kaleshwaram project
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ BRS కు ఎదురుదెబ్బ తగిలింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ జరపాలంటూ ఈ మధ్య పెద్ద రచ్చే జరుగుతోంది. మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడం, దానికి లింక్ అప్ అయి ఉన్న అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ ల నిర్మాణం కూడా లోపభూయిష్టంగా ఉందని వార్తలు రావడం అధికార పక్షానికి ఎన్నికల టైమ్ లో పెద్ద ఇబ్బందే. సీబీఐని తమ రాష్ట్రంలోకి అడుగు పెట్టనివ్వని కేసీఆర్ ఇప్పుడు అంగీకరిస్తే రెండు గంటల్లోనే కాళేశ్వరంపై విచారణ జరుపుతామన్నారు తెలంగాణ బీజేపి చీఫ్ కిషన్ రెడ్డి.
సీబీఐ విచారణ కు పర్మిషన్ అవసరం లేదు
అయితే కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరపొచ్చునంటూ సిబీఐ మాజీ డైరక్టర్ నాగేశ్వరరావు ప్రకటించారు. సీబీఐ విచారణకు తెలంగాణ ప్రభుత్వ అనుమతి అక్కరలేదని ఆయనంటున్నారు. కేంద్ర జలశక్తి శాఖే సీబీఐ విచారణకు ఆదేశించవచ్చునంటున్నారాయన. అవినీతి నిరోధక చట్టం 17 ఏ ప్రకారం కేంద్ర జలశక్తి శాఖ సీబీఐ విచారణ కోరచ్చునని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు నిందితులుగా తేలితే అప్పుడు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 19 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ అనుమతి అవసరమవుతుందని ఆయన చెబుతున్నారు. సీబీఐ మాజీ డైరక్టర్ తాజా స్టేట్ మెంట్ తో విపక్షాలకు మళ్లీ ఊతమొచ్చినట్లయ్యింది. బీఆర్ ఎస్ నేతల గొంతుల్లో పచ్చి వెలక్కాయ పడినట్లయ్యింది. కాళేశ్వరం ప్రాజెక్టుతో లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని గప్పాలు కొట్టుకున్న కేసీఆర్ ప్రభుత్వానికి సరిగ్గా ఎన్నికల ముంగిట్లో నే ఈ ఉపద్రవం మీదకొచ్చింది. మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజులు కూడా ప్రమాదకరంగానే ఉన్నాయంటూ డ్యామ్ సేఫ్టీ అధికారులు అనుమానాలు వ్యక్తం చేయడం లాంటివి ఆందోళన చెందాల్సిన అంశాలే.
కాళేశ్వరం డిజైనింగ్ లో డ్యామ్ సేఫ్టీ ప్రమాణాలకు సంబంధించి డ్యామ్ సేఫ్టీ పర్యవేక్షణాధికారులు 11 అంశాల్లో వివరణ కోరగా అందులో ఏడు అంశాలపై మాత్రమే ప్రభుత్వం వివరణ ఇచ్చింది. మిగిలిన కీలకమైన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేదు. కాళేశ్వరంలో అవినీతి ఏరులై పారిందని, ఇది బహుళార్ధ సాధక ప్రాజెక్ట్ కాదని, ఎత్తిపోతల పథకమని కాంగ్రెస్, బీజేపి సహా విపక్షాలు వాదిస్తున్నాయి. BRS
నాణ్యత లేని ఇసుక.. డిజైనింగ్ లోపాలే శాపాలు kaleshwaram project
ప్రపంచంలోనే అతి పెద్ద ప్రాజెక్టు అని చెప్పుకుంటున్న కాళేశ్వరంలో నాణ్యతలేని ఇసుక వాడారని, డిజైనింగ్ లో పలు లోపాలు ఉన్నాయన్నది బహిరంగ రహస్యం. ఈప్రాజెక్టు లక్ష కోట్ల అప్పును తెలంగాణ ప్రజలపై భారంగా తెచ్చిందని సామాన్యుల జేబులకు చిల్లు పెట్టిందని కిషన్ రెడ్డి విమర్శించారు. నాలుగేళ్లలోనే పిల్లర్లు కుంగిపోయాయని, కొత్త బ్యారేజీ నిర్మాణం చేపట్టాలని ఇంజనీర్లు చెబుతున్నారు.
ఎకరా నీటికి 85 వేల కోట్లు ఖర్చు… రాబడి 40 వేలే BRS
ద్వారా ఒక ఎకరాకు నీరిచ్చేందుకు 85 వేల కోట్ల రూపాయల నిర్వహణ వ్యయం అవుతుంది. కానీ అక్కడ పండించిన పంట ద్వారా వచ్చేది కేవలం 40 వేలే. ప్రాజెక్ట్ ప్లానింగ్, డిజైనింగ్, క్వాలిటీ సరిగా లేకనే అది కుంగిందన్నది డ్యామ్ సేఫ్టీ అధికారుల రిపోర్ట్. ఇంత పెద్ద ప్రాజెక్ట్ కు ఫౌండేషన్ సరిగా లేదని, ఫౌండేషన్ కు సింగిల్ స్టోన్ వాడారని అదే ప్రమాదాన్ని తెచ్చిపెట్టిందని అధికారులు చెప్పారు. ఇంజనీర్లకు బదులుగా కేసీఆర్ దీనిని డిజైన్ చేయడం వల్లనే ఇలా జరిగిందన్నది విపక్షాల వాదన. అసలు మేడిగడ్డ ప్రాజెక్టే కాళేశ్వరం మొత్తం ప్రాజెక్ట్ కు లైఫ్ లైన్. అదే ఇలా ప్రమాదానికి గురయితే, మిగిలిన ప్రాజెక్టులపై దీని ప్రభావం పడుతుంది.
నదికి నడకలు నేర్పిన కేసీఆర్, ఆధునిక ఇరిగేషన్ ఇంజనీర్ అంటూ కేసీఆర్ కీర్తిని పొగుడుతూ వచ్చిన బీఆర్ ఎస్ దెబ్బతో ప్లేటు ఫిరాయించింది. ప్రచారంలో ఎక్కడా దీని ప్రస్తావన లేకుండా జాగ్రత్త పడుతోంది.భారీ ప్రాజెక్టులు నిర్మించేటప్పుడు ఒక్కోసారి పొరపాట్లు జరుగుతాయని, మేడిగడ్డ బ్యారేజ్ రిపేర్ ఖర్చులన్నీ సంబంధిత ఎల్ అండ్ టీ , మేఘా సంస్థకే చెందుతాయని ప్రభుత్వం ఖర్చు చేయక్కర లేదని కేటీఆర్ అంటున్నారు. ఇది తీవ్రమైన ఆర్ధిక నేరమని తాము అధికారంలోకి వస్తే కేసీఆర్ అరెస్టు ఖాయమని బీజేపి అంటోంది. ఎన్నికలయ్యాక ప్రాజెక్ట్ కుంగినా కేసీఆర్ కు పెద్ద ఇబ్బంది ఉండకపోను.. సరిగ్గా ఎన్నికల టైమ్ లో వచ్చిన ఈ ఉపద్రవాన్ని ఎలా ఎదుర్కొనాలా అని కారు పార్టీ నేతలు కంగారు పడుతున్నారు.