వాయు కాలుష్యంతో అల్లాడిపోతున్న ఢిల్లీకి ఉపశమనం కలిగించడానికి అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం వినూత్నంగా ఆలోచిస్తోంది. ఈనెల 20 – 21న ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో కృత్రిమ వర్షాలు కురిపించి కాలుష్యాన్ని తగ్గించాలని చూస్తోంది. వాయు కాలుష్యంతో ఊపిరి ఆడక ఇబ్బందులు పడుతున్న ఢిల్లీ జనానికి కాస్త ఊరట దొరుకుతుందని భావిస్తోంది. వాహన కాలుష్యం, పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్ధాల దహనం వెరసి ఢిల్లీని కాలుష్యం దిబ్బగా మార్చేస్తున్నాయి. గతవారం రోజులుగా ఢిల్లీ అత్యంత ప్రమాదకర కేటగిరీలోనే ఉంది.
ఢిల్లీలో కృత్రిమ వర్షాలు
ఢిల్లీలో రేగిన కాలుష్యం రీత్యా తీసుకోవాల్సిన చర్యలపై నిపుణులతో సమావేశమైన ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ ఈ కృత్రిమ వానల ప్రస్తావన తీసుకొచ్చారు. ఈ సమావేశంలో ఐఐటి కాన్పూర్ కు చెందిన టీమ్ పాల్గొంది.కృత్రిమ వర్షాలు కురిపించడానికి ఏం చేయాలి? కావాల్సిన పరికరాలేంటి ? వగైరా వివరాలతో పాటు ఒక సంపూర్ణ ప్రణాళికను ఇవ్వమని ఢిల్లీ ప్రభుత్వం ఐఐటి టీమ్ ను కోరింది. ఈ నివేదికను శుక్రవారం సుప్రీంకోర్టుకు నివేదిస్తారు. ఢిల్లీలో టాక్సిక్ గాలిని తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించిన అనేక పిటిషన్లను రేపు కోర్టు విచారిస్తోంది. సుప్రీంకోర్టు ప్రభుత్వ ప్రతిపాదనలకు ఓకే చెబితే ఢిల్లీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలసి ఈ ప్రణాళికను అమలు చేస్తాయి.
కృత్రిమ వర్షాలు ఎలా కురిపిస్తారు? 20
కృత్రిమ వర్షాలు కురిపించాలంటే ఆకాశంలో 40 శాతం మబ్బులు ఉండాలని ఐఐటీ టీమ్ తెలిపింది.ఈనెల 20-21 న ఢిల్లీ పరిసరాల్లో మబ్బులు కమ్ముకునే అవకాశం ఉందని వాతావరణ నివేదికలు చెబుతున్నాయని, ఆటైమ్ లో ఈ వర్షాలను ప్రయోగాత్మకంగా పైలట్ స్టడీలా నిర్వహిస్తామని ఐఐటీ బృందం తెలిపింది.ప్రజారోగ్యం దెబ్బ తినేలా వాతావరణం మారిపోతుంటే రాజకీయ పార్టీలు దీన్ని రాజకీయం చేయడం తగదని, తక్షణం పంజాబ్, హర్యానా, యూపీ, రాజస్థాన్ రాష్ట్రాలు పంట వ్యర్ధాలను కాల్చడం ఆపాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు ఢిల్లీ ప్రభుత్వాన్ని కూడా మందలించింది. ఢిల్లీలో చాలా బస్సులు డీజిల్ తో నడుస్తున్నాయని, పూర్తి సామర్ధ్యం నిండకుండానే బస్సులు నడుపుతూ వాయు కాలుష్యానికి దోహదం చేస్తున్నారని విమర్శించింది.
దీపావళి ఎలా?
ఇదిలా ఉంటే కాలుష్యం అంత చేటున ఉన్నా ప్రజలు దీవాలీ క్రాకర్స్ కాల్చడం మానరు.ప్రతీ ఏటా ఇదే జరుగుతోంది.ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలిస్తూ , ఎవరినీ క్రాకర్లు కాల్చవద్దని చెప్పినా , గత ఏడాది యధాప్రకారం పరిమితికి మించి టపాసులు, ఇతర క్రాకర్స్ కాల్చేశారు. దాంతో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది. వృద్ధులు, చిన్న పిల్లలు , ఆస్తమా పేషెంట్స్ ఊపిరి ఆడక ఇబ్బందులు పడ్డారు. మరి ఈసారి దీవాలీకి ఇదే పరిస్థితి పునరావృతం అయితే ఢిల్లీ వాసులను ఆ దేవుడే కాపాడాలి.
అరవింద్ ప్రభుత్వం కూడా రాజకీయాలకు పోకుండా తక్షణం చేపట్టాల్సిన చర్యలను అమలు చేస్తే మంచిది. పంజాబ్ లో తమ ప్రభుత్వమే అధికారంలో ఉండటంతో ఆప్ ప్రభుత్వం పంట వ్యర్ధాల దహనంపై సీరియస్ గా మాట్లాడటం లేదు. అరవింద్ ఈ రాజకీయమే మానుకోవాలని, పార్టీల కతీతంగా ఢిల్లీ పర్యావరణ పరిరక్షణకు ఉద్యమించాలని ఢిల్లీ వాసులు కోరుతున్నారు.