Barrelakka
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో వేడి పెరిగింది. నిరుద్యోగులకు ప్రతిరూపంగా పోటీలో నిలిచిన బర్రెలక్క అలియాస్ శిరీష కుటుంబంపై నిన్న గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఆమె తమ్ముడిని తీవ్రంగా గాయపరిచారు. దీంతో బర్రెలక్క హడలిపోయింది. మీడియా ముందు పెద్ద పెట్టున రోదించింది. తన తమ్ముడిపై దాడి చేసిన వారెవరో తెలీదని, ఎవరి ప్రచారం వారు చేసుకుంటున్నాం. మామీద దాడెందుకు? మామీద కక్ష ఎందుకు? మా తిప్పలు మేం పడుతున్నాం అని కన్నీరు పెట్టుకుందీ ఈ అమాయక నిరుద్యోగ యువతి. కొల్లాపూర్ నుంచి ఇండిపెండెంట్ గా బరిలోకి నిలిచిన శిరీష అలియాస్ బర్రెలక్క వాస్తవానికి కోట్లు సొమ్ము పోసి ఎన్నికల్లో ప్రచారం చేసుకుంటున్న అభ్యర్ధులతో పోలిస్తే గడ్డిపోచ.. ఆమెకు బలం, బలగం, ఆర్థిక, సామాజిక, రాజకీయ కుల మద్దతు కూడా లేదు. కేవలం ఆమె లాంటి లైక్ మైండెడ్ నిరుద్యోగులు ప్రభుత్వంపై తీవ్రమైన కసి, ఆవేదన ఉన్న వారు ఆమెకు మద్దతు పలుకుతున్నారు. తెలంగాణ నిరుద్యోగుల్లో కట్టలు తెగిన ఆవేశం కనిపిస్తోంది.
నిరుద్యోగం అంశమే కీలకం
ఈసారి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే అతిపెద్ద అంశం నిరుద్యోగం. లక్ష ల్లో ఉద్యోగల కల్పన, అంటూ ఆశపెట్టిన కేసీఆర్ ప్రభుత్వం గ్రూప్ వన్ నుంచి ఫోర్ వరకూ అసలు రిక్రూట్ మెంట్లే జరపకుండా కాలయాపన చేసింది. వేలాది పోస్టులు ఖాళీగా పడి ఉన్నా, రిటైర్ అయ్యే వారు అవుతున్నా ఆ స్థానాలను భర్తీ చేయకుండా నిర్లక్ష్యం చేసింది. ఒకటీ రెండూ పరీక్షలు జరిపినా అవి కాస్తా పేపర్ లీకేజీలతో రద్దయిపోయాయి. నీళ్లు, నిధులు, నియామకాలు అంటూ అధికారం దక్కించుకున్న కేసీఆర్ ఆ తర్వాత ఉద్యోగాల కల్పన మాటే మరిచారు. ప్రభుత్వోద్యోగంకోసం ఆశపడే అమాయక పల్లెటూరు డిగ్రీ హోల్డర్ లకి బర్రెలక్క ఒక ప్రతినిధి మాత్రమే. పోలీసు శాఖలో ఉద్యోగం రావాలని తపించిన ఈ యువతి ఆ అవకాశం లేక చివరకు ఉద్యోగాలపై విరక్తితో సొంత ఊరికి పోయి అక్కడ రెండు బర్రెలు కొనుక్కుని స్వయం ఉపాధి పొందుతోంది. తాను డిగ్రీ చదివినా కేసీఆర్ జమానాలో ఉద్యోగాలు లేవని తీవ్ర నిరాశ చెందుతూ తాను బర్రెలు మేపుకుంటూ బతుకు వెళ్ల దీస్తున్నానని తనకు తానే బర్రెలక్క అనీ పేరు పెట్టుకుంది శిరీష.
సోషల్ మీడియా సెన్సేషన్ Barrelakka
తన బ్యాక్ గ్రౌండ్ వివరిస్తూ ఇన్ స్టాలో ఆమె చేసిన రీల్ ఆమెకు విపరీతమైన పేరు తీసుకొచ్చింది. సోషల్ మీడియాలో మోస్ట్ క్రేజీ పర్సన్ అయిపోయింది. ఆమెకు యూట్యూబ్, ఫేస్ బుక్, ఇన్ స్టాలలో మిలియన్ల కొద్ది వ్యూస్, వేలల్ ఫాలోయర్లు ఉన్నారు. ఆ ఉత్సాహమే ఆమెతో ఇండిపెండెంట్ అభ్యర్ధిగా పోటీకి దిగేలా చేసింది. మొదట్లో ఆషా మాషీగా ఆమె వెంట తిరిగిన కుర్రకారు ఇప్పుడామెను సీరియస్ అభ్యర్ధిగా ప్రొజెక్ట్ చేస్తూ ప్రచారం చేయడం మొదలు పెట్టారు. ఆమెకూ క్రేజ్ పెరిగింది. నిరుద్యోగులు చందాలు వేసుకు మరీ ఆమె ప్రచారానికి సాయం చేస్తున్నారంటే యువత ఎంత రగిలిపోతోందో అర్ధం చేసుకోవచ్చు. ఈ యువత ఓట్లను చీల్చే అవకాశముంది. బర్రెలక్క గెలవకపోవచ్చు.. కానీ ఓట్లను చీల్చచ్చు. ఎన్నికల ప్రక్రియలో ఏదైనా జరగొచ్చు. సోషల్ మీడియా ఆమెను ఆకాశానికెత్తేసింది. అందుకే ఆమెకు భద్రతా పరమైన సమస్యలూ తలెత్తాయి.
దాడితో మరింత మైలేజీ Barrelakka
ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేయచ్చు.. బర్రెలక్కకు దన్ను లేదన్న ధీమాతో ఆమె కుటుంబంపై దాడులకు దిగడం దారుణం. ఈ దాడిని చాలా మంది ఖండించారు. ఈ దాడి అన్ని వర్గాల ప్రజలు ఒక్కసారి ఆమెవైపు తిరిగి చూసేలా చేసింది. దాడి చేయడం ద్వారా ప్రత్యర్ధులెవరో ఆమెకు ఊహించినదానికన్నా ఎక్కువ మైలేజీయే కల్పించారు. అన్ని వర్గాల ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, ప్రజాసంఘాలు, కవులు, కళాకారులు, రచయితలు, మేధవులు, గాయనీ గాయకులు, సోషల్ మీడియా వారియర్స్ , దళిత బహుజన సంఘాలు ఇలా ఒకరు కాదు అందరూ ఈ యువతికి సపోర్ట్ చేస్తున్నారు. బర్రెలక్కపై దాడిని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ కూడా ఖండించారు. ప్రొఫెసర్ కోదండరాం లాంటి వారు కూడా ఈ దాడిని ఖండించే అవకాశం ఉంది. ఇక యానాం కు చెందిన రాజకీయ నేత అల్లాడి కృష్ణారావు ఆమెకు ఏకంగా లక్ష రూపాయలు విరాళం ప్రకటించారు. అతిరథ మహారథులు పకడ్బందీ ప్రచారంతో అట్ట హాసంగా సాగుతుంటే బర్రెలక్క మాత్రం ప్రచారంలో సైలెంట్ గా దూసుకుపోతోంది. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఈ యువతి ఈసారి ఎన్నికల్లో సంచలనం సృష్టిస్తుందా? చూడాలి.