Yemen Court
కేరళకు చెందిన నర్స్ ఉరిశిక్ష నుంచి తప్పించాలంటూ చేసుకున్న విన్నపాన్ని యెమెన్ సుప్రీం కోర్టు తిరస్కరించింది. కేరళకు చెందిన నిమిషా ప్రియా అనే భారతీయ నర్సు యెమెన్ దేశంలో 2017 నుంచి జైలు శిక్షను అనుభవిస్తోంది. తన పాస్ పోర్టును స్వాధీనం చేసుకున్న తలాల్ అబ్డో మాధీ అనే వ్యక్తి నుంచి దానిని తీసుకునేందుకు అతగాడిని మాదక ద్రవ్యాలతో ఆమె చంపేసినట్లు ఆరోపణలున్నాయి. అయితే తన శిక్షను తగ్గించాలంటూ నిమిషా ప్రియ చేసుకున్న అపీల్ ను యెమెన్ తిరస్కరించడంతో ఆకుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుమార్తెను కడసారి చూసేందుకు యెమెన్ వెళ్లేందుకు తనను అనుమతించాలంటూ నిమిష తల్లి చేసుకున్న విన్నపంపై కేంద్రం త్వరగా స్పందించి వారంలో నిర్ణయం వెలువరించాలని ఢిల్లీ హై కోర్టు ఆదేశించింది. తాను యెమెన్ వెళ్లేందుకు అనుమతించాలంటూ ప్రియా తల్లి గత ఏడాది ఢిల్లీ హై కోర్టును ఆశ్రయించింది. 2017 నుంచి అరబ్ దేశాల్లో అంతర్యుద్ధాల కారణంగా మనదేశం అక్కడికి ప్రయాణాలను నిషేధించింది.
యెమెన్ వెళ్లేందుకు ప్రయత్నం Yemen Court
చనిపోయిన తలాల్ అబ్డో మాధీ కుటుంబానికి నష్టపరిహారం ఇచ్చి బిడ్డను విడిపించుకునే అవకాశాలను పరిశీలించడానికి నిమిషా ప్రియ తల్లి యెమెన్ వెళ్లాలనుకుంటోంది. ప్రస్తుత పరిస్థితుల్లో పిటిషనర్ కు మిగిలిన ఏకైక అవకాశం అక్కడకువెళ్లి వ్యక్తిగతంగా వారితో భేటీ అయ్యి సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం మాత్రమే ఉందని కాబట్టి నిందితురాలి తల్లిని యెమెన్ వెళ్లేందుకు అనుమతించాలని ఆమె తరపు న్యాయవాది సుభాష్ చరణ్ కోర్టుకు నివేదించారు. సంప్రదింపుల కోసం నిమిష తల్లి కొన్నాళ్లు యెమెన్లోనే ఉండాల్సి వస్తుందని దీనికి భారతీయుల ప్రయాణాలపై నిషేధం విధించడం అడ్డంకిగా మారుతోందని లాయర్ సుభాష్ తెలిపారు. మరోవైపు మారిన పరిణామాల నేపధ్యంలో యెమెన్ పై ట్రావెల్ బ్యాన్ ను సడలించారని, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో, అత్యవసర సమయాల్లో అక్కడకు వెళ్లేందుకు వీలుగా, పరిమిత సమయం వరకూ అక్కడ ఉండేందుకు వీలుగా సవరణలు చేశారని కేంద్ర ప్రభుత్వం తరపు లాయర్ హై కోర్టుకు తెలిపారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ పిటిషన్ నే విన్నపంగా పరిగణించాలని ఈరోజు నుంచి వారంలోగా దీనిని రిప్రజెంటేషన్ గా పరిగణిస్తారని జస్టిస్ సుబ్రమణ్య ప్రసాద్ తెలిపారు.
ఫలించని కౌన్సిల్ ప్రయత్నాలు..
అయితే నిందితురాలిని విడిపించేందుకు ఇప్పటికే సేవ్ నిమిష ప్రియా ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ అనే గ్రూప్ నిమిష విడుదల కోసం అక్కడ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. 2022లో ఈ కౌన్సిల్ హైకోర్టును ఆశ్రయించింది. మృతుని కుటుంబ సభ్యులతో విడతల వారీగా చర్చలు జరిపి నష్టపరిహారం కింద ఏదైనా పరిహారాన్ని చెల్లించేందుకు వీలుగా కేంద్రం దౌత్యపరమైన చొరవ చూపాలని ఈకౌన్సిల్ కేంద్రాన్ని కోరింది. నష్టపరిహారాన్ని చట్టపరంగా నిర్దేశిత సమయంలోగా చెల్లించేలా వెసులు బాటు చేయాలని ఆ కౌన్సిల్ అడిగింది. అయితే దీనికి హై కోర్టు నిరాకరించింది. నష్టపరిహారం పై సంప్రదింపులు కేంద్రం చేయబోదని, అదే సమయంలో ఆమెకు శిక్ష పడకుండా చట్టపరమైన చర్యలేవైనా తీసుకునే అవకాశాలను పరిశీలిస్తుందని హై కోర్టు తెలిపింది. బాధితురాలు యెమెన్ జైల్లోనే ఉండటంతో కేరళలో ఉంటున్న ఆమె కుటుంబం ఆందోళన చెందుతోంది. ప్రయత్నాలేవీ ఫలించకపోతే ఆమెను ఉరి తీస్తారు. ఈ బెంగతో ఆ కుటుంబం తల్లిడిల్లి పోతోంది.