karthika masam
అన్ని మాసాలల్లో కార్తీక మాసానికి చాలా ప్రాముఖ్యత ఉంది. హరిహరులకు ఈ మాసం ఎంతో ప్రీతికరమైనది. అందుకే శివాలయాలు, విష్టువాలయాలు పూజలతోనూ, భక్తులతోనూ కిటకిటలాడతాయి. ఇక కార్తీకమాసంలో చేసే దీపారాధనకు కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి కూడా పరమ పవిత్రమైనది. శివునికి, విష్ణువుకి ఎంతో ఇష్టమైన మాసం కాబట్టి వారిద్దరిని కొలిస్తే అనుగ్రహం పొందడానికి తగిన మాసమని దీనికి ఎంతో ప్రాశస్త్యం ఉంది అని పురాణాలు చెబుతున్నాయి. ఈ కార్తీకమాసంలో ప్రతి దినము ప్రత్యేకమైనదే.
నెల రోజులు ఒక ఎత్తు… పౌర్ణమి రోజు ఒక ఎత్తు…
ఈ మాసంలో సోమవారాలు, రెండు ఏకాదశులు, శుద్ధ ద్వాదశి, పౌర్ణమి దినాలు ఒకటికి మించి మరొకటి అధిక ప్రభావవంతమైనవి. నెల రోజులూ చేసే పూజల ఫలితం ఒక ఎత్తు అయితే, పౌర్ణమి నాడు చేసే పూజల ఫలితం ఒక్కటీ మరొక ఎత్తు. అందువల్ల ఆ రోజున వ్రతాలు, పూజలు, కృత్యాలు, ఉపవాసాలు, దీపారాధనలు, దైవారాధనలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలనీ పురాణాలు వివరిస్తున్నాయి.
కార్తీక పౌర్ణమి రోజు నదిలో దీపాలు వదిలే వేళ karthika masam
కార్తీక పౌర్ణమి నాడు వేకువజామునే లేచి శివనామస్మరణతో తలారా స్నానం చేసి భక్తిశ్రద్ధలతో దీపారాధన చేసి ఆ దీపాలను అరటి దొప్పల్లో పెట్టి చెరువులు, నదుల్లో లేదా బోరుబావుల వద్ద వదులుతుంటారు. మహిళలు, పెళ్ళికాని అమ్మాయిలు కార్తీక దీపాలను సూర్యోదయానికి ముందు మరియు సూర్యస్తమానికి ముందు ఇంట్లో భక్తితో పూజలు చేసి వెలిగిస్తుంటారు. దేవాలయాలకు వెళ్లి దేవుడిని దర్శించుకుని ఉపవాస దీక్షలను మొదలు పెడతారు. రోజు చేసే పూజల కంటే పౌర్ణమి రోజు చేసే పూజలకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. పెళ్లికాని అమ్మాయిలు ఈ కార్తీకమాసంలో తులసికోటకు ఉసిరికొమ్మతో(కాయలతో) దీపం పెట్టి తులసి పక్కన రాధాకృష్ణుల విగ్రహాన్ని ఉంచి పూజిస్తే కోరుకున్న వ్యక్తి భర్తగా వస్తాడని పూరాణాలు చెబుతున్నాయి.
పారే నీటిలో దీపాలను వదలడం…
కార్తీక పూర్ణిమ రోజు పారే నీటిలో దీపాలను వదలడం ఎంతో మంచిది. ఈ దీపాలు పితృదేవతలకు దారి చూపిస్తాయని అంటారు. మరొక ముఖ్య విషయం ఏమిటంటే కార్తీక మాస పూర్ణిమ రోజు సాయంత్రం సమయంలో చంద్రుడికి ఆర్ఘ్యం ఇవ్వాలి. ఇది చాలా పవిత్రమైనది. దేవాలయంలో పిండి ప్రమిదలలో నువ్వుల నూనెతో దీపాలు వెలిగించడం వల్ల పాపాలు తొలగిపోతాయి. సంవత్సర కాలంలో దేవుడి ముందు దీపాలు వెలిగించని వారికి కూడా ఈ రోజున దీపం వెలిగిస్తే అన్ని రోజులు దేవుడి ముందు దీపం వెలిగించిన పుణ్యం లభిస్తుంది. కేవలం పిండి ప్రమిదలే కాకుండా ఉసిరికాయతో దీపం పెట్టడం కూడా ఎంతో శ్రేష్టం. ఈ కార్తీక పౌర్ణమి రోజు ఉపవాస దీక్షలను పాటించి సాయంకాలం దేవాలయంలో 365 వత్తులు ఉన్న దీపంను వెలిగించడం వల్ల సంవత్సరం మొత్తం పూజలు చేసినంత ఫలితం లభిస్తుంది.
కార్తీకమాసంలో పౌర్ణమి రోజు చేసే ముత్తయిదు నోములు… karthika masam
ముఖ్యంగా ఈ మాసంలో కార్తీక పౌర్ణమి రోజున ముత్తయిదువులు రెండు రకాల నోములు నోచుకుంటారు. ఒకటి కార్తీక చలిమిళ్ళ నోము. ఈ నోము కోసం కార్తీక పౌర్ణమినాడు చలిమిడి చేసి మొదటి సంవత్సరం ఐదుగురు ముత్తైదువులకు, ఆపై సంవత్సరం పదిమందికి, మూడో ఏడాది పదిహేనుమందికి చొప్పున వాయనాలు ఇస్తారు.రెండోవది కార్తీక దీపాల నోము. పౌర్ణమి రోజు రాత్రికి శివాలయంలో 120 దీపాలను వెలిగిస్తారు.తరువాతి సంవత్సరం 240 దీపాలు, అపై సంవత్సరం 360 దీపాలు శివాలయంలో పౌర్ణమి రోజున వెలిగిస్తారు. ఈ నోములు నోచుకుంటే శివసాన్నిద్ధ్యం లభిస్తుందని పురాణాలు తెలియజేస్తున్నాయి.