ప్రమాదాలు చెప్పిరావు.. ఒక్కోసారి చాలా చిన్నప్రమాదాలే వందల మంది మరణానికి కారణమవుతాయి. ఒక్కోసారి అతిపెద్ద ప్రమాదం జరిగినా.. ప్రాణ నష్టం మాత్రం జరగకుండా ఆపద దూది పింజలా వెళ్లి పోతుంది.. ఉత్తరాఖండ్ సిల్క్యారీ టన్నెల్ లో చిక్కుకుపోయిన 41 మంది కూలీల కు ఎదురైన ఆపద అలాంటిదే.. సుమారు 17 రోజులు ప్రపంచంతో సంబంధం లేకుండా భూ గర్భంలో ఓ టన్నెల్ లో వారు చిక్కుకుపోయారు. బయటపడే మార్గం లేదు.. ఎవరొ వచ్చి రక్షిస్తారన్న ఆశ అంతకన్నా లేదు.. అయినా వారిలో ధైర్యం చెక్కు చెదర లేదు.. తమ మానసిక ఆరోగ్యాన్ని, శారీరక ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుకుంటూ రేపటి సూర్యోదయం కోసం ఎదురు చూశారు. ఒత్తిడి తగ్గించు కోడానికి వారు అనుసరించిన విధానాలు చాల ఆసక్తికరంగానూ, అందరిలో ఉత్సుకత రేపేవిగానూ ఉన్నాయి. ఉత్తరాఖండ్ సిల్క్యారీ టన్నెల్ లో చిక్కుకున్న 41 మంది కార్మికుల అనుభవాలు రోమాంచితంగా ఉన్నాయి.
లోపల వారు అలా… బయట వీరు ఇలా… 17
లోపల అలా కార్మికులు బిక్కు బిక్కు మంటూ కాలం వెళ్ల దీస్తే వారిని బయటకు తెచ్చేందుకు మన అధికారులూ తక్కువ ప్రయత్నాలు చేయలేదు. టన్నెల్ ను డ్రిల్ చేసి వారిని ప్రాణాలతో బయటకు చేర్చాలని ఎన్ని ప్రయత్నాలుచేసినా అడుగడుగునా అవాంతరాలే ఎదురయ్యాయి. ఒకసారి మిషన్ విరిగిపోయింది. మరోసారి డ్రిల్లింగ్ మిషన్లు మొరాయించాయి. ఒకసారి సొరంగం ఎంట్రన్స్ పాక్షికంగా కుప్పకూలింది.ఆర్మీ సైతం రంగంలోకి దిగింది. అత్యున్నత సాంకేతికటెక్నాలజీతో కూడి నిపుణుల బృందం, ఐఐటీ ఎక్స్ పర్ట్స్ కూడా టన్నెల్లోపలికి దారి ఏర్పరచడానికి తీవ్రంగా ప్రయత్నించారు. ఆస్ట్రేలియాకుచెందిన టన్నెల్ ఎక్స్ పర్ట్ ఆర్నాల్డ్ డిక్స్ కూడా ఓ చేయి వేశారు.అయినా లాభం లేకపోయింది. ఒక్కోసారి చాలా చిన్న ప్రయత్నాలే పెద్ద ఫలితాలనిస్తాయి. చివరకు ఎప్పుడో ఏళ్ల క్రితం నాడు ప్రభుత్వం నిషేధించిన మొరటు విధానమైన ర్యాట్ హోల్ మైనింగ్ పద్దతి టన్నెల్ లోకి సొరంగ మార్గం ఏర్పాటు చేయడానికి పనికొచ్చింది.
పిడుగు పడినంత శబ్దం… వణికిపోయిన కార్మికులు 17
సాధారణంగా గని కార్మికులకు ప్రాణాపాయ స్థితిలో ఏం చేయాలో ముందే శిక్షణ ఇస్తుంటారు. గని కూలిపోయి లోపల చిక్కుకుపోతే అందులోని వారు వాటర్ పైప్ ను ఓపెన్ చేస్తారు. ఉత్తరాఖండ్ లో కూలీలు కూడా ఇదే విధానం అనుసరించారు. దీపావళి నాడు గని పాక్షికంగా కూలిపోయి దారి మూసుకుపోయింది. అది కూలినప్పుడు చెవులు పగిలిపోయేంత భారీ శబ్దం వచ్చింది. లోపలి మైనింగ్ కార్మికుల్లో కొందరికి దీనివల్ల చెముడు కూడా వచ్చేసింది. ఆ టైమ్ లోనే లోపల తాము చిక్కుకు పోయినట్లు బయట ప్రపంచానికి తెలిసేట్లుగా వాటర్ పైప్ లైన్ ఆన్ చేశారు. దాన్లోంచి నీళ్లు బయటకు రావడంతో సొరంగంలో మనుషులు బతికే ఉన్నారని అర్ధంచేసుకుని లోపలికి ఆక్సిజన్ పంపారు బయటి సిబ్బంది.
మానసిక ఒత్తిడికి చెక్ చెప్పారిలా…
సొరంగం కూలిన రెండో రోజే శిథిలాల గుండా 4 అంగుళాల వెడల్పున్న ఓ స్టీల్ పైపును పంపించి దాని ద్వారా డ్రై ఫ్రూట్స్, నీరు , ఆక్సిజన్ అందించారు. ఎండోస్కోపి కెమెరాల ద్వారా టన్నెల్ లో చిక్కుకున్న వారిని చూసేందుకు ప్రయత్నించినా అది పూర్తిగా సాధ్యపడలేదు. సొరంగంలో 41 మంది ఉండటం, తిరిగేందుకు 2 కిలోమీటర్ల ప్రదేశం ఉండటంతో వారు ధైర్యంగానే ఉన్నారు. కాలక్షేపం కోసం ఫోన్లో లూడో ఆడటంతో పాటు, సొరంగంలో ఊరిన నీటితో స్నానం చేశారు. వారిలో మానసిక ఒత్తిడి , భయాన్ని తగ్గించడానికి వారికి పేకలు, లూడో, మినీ ఛెస్ బోర్డులు లోపలికి పంపించారు. ఇంతేకాదు సరదాగా దొంగా, పోలీస్ లాంటి ఆటలు ఆడటం ద్వారా వారు స్ట్రెస్ నుంచి బయటపడ్డారు. యోగా, ఎక్సర్ సైజులు కూడా చేశారు.
వారు మృత్యుంజయులు… 17
లోపల కార్మికల యాక్టివిటీ అలా ఉంటే బయట వారిని నిత్యం సంతోషంగా, యాక్టివ్ గా ఉంచేందుకు మానసిక వైద్యుల బృందం వారితో మాట్లాడటం, పలకరించడం లాంటివి ట్రై చేసింది. కూలీల బంధువులతో కూడా మాట్లాడించింది. చివరకు ప్రధాని మోడీ సైతం టన్నెల్ లో ఉన్న వారిని పలుకరించే ప్రయత్నం చేశారు. నిజంగా అవి ఉద్విగ్న క్షణాలు. 17 రోజులు వేరే లోకంలో ఉన్నట్లు గడిపిన వారంతా క్షేమంగా, ఎలాంటి గాయాలు కాకుండా, మానసిక ధైర్యం సడలకుండా, సేఫ్ గా బయటకు వచ్చారు. ఇది నిజంగా అద్భుతం. వీరి గుండె ధైర్యానికి హ్యాట్సాఫ్ చెప్పాలి. వారు చేసిన రిస్క్ కు సలాం కొట్టాలి.