Exit Polls
తెలంగాణ ఎన్నికలు పూర్తయ్యాయి. ఇక ఫలితాలే తరువాయి. దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ కి ఎడ్జ్ ఉందని సూచించాయి. అయితే పోలింగ్ ఓ పక్క జరుగుతుండగా ఎగ్జిట్ పోల్స్ ఎలా ఇస్తారంటూ బీఆర్ ఎస్ తిరగబడింది. అయినా అవి సరైన కొలమానం కావని, తామే గెలవబోతున్నామని కేటీఆర్ స్పెషల్ ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. 2014లో కూడా ఇలాగే చెప్పారని అప్పట్లో ఆ పోల్స్ ఫలితాలన్నీ తప్పని నిరూపితమైందని అన్నారు. నూటికి నూరు శాతం మేమే గెలుస్తాం.. కార్యకర్తలు అధైర్యపడొద్దు.. ఇవాళ ఫలితాలు చెప్పిన సంస్థలన్నీ ఆరోజు మాకు క్షమాపణలు చెప్పాలంటూ కేటీఆర్ బీరాలు పోయారు. అయితే ఆయన ముఖంలో నవ్వు మాత్రం లేదు.. ఏదో టెన్షన్లో ఉన్నట్లుగానే కనిపించారు. ఎగ్జిట్ పోల్స్ అన్నీ కాకిలెక్కలేనంటున్నారు మరికొందరు. బీఆర్ఎస్ గెలుపు తధ్యమని, కాకపోతే మెజారిటీ బాగా తగ్గొచ్చని, లేదా మరీ పరిస్థితి వికటిస్తే హంగ్ రావొచ్చని అంటున్నారు. అంతేకానీ కాంగ్రెస్ అవుట్ రైట్ గా గెలుస్తుందని మాత్రం చెప్పలేకపోతున్నారు.
కామారెడ్డి లో కేసీఆర్ ఓడిపోతారా?
మరోవైపు ఆదివారం వెలువడే అసలు ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలీదు కానీ మీడియా మొత్తం కాంగ్రెస్ కే ఎడ్జ్ ఉందంటూ ఎగ్జిట్ పల్స్ తో ఊదరగొట్టింది. పీసీసీ చీప్ రేవంత్ కూడా పోలింగ్ అవగానే ఓ మీడియా మీట్ పెట్టి కామారెడ్డిలో కేసీఆర్ ఓడిపోతున్నారని, అందుకు కృషి చేసిన కాంగ్రెస్ నేతలందరికీ పేరు పేరునా కృతజ్నతలు తెలిపారు. అయితే రేవంత్ ముఖంలో కూడా పెద్దగా సంతోషం లేదు. కామారెడ్డిలో బీజేపి అభ్యర్ధి గెలుస్తాడన్న టాక్ గట్టిగా వినిపిస్తోంది. అందుకే రేవంత్ కాస్త డల్ గా కనిపించారా?
ప్రశాంత్ కిషోర్ ఫోన్ చేశారా?
మరోవైపు ఐప్యాక్ ఫౌండర్ ప్రశాంత్ కిశోర్ రేవంత్ కు ఫోన్ చేసి విషెస్ చెప్పారని, భారీ మెజారిటీతో గెలవబోతున్నారంటూ అభినందించారని వాట్సప్ మెసేజ్ లు సర్క్యులేట్ అయ్యాయి. ఇందులో నిజా నిజాలు తెలియవు. కాంగ్రెస్ లో గెలుపు అవకాశం ఉన్న అభ్యర్ధులను ముందుగానే క్యాంప్ కార్యాలయానికి తరలించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. ఒకవేళ హంగ్ వస్తే ఎమ్మెల్యేల కొనుగోళ్లు భారీగా జరగొచ్చన్న భయమూ ఆ పార్టీకి ఉంది. అందుకే తమ వారందరినీ కాపాడుకోవాలని కర్ణాటక పీసీసీ చీఫ్ డీ.కె. శివకుమార్ ను రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది.మరోవైపు ఈవీఎంలను జాగ్రత్తగా పరిశీలించాలని, ఏ దశలోనైనా తారుమారు చేసే అవకాశాలున్నాయని రేవంత్ తమ కార్యకర్తలకు గట్టిగా చెప్పారు. కాంగ్రెస్ ఏర్పాట్లు ఇలా ఉంటే బీఆర్ఎస్ మాత్రం గెలుపు తమదేనని చెబుతోంది.
కేసీఆర్ తీరు ఇప్పటికైనా మారుతుందా?
కానీ ఒకటి మాత్రం నిజం.. గత పదేళ్లుగా అధికారంలో ఉంది కాబట్టి కేసీఆర్ ప్రభుత్వంపై కొన్ని వర్గాల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఆయన ఓడిపోవడం ఖాయమని ఆ ఆగ్రహావేశాలు ఉన్న వారు కసితీరా తిట్టుకోవడం మామూలే. బీఆర్ ఎస్ గెలిస్తే మాత్రం రాష్ట్రంలో ఇక విపక్షమన్నది ఉండదేమోనన్న భయాలూ ఉన్నాయి. ఎందుకంటే గత పదేళ్లుగా ఏ రాజకీయ పార్టీని బీఆర్ ఎస్ బతకనివ్వలేదు. అన్ని పార్టీల నుంచి వారికి కావాల్సిన వారిని లాగేసుకున్నారు. విపక్షాలను కలవరు. ఏ మీటింగులకు హాజరు కారు. ఎవరితోనూ మాటా, మంతీ ఉండదు.. ఏ నిర్ణయమూ వేగంగా తీసుకోరు.. ప్రజాస్వామ్య పద్ధతులపై ఆయనకు నమ్మకం లేదు. తమపై వస్తున్న విమర్శలను అర్ధం చేసుకుని తీరు మార్చుకుంటారా అంటే అది కేసీఆర్ వ్యవహారశైలికి భిన్నం.. ఆయనకు అలా ఒకరు చెప్తే తనను తాను కరెక్ట్ చేసుకునే బుద్ధి లేదు. ఏదైనా తనకు తడితే తప్ప ఆయన చేయరు. ఎవరి సలహాలు కేసీఆర్ కు అక్కర లేదు.కాబట్టి బీఆర్ ఎస్ గెలిచినా, ఓడినా ఆయన తీరు మారే అవకాశం ఉండకపోవచ్చు.