congres-brs
తెలంగాణ ఎన్నికల ప్రచార గడువు మంగళవారంతో ముగుస్తోంది.. పార్టీలు చివరి అస్త్రాలను తెరపైకి తీస్తున్నాయి.బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా వాతావరణం మారిపోయింది. బీజేపి వెనకబడిపోయి బరిలోనే లేకుండా అయిపోయింది. కాంగ్రెస్ గెలుపు ఖాయమంటూ ఆ పార్టీ మౌత్ పబ్లిసిటీ ఎక్కువ చేయడం,మరోవైపు సర్వేలన్నీ కాంగ్రెస్ కు ఎడ్జ్ ఉందని తేల్చేయడంతో కేసీఆర్ లో గుబులు మొదలైంది.అయినా పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది బీఆర్ఎస్.
తన గెలుపు ఖాయమని తనకు నమ్మకం ఉందని కేటీఆర్ పదే పదే చెప్తుండటమే అతనిలో ఓటమి భయం పెరుగుతోందనడానికి సంకేతం. బీఆర్ ఎస్ యధాప్రకారం అభివృద్ధి, సెంటిమెంట్ అస్త్రాలనే సంధిస్తుండగా, కాంగ్రెస్ తన దగ్గరున్న అన్ని అస్త్రాలను సంధిస్తోంది. ముఖ్యంగా ప్రత్యర్ధిని కార్నర్ చేసి దెబ్బ కొట్టాలన్న ఉద్దేశంతో కేసీఆర్ గతంలో విస్మరించిన హామీని తెరపైకి తెచ్చింది.
తెరపైకి దళిత్ కార్డు congres-brs
దళితుడిని సీఎంను చేస్తానన్న కేసీఆర్ దళిత జాతిని మోసం చేశాడని, తాము గెలిస్తే దళితుడే సీఎం అనీ అనఫీషియల్ గా ఓ ప్రచారాన్ని సోషల్ మీడియాలో చేయిస్తోంది… పార్టీ అగ్రనాయకత్వం ఉద్దేశాలెలా ఉన్నా..సోషల్ మీడియాలో మాత్రం కాంగ్రెస్ దళిత్ సీఎంగా మల్లు భట్టి విక్రమార్క పేరు మారుమోగుతోంది. అవసరమైతే తల నరుక్కుంటా తప్ప మాట తప్పను, మడమ తిప్పను అన్న కేసీఆర్ ను ఎద్దేవా చేస్తోంది కాంగ్రెస్.
ఇక్కడ కాంగ్రెస్ అగ్రనాయకత్వం ఏం ఆలోచిస్తోందో తెలీదు కానీ ముఠా తగాదాల కాంగ్రెస్ లో సీఎం పోస్ట్ మీద ఎవరి ఆశలు, ఆలోచనలు వాళ్లకున్నాయ్.. రేవంత్ టీడీపీ నుంచి వచ్చి కాంగ్రెస్ అధ్యక్ష పదవి తీసుకుని, ఇప్పుడు ఏకంగా సీఎం పదవి మీద కూడా కన్నేశాడు. పార్టీలో ఎప్పటినుంచో ఉన్న సీనియర్లకు ఇది కంటగింపుగా ఉంది.. రేవంత్ ను కట్టడి చేయాలంటే తనకు దక్కకపోయినా ఫర్లేదు..శత్రువుకి అస్సలు దక్కకూడదన్న ఫిలాసఫీ ప్రకారం దళిత్ కార్డ్ ను తెరపైకి తేవడం బెటర్ అని ఓ వర్గం ఆలోచిస్తోంది. ఆ వర్గం సీఎం అభ్యర్ధిగా తమ సామాజిక వర్గం నేతను ప్రొజెక్ట్ చేసేందుకు శాయశక్తులా ట్రై చేస్తోంది.
ఒక్క దెబ్బకు రెండు పిట్టలు congres-brs
అటు కేసీఆర్ కి, ఇటు రేవంత్ కు ఏకకాలంలో చెక్ చెప్పడానికి దళిత కార్డు బాగా కలిసొచ్చే అంశం. అందుకే మల్లు భట్టి విక్రమార్క అనుచరులు సోషల్ మీడియాలో కాంగ్రెస్ దళిత సీఎం ఆయనేనంటూ ఓ రేంజ్ లో ప్రచారం చేస్తున్నారు. ఈ అస్త్రంతో అటు రేవంత్ సైలెంట్ అవడం, ఇటు కేసీఆర్ దెబ్బ తినడం ఖాయం.
అందుకే కాంగ్రెస్ అగ్రనేతలు కూడా ఈ ప్రచారాన్ని చూసీ చూడనట్లు ఊరుకుంటున్నారు. పైగా దళిత కార్డును ప్రయోగిస్తే దేశ వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పరపతి పెరుగుతుంది. పైగా సోనియా కుటుంబంతో భట్టికి చాలా సత్సంబంధాలు ఉన్నాయి. రాహుల్ కుటుబానికి ఆయన వీరభక్త హనుమాన్ లాంటివాడు. అందరినీ కలుపుకు పోగలడు. వివాద రహితుడు, సౌమ్యుడు అన్న పేరు ఉండనే ఉంది.. అందుకే హై కమాండ్ కూడా భట్టిని నియమించే అంశం సీరియస్ గా ఆలోచిస్తోందని సమాచారం.
కాంగ్రెస్ గెలిస్తే దళితుడే సీఎం
తెలంగాణ ను తెచ్చినది కాంగ్రెస్ పార్టీయే… సోనియా దయతోనే తెలంగాణ వచ్చిందన్న విషయాన్ని ఎన్నికల ప్రచారంగా మలచుకుంది కాంగ్రెస్. ఇక దళిత కార్డు ఎఫ్పటికీ కలిసొచ్చే అంశమే. బీజేపీ గిరిజన మహిళను రాష్ట్రపతిని చేస్తే కాంగ్రెస్ దళితుడికి పార్టీ అధ్యక్ష పదవి కట్టబెట్టింది. సో ఈ దళిత కార్డు పాలిటిక్స్ ఇప్పుడు ట్రెండ్..పైగా కేసీఆర్ ను నిలువరించాలంటే సరైన టైమ్ లో సంధించాల్సిన సరైన అస్త్రం ఇదే అవుతుంది. అందుకే కాంగ్రెస్ ఈ అస్త్రం ప్రయోగిస్తోందేమో అనిపిస్తోంది. ఎన్నికలు సరిగా జరిగి, వేవ్ కాంగ్రెస్ కు అనుకూలంగా ఫలితాలు ఉండి పార్టీ క్లియర్ మెజారిటీతో గెలిస్తే భట్టి విక్రమార్కను సీఎం చేయడం ఖాయమనే టాక్ ఊపందుకుంటోంది. సో భట్టి సీఎం అయ్యేది లేనిది డిసెంబర్ 3న తేలిపోతుంది.
ఈ పరిణామాలు ఖచ్చితంగా రేవంత్ అవకాశాలకు గండికొడతాయి. అటు రేవంత్ వర్గం ఆయనే సీఎం అంటూ ప్రచారం చేసుకుంటోంది. కాంగ్రెస్ వేసిన ఈ ఎత్తుగడ ఎలాంటి ఫలితాలనిస్తుందో కానీ మొత్తానికి కేసీఆర్ గొంతులో మాత్రం పచ్చి వెలక్కాయ పడినట్లే… గెలిచాక దళిత సీఎం మాట మరిచిన కేసీఆర్ తనను ప్రజలు ఎన్నుకున్నారని, తనపై వ్యతిరేకత ఉంటే రెండోసారి గెలిచేవాడను కాననీ అంటున్నారు. పైగా ఇప్పుడు తనయుడు కేటీఆర్ ను సీఎం ను చేయాలన్న గట్టి పట్టుదలతో ఉన్నారు. ఈ టైమ్ లో కాంగ్రెస్ అదను చూసి కొట్టిన దెబ్బ ఫలిస్తే కేసీఆర్ కు తీవ్ర నిరాశ తప్పదు.