COP28-UAE
పర్యావరణ పరిరక్షణ కోసం ప్రపంచ దేశాలు చేసుకోవాల్సిన ఒప్పందంపై తర్జన భర్జనలు జరుగుతున్నాయి. శిలాజ ఇంధనాల అంశం ఖచ్చితంగా ఈసారి అగ్రిమెంట్ లో కీలక అంశంగా ఉండాలని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పట్టుబడుతోంది. యూఏఈలో జరిగిన 2023 ఐక్యరాజ్యసమితి క్లైమేట్ ఛేంజ్ సదస్సులో తీవ్రమైన గ్లోబల్ వార్మింగ్ ప్రభావాన్ని ఎదుర్కొంటున్న దేశాలకు ఆర్థ్దిక సాయం అందించేందుకు దాదాపు 200 దేశాలు ఈ ఒప్పందంపై సంతకాలు చేశాయి.
క్లైమేట్ ఫైనాన్సింగ్
క్లైమేట్ ఛేంజ్ సమస్య విసురుతున్న సవాళ్లను ఎదుర్కొనడానికి అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య టెక్నాలజీ బదలాయింపు, క్లైమేట్ ఫైనాన్సింగ్ లాంటివి జరగాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు నిచ్చారు. ఈ సదస్సులో పాల్గొనేందుకు నిన్న రాత్రే ఆయన దుబాయ్ చేరుకున్నారు.
దుబాయ్ లో ఉన్న భారత సమూహం ఆయనకు ఘనమైన స్వాగతం పలికింది. మరింత మెరుగైన ప్రపంచ స్థాపనకు జరుగుతున్న కాప్ -28సదస్సులో పాల్గొనేందుకు దుబాయ్ చేరుకున్నాను.. ఇక్కడి భారత సమూహాలు ఇచ్చిన స్వాగతం నన్ను కదిలించింది అంటూ అంతకుముందు మోడీ ట్విటర్ లో పోస్ట్ చేశారు. భారత, దుబాయ్ దేశాల మధ్య నున్న ధృఢమైన బంధాన్ని, సాంస్కృతిక వారసత్వాన్ని నిలబెడుతున్న వారందరికి ధన్యవాదాలు అని మోడీ ట్వీట్ చేశారు.
మరో పది రోజుల పాటు సదస్సు COP28-UAE
క్లైమేట్ ఛేంజ్ పై జరుగుతున్న ఐక్యరాజ్యసమితి కాప్ 28 సదస్సులో మోడీ ఇవాళ పాల్గొంటున్నారు. కాప్ -28 సదస్సులో ప్రపంచ క్లైమేట్ యాక్షన్ సమ్మిట్ చాలా ఉన్నతస్థాయి సమావేశం అవుతుంది. దీనితో పాటు ప్రధాని మరో మూడు అదనపు ఈవెంట్లలో కూడా పాల్గొంటున్నారు. కాప్-28 సదస్సు యుఏఈలో గతనెల 30 నుంచి ఈనెల 12 వరకూ జరగనుంది.పారిస్ ఒప్పందంలో భాగంగా ఇప్పటి వరకూ జరిగిన పురోగతిని సమీక్షించడమే కాకుండా భవిష్యత్తు కోసం ఏం చేయాలన్న అంశంపైనా చర్చిస్తారు.
భూతాపంలో 2023 సరికొత్త రికార్డు COP28-UAE
ప్రపంచ వ్యాప్తంగా ఉష్ణ కాలుష్యం అంతకంతకూ పెరుగుతున్న ఈ తరుణంలో వాటి నివారణకు చేస్తున్న ప్రయత్నాల్లో ఈ సదస్సు అత్యంత కీలకమైంది. 2023 ఏడాది చరిత్రలోనే అత్యంత అధిక ఉష్ణోగ్రతలు వెదజల్లిన ఏడాదిగా రికార్డు సృష్టించింది.తక్షణ నివారణా చర్యలు చేపట్టాల్సిన అవసరాన్ని ఇది సూచిస్తోంది.
అత్యవసరంగా నష్ట నివారణ, విధ్వంస నివారణకు ఆర్థిక ఫండ్ ను ఏర్పాటు చేయడం ద్వారా పర్యావరణ దుర్బలమైన దేశాలను ఆదుకునే వీలుంటుందని కాప్ సదస్సు విజయవంతం అవడానికి అదొక సూచికగా మారుతుందని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. వాల్డ్ క్లైమేట్ ఫండ్ కోసం యూఏఈ, యూరోపియన్ యూనియన్ చెరో 100 మిలియన్ల,246 మిలియన్ల డాలర్లను తమ వంతుగా ప్రకటించాయి. క్లైమేట్ ఛేంజ్ ప్రభావాలను ఎదుర్కొనడానికి అభివృద్ధి చెందిన దేశాలకు మరో 100 బిలియన్ డాలర్ల అవసరం పడుతుంది.
ప్రస్తుతం జరుగుతున్న కాప్ 28 సదస్సు చరిత్రలోనే అతిపెద్ద క్లైమేట్ సదస్సు అవుతుంది. దాదాపు 140 దేశాల అధిపతులకు ఈ సదస్సు ఆతిధ్యం ఇస్తోంది. కాప్ -27 సదస్సుతో పోలిస్తే ఈ సదస్సుకు హాజరు రెట్టింపు అయ్యింది. ఇవాళ, రేపు జరిగే ఈ సదస్సులో వివిధ దేశాల అధిపతులు ఈ సదస్సులో పాల్గొంటున్నారు. బ్రిటన్ రాజు మూడవ కింగ్ ఛార్లెస్ సదస్సులో ప్రారంభ ఉపన్యాసం చేశారు. పునరుత్పాదక శక్తిని మూడింతలు పెంచేలా ఒప్పందం చేసుకోవాలని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పట్టుబడుతోంది. 2030 నాటికి పునరుత్పాదక శక్తిని గణనీయంగా మెరుగుపరచుకోవడమే ధ్యేయంగా ఈ సదస్సు అడుగులు వేస్తోంది.
హాజరు కాని చైనా, అమెరికా
అయితే ప్రపంచంలోనే అత్యధిక కాలుష్యకారక దేశాలైన అమెరికా, చైనా మాత్రం ఈ సదస్సుకు హాజరు కావడం లేదు. అయితే ఈ రెండు దేశాలు కలసి సంయుక్తంగా జాయింట్ క్లైమేంట్ డిక్లరేషన్ చేసి సదస్సుకు పంపడం ఒక పాజిటివ్ పరిణామంగా భావించవచ్చు.