(war)
ఇజ్రాయెల్ హమాస్ తీవ్రవాద సంస్థ మధ్య యుద్ధం ముదిరి పాకాన పడింది. గాజాలో అతిపెద్ద పిల్లల ఆస్పత్రి అయిన ఆల్ షిఫా ఆసుపత్రిని ఇజ్రాయెల్ దిగ్బంధించింది. నిర్దేశిత లక్ష్యాలను టార్గెట్ చేస్తూ ముందుకు కదులుతున్న ఇజ్రాయెల్ తాజాగా ఈ ఆస్పత్రిని చుట్టుముట్టింది. ఈ ఆస్పత్రిలో రోగులు,నిర్వాసిత గాజా ప్రజలు వేల సంఖ్యలో ఉన్నారు. ఇలాంటి ఆస్పత్రిని చుట్టుముట్టడం వల్ల ఇజ్రాయెల్ ప్రపంచ వ్యాప్తంగా అపఖ్యాతిని మూటగట్టుకుంటోంది. తాము నిర్దేశిత టార్గెట్ గానే ఆల్ షిఫా ఆస్పత్రిని ఆపరేట్ చేస్తున్నామని ఇజ్రాయెల్ దళాలు అంటున్నాయి. గాజా ఆస్పత్రిలో మిలటరీ చర్యలన్నింటినీ 12 గంటల్లోగా నిలిపివేయాలంటూ సంబంధిత అధికారులకు ఇజ్రాయెల్ డిఫెన్స్ బలగాలు సూచన చేశాయి. కానీ ఆ సూచన అమలు కాలేదు. ఆస్పత్రిలో ఉన్న హమాస్ ఉగ్రవాదులు తక్షణం లొంగిపోవాలంటూ ఐడీఎఫ్ దళాలు కూడా కోరాయి.
ఆస్పత్రిలో 2,300 మంది చిక్కుకు పోయారు…
ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం గాజా ఆస్పత్రిలో 2,300మంది రోగులు, సిబ్బంది, నిరాశ్రయులైన గాజా పౌరులు ఉన్నారు. ఇజ్రాయెల్ జరుపుతున్న దాడుల వల్ల కొన్ని రోజులుగా వీరంతా ఈ ప్రాంగణంలో చిక్కుకు పోయారు. వాయుతల దాడులతో ఆస్పత్రిలో రోగులు, సిబ్బంది వణుకుతున్నారు. ఆల్ షిఫా ఆస్పత్రిలో ప్రస్తుతం 36 మంది నవజాత శిశువులు ఉన్నారు. వారిని తరలించే వీలు మాత్రం కావడం లేదు. ఇజ్రాయెల్ ఇన్ క్యుబేటర్లు సప్లయ్ చేసినా తరలింపు ప్రక్రియ సాధ్యపడలం లేదు.
ఆల్ షిఫా ఆస్పత్రిలో పవర్ జనరేటర్లకు ఇంధన కొరతతో ఇన్ క్యుబేటర్లు పనిచేయక ఇప్పటికే ముగ్గురు ప్రిమెచ్యూర్ బేబీస్ చనిపోయారు. అనస్తీషియా లేకుండానే ఆస్పత్రిలో ప్రస్తుతం వైద్య చికిత్సలు జరుగుతున్నాయి. పరిస్థితి భయానకంగా ఉందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఆస్పత్రి కారిడార్లలో తిండి లేక వందలాది కుటుంబాలు ఆకలితో అలమటిస్తున్నాయి. మరోవైపు చనిపోయిన శవాలకు దహన సంస్కారాలు లేక కుళ్లిపోయి దుర్గంధం వెదజల్లుతోంది. శవాగారాల్లో కరెంటు లేక ప్రీజర్లు పనిచేయక శవాలు కుళ్లిపోయి కుప్పలు తెప్పలుగా పడి ఉన్నాయి.వాటిని ఎలా డిస్పోజ్ చేయాలో తెలీక ఆస్పత్రి యాజమాన్యం తర్జన భర్జనలు పడుతోంది.
ఆస్పత్రులే ఉగ్ర స్థావరాలు (war)
హమాస్ ఉగ్రవాదులు ఆస్పత్రుల లాంటి ప్రజా సర్వీసులను ఆక్రమించి అక్కడనుంచి ఇజ్రాయెల్ దళాలను ఎదుర్కొంటున్నాయి. ఆస్పత్రులను తమ స్థావరాలుగా హమాస్ మార్చుకున్నారంటూ ఇజ్రాయెల్, అమెరికా కూడా ఆరోపిస్తున్నాయి. గాజాలో అనేక ఆస్పత్రుల్లో హమాస్ ఉగ్రవాదులు ఉన్నారు. అండర్ గ్రౌండ్ టన్నెల్స్ ద్వారా ఇజ్రాయెల్ బందీలను ఒక చోటనుంచి మరోచోటకు తరలిస్తున్నారు. ఆల్ షిపా ఆస్పత్రిలో జరుగుతున్న సైనిక చర్యకు పూర్తి బాధ్యత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దేనని హమాస్ ఆరోపించింది. అమెరికా మద్దతుతోనే ఇజ్రాయెల్ ఆస్పత్రిపై మిలటరీ చర్యలకు పాల్పడుతోందని ఇది దారుణమని హమాస్ నేతలు విమర్శిస్తున్నారు.
మరోవైపు ఆస్పత్రుల్లో సివిలియన్లు కూడా ఆకలితో అలమటిస్తున్నారు. గగన తల దాడుల శబ్దాలు, ఇటు ఇజ్రాయెల్ దాడులతో చెవులు పగిలిపోయే శబ్దాలతో పౌరులు బిక్కు బిక్కు మంటున్నారు. తిండీ తిప్పలు లేక ఆస్పత్రిలోనే రోజుల తరబడి దాక్కుంటున్నారు. ప్రాణాలుంటే చాలు.. ఏదో ఒకటి చేసి బతకొచ్చు అనే నిర్వేదంలోకి వాళ్లు వెళ్లిపోతున్నారు. అంతులేకుండా కొనసాగుతున్న ఈ యుద్ధం ఎప్పటికి ముగుస్తుందో తెలియని స్థితి.