే ఆమె మాట్లాడారు. చంద్రబాబు అవినీతితో అడ్డంగా దొరికిపోయినా స్కిల్ స్కామ్ పై పల్లెత్తు వ్యాఖ్యలు చేయలేదు. పైపెచ్చు నిరాధారమైన కేసులు పెట్టారంటూ ఎదురు దాడి చేశారు. ఇలా ఏపీ బీజేపి అధినేత్రి బీజేపి హైకమాండ్ కు వ్యతిరేకంగానే అడుగులు వేస్తున్నారు. ఇప్పటి వరకూ పార్టీకి మేలు చేకూర్చే ఒక్క పని కూడా చేయలేదు సరికదా.. జగన్ను ఆడిపోసుకోడానికే టైమ్ అంతా కేటాయిస్తున్నారు.
వదినమ్మ మాటలు ..మరిదికి కష్టాలు AP-BJP
పురందరేశ్వరి బంధు ప్రీతితోనే టీడీపీకి మేలు చేస్తున్నారని, బీజేపి ముసుగులో టీడీపీ కొమ్ము కాస్తున్నారంటూ వైసీపీ నేతలు ఫైరవుతున్నారు. లిక్కర్ రేట్ల విషయంలోనూ, లిక్కర్ పాలసీ విషయంలోనూ విజయసాయికి ఆమెకు మధ్య మాటలు హద్దులు దాటాయి కూడా. ఇక పురంధరేశ్వరి టేకప్ చేసిన అన్ని అంశాలపైనా జగన్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.ఫలితం చంద్రబాబుపై మరిన్ని కేసులు బుక్కవుతున్నాయి.
ఇలా టీడీపీని, చంద్రబాబుని అడ్డగోలుగా ఇరికించింది వదినమ్మ. ఇసుక కాంట్రాక్టులపైనా, లిక్కర్ పాలసీపైనా, ఆరోపణలపైనా ఏపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. కారణం ఏమంటే పురంధరేశ్వరి ఎత్తి చూపిన తప్పులన్నీ గత ప్రభుత్వ హయాంలో జరిగిన నిర్వాకాలే. చీప్ లిక్కర్ బ్రాండ్లన్నీ ది గ్రేట్ చంద్రబాబు హయాంలో వచ్చినవే. ఇవన్నీ చూస్తుంటే పురంధరేశ్వరి అసలు లక్ష్యం ఏంటి? టీడీపీ అనుకూల ప్రకటనల ద్వారా చిన్నమ్మ బంధుప్రీతిని ప్రదర్శిస్తున్నారా? పోనీ అలా అనుకున్నా ఆమె చేసిన ఆరోపణలన్నీ చంద్రబాబు అండ్ కో పైనే బూమరాంగ్ అవుతున్నాయి.అసలు చిన్నమ్మ ప్రకటనల వెనక ఉన్నదెవరు?
బీజేపి హై కమాండ్ వ్యూహమా?
పురందరేశ్వరి ఏ ఉద్దేశంతో ఇలా చేసినా ఆమె తీరు వెనక పెద్ద వ్యూహమే ఉందని విశ్లేషకులు అంటున్నారు. దీని వెనక బీజేపి హైకమాండ్ ఉందని, టీడీపీని చావుదెబ్బ తీసి ఆ పార్టీని బీజేపీలో విలీనం అయ్యేలా బీజేపి పెద్దలే పావులు కదుపుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి ఏపీలో టీడీపీ అడ్రస్ లేకుండా చేయడం అనే అతిపెద్ద టాస్క్ పురంధరేశ్వరి భుజాలపై ఉందని వారంటున్నారు. అందుకే ఆమె టీడీపీ అనుకూల ధోరణి ప్రదర్శిస్తున్నట్లుగా నటిస్తూ ఆపార్టీ కి మరిన్ని కష్టాలు కొని తెస్తున్నారు. అంటే వదినమ్మ పైకి కబుర్లు చెబుతూనే మరిదిని అడ్డంగా బుక్ చేసి టీడీపీని నిర్వీర్యం చేసే పనిలో ఉన్నారని అనుకోవాలి. పురంధరేశ్వరి భుజం మీద గన్ పెట్టి టీడీపీని కాల్చాలన్నది బీజేపి వ్యూహమా?