Israel-Hamas war
ఇజ్రాయెల్, హమాస్ మధ్య చర్చల్లో కీలక పురోగతి కనిపిస్తోంది. బందీల విడుదలకు మానవతా ధృక్పథంతో ఇరు పక్షాలు ఎట్టకేలకు ఒక అంగీకారానికి వచ్చాయి. తాత్కాలిక కాల్పుల విరమణ కు సిద్ధపడ్డాయి. ఇజ్రాయెల్ బందీలను విడుదల చేసేందుకు ప్రతిగా ఇజ్రాయెల్ జైళ్లలో మగ్గుతున్న 150 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేయడానికి నేతన్యాహు ప్రభుత్వం అంగీకరించింది. అయితే రెండు పక్షాలు నాలుగు రోజుల పాటు కాల్పుల విరమణ పాటించడం ద్వారా ఎవరి బందీలను వారు వెనక్కు తీసుకుంటారు. మంగళవారం రాత్రి సుదీర్ఘ కేబినెట్ భేటీ అనంతరం నేతన్యాహు ప్రభుత్వం ఇది చాలా కష్టమైన నిర్ణయమే.. కానీ ఇప్పుడు తీసుకోవాల్సిన చర్య అని వ్యాఖ్యానించింది.
బందీల పరస్పర బదిలీ
ఇరుపక్షాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం నాలుగు రోజుల కాల్పుల విరమణకు ప్రతిగా ఇజ్రాయెల్ బందీలు, విదేశీ బందీలు, మహిళలు, పిల్లలను హమాస్ విడుదల చేస్తుంది. ప్రతి పదిమంది అదనపు బందీల విడుదలకు ఒక్కోరోజు చొప్పున కాల్పుల విమరణ ప్రకటిస్తారు. మానవతా దృక్పథంతో ఇజ్రాయెల్ చేసిన ఈ ప్రతిపాదనను హమాస్ స్వాగతించింది. ఇజ్రాయెల్ బందీల విడుదలకు బదులుగా జైళ్లలో మగ్గుతున్న 150 మంది పాలస్తీనియన్లను వదిలి పెట్టాలని కోరింది. ఏడు వారాలుగా జరుగుతున్న యుద్ధం కాల్పుల విరమణతో ఉపశమనం కలుగుతుందని గాజా నివాసులు సంతోషిస్తున్నారు. అయితే ఒప్పందం ప్రకారం గ్రౌండ్ ఆపరేషన్స్ అన్నీ వదిలేయాలని, ఇజ్రాయెల్ వాయు దాడులలో విరామానికీ ఇది వర్తిస్తుందని హమాస్, ఇస్లామిక్ జిహాద్, ఇతర పాలస్తీనా గ్రూపులు వాదిస్తున్నాయి. ఈ ఒప్పందంతో రెండు పక్షాల మధ్య సుదీర్ఘకాలంగా నెలకొన్న ప్రతిష్టంభన వీడింది. కతార్ దేశం ఈ సంధి కుదిరేందుకు మధ్యవర్తిత్వం వహించింది.
నేతన్యాహు పై విపక్షాల విమర్శలు Israel-Hamas war
ఈ ఒప్పందం ఏకపక్షంగా ఉందని హమాస్ కు మేలు చేసే విధంగా ఉందని సొంత వర్గాల నుంచే నేతన్యాహు విమర్శలు ఎదుర్కొంటున్నారు. జాతీయ భద్రతా మంత్రి ఇటామర్ బెన్ గ్విర్ ఈ ఒప్పందానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని నిర్ణయించుకున్నారు. ఒప్పందంలో ఇజ్రాయెల్ సైనికులను కూడా వెనక్కు రప్పించేలా మెలిక పెట్టాల్సిందని ఆయనంటున్నారు.
అక్టోబర్ 7న హమాస్ జరిపిన దాడుల్లో 12 వందల మంది చనిపోగా, 240 మందిని బందీలుగా ఎత్తుకుపోయారు. వారంతా ఇప్పుడు గాజా సొరంగాలలో బందీలుగా ఉన్నారు. దీనికి ప్రతిగానే ఇజ్రాయెల్ ఆపరేషన్ స్వార్డ్స్ ఆఫ్ ఐరన్ పేరుతో గాజాపై ముప్పేట దాడులు మొదలు పెట్టింది. ఈ దాడుల్లో 14,100 మంది చనిపోయారని వీరిలో మహిళలు, పిల్లలు ఉన్నారని పాలస్తీనా ఆరోపిస్తోంది. బందీలుగా ఉన్న తమ వారి విడుదల కోసం రెండు దేశాలు ఎంతో ఉద్విగ్నంతో ఎదురు చూస్తున్నాయి. తమవారు ఎక్కడ బందీగా ఉన్నారో , అసలు సజీవంగా ఉన్నారో లేదో తెలీక ఇరు దేశాల ప్రజలు కలవరపడుతున్నారు.
హమాస్ నేలమట్టమే అంతిమ ధ్యేయం
ఇజ్రాయెల్ , హమాస్ మధ్య కుదిరిన ఈ ఒప్పందం చివరి నిర్ణయంకాదని, నాలుగురోజుల కాల్పుల విరమణ తర్వాత యధాప్రకారం దాడులు చేస్తామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి తెలిపారు. తమ బందీలందరినీ సురక్షితంగా విడుదల చేయించుకోవడం, హమాస్ ఉగ్ర సంస్థను నేలమట్టం చేయడం, గాజా నుంచి ఇజ్రాయెల్ కు భవిష్యత్తులో కూడా ఎలాంటి ముప్పు లేకుండా చేసుకోవడమే తమ అంతిమ లక్ష్యమని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది.