బై…బై… బాబు అంటూ 2019 ఏపీలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి తనయ షర్మిల ఏపీ రాష్ట్రమంతా కలియతిరిగిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది.. షర్మిల వైసీపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతీ ఊరు ,వాడ వెళ్లి చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేయించి చివరిలో ఫినిషింగ్ టచ్ గా బై.. బై.. బాబు అంటూ ఉత్తేజపూరితంగా నినాదం చేసేవారు. షర్మిలతో పాటు సభకు వచ్చిన వారంతా ఉత్సాహంగా బై. .బై..బాబు అని నినాదాలు చేసి చప్పట్లు చరిచేవారు. అలాంటి సంఘటనకే తెలంగాణలోనూ షర్మిల తెర తీశారు.. అయితే ఈసారి అది కారు పార్టీ కోసం… బీఆర్ ఎస్ పార్టీ ఓటమి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న షర్మిల ఎగ్జిట్ పోల్ ఫలితాలు కాంగ్రెస్ కే పట్టం కట్టడంతో ఉత్సాహంలో ఉన్నారు. తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ ను గద్దె దించాలన్న ఒకే ఒక్క అజెండాతో ఓట్లు చీలరాదన్న ఉద్దేశంతో ఈ ఎన్నికలకు షర్మిల దూరమయ్యారు.
సింబాలిక్ గా సూట్ కేసు ప్రదర్శన
బేషరతుగా కాంగ్రెస్ కు ఆమె మద్దతు ప్రకటించారు. ఎగ్జిట్ ఫలితాలు నిజం కావాలని ఆమె గట్టిగా కోరుకుంటున్నారు. బైబై కేసీఆర్ అని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారన్న మెసేజ్ అతికించిన ఒక సూట్ కేసును ఆమె మీడియా ముందు ప్రదర్శించారు. కేసీఆర్ ను సూట్ కేస్ సర్ది సాగనంపే సమయం వచ్చిందని ఆమె అంటున్నారు. కేసీఆర్ కు రెండు సార్లు ప్రజలు అధికారం ఇచ్చినా ఇచ్చిన హామీలేవీ నిలబెట్టు కోలేదని మండి పడ్డారు.కేసీఆర్ ఎలాంటి జిమ్మిక్కులు చేయకుండా ప్రజా తీర్పును శిరసా వహించాలని సూచించారు. ఇంకా డొంక తిరుగుడగా, దొడ్డి దారిన ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నిస్తే ప్రజలే బుద్ధి చెప్పాలని పిలుపు నిచ్చారు షర్మిల.
కాంగ్రెస్ పార్టీకి హైప్ వచ్చింది
రాహుల్ గాంధీ భారత జోడో యాత్ర, కర్ణాటక ఫలితాల నేపధ్యంలో తెలంగాణలో కాంగ్రెస్ కు హైప్ వచ్చిందన్నారు షర్మిల. తాము ఎన్ని పాదయాత్రలు, పోరాటాలు, మంగళవారం దీక్షలు చేసినా తమ పార్టీకి హైప్ పెద్దగా రాలేదని కాంగ్రెస్ పార్టీకి ఆ హైప్ వచ్చిందనీ అన్నారు. కేసీఆర్ రాక్షస పాలన అంతమవ్వాలని, ఓట్లు చీలరాదన్న ఒకే ఒక ఉద్దేశంతో తాను ఎన్నికల బరి నుంచి తప్పుకుని ఏకపక్షంగా కాంగ్రెస్ కు మద్దతు పలికామన్నారు.తనతో పోరాటం చేసినవాళ్లు, తన పార్టీ వాళ్లు కూడా ,చివరకు కేసీఆర్ తో చేతులు కలిపారని అది తనను బాధించిందనీ అన్నారు. కేసీఆర్ కు ఇప్పుడొక ఆఫర్ ఇస్తున్నా.. రేపు ఫలితాలు వచ్చి ఓటమి ప్రకటించాక పెట్టే బేడా సర్దుకుని బయల్దేరండి ఫామ్ హౌస్ కి అంటూ సింబాలిక్ గా ఓ సూట్ కేసును చూపించారామె.
షర్మిలకు కాంగ్రెస్ సీనియర్ల సెగ
వైఎస్సార్టీపి పార్టీ పెట్టి కేసీఆర్ కు వ్యతిరేకంగా బలంగా గళం వినిపించిన షర్మిల ఆ తర్వాత పార్టీకి హైప్ రాకపోవడంతో చతికిల పడ్డారు. ఈలోగా తన వెంట నడచిన వారంతా బీఆర్ ఎస్ పార్టీకి వెళ్లిపోవడం ఆమెలో నిరాశను నింపింది. అదే సమయంలో కర్ణాటక పీసీసీ చీఫ్ డి.కె. శివకుమార్ మధ్యవర్తిత్వంతో కాంగ్రెస్ నుంచి చేతులు కలపమని ప్రతిపాదన రావడంతో ఆమె ఢిల్లీ వెళ్లి రెండు, మూడు విడతలుగా చర్చలు కూడా జరిపారు. అయితే తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు, రేవంత్ వర్గం ఆమెను వ్యతిరేకిస్తుండటంతో చేరిక వాయిదా పడింది. పరిణామాలతో విసిగిపోయిన షర్మిల మౌనం దాల్చారు. షర్మిల సేవలు ఏపీలో కాంగ్రెస్ కోసం వాడుకోవాలంటూ తెలంగాణ నేతలు కోరుతుండగా, ఆమె ఏపీకి వెళ్లేందుకు ఇష్టపడటం లేదు. ఫలితాలు వెల్లడయ్యి ఒక వేళ కాంగ్రెస్ భారీ మెజారిటీతో అధికారంలోకి వస్తే షర్మిలకు కాంగ్రెస్ హై కమాండ్ ఏదైనా కీలక పదవి ఇస్తుందేమో చూడాలి. గతంలోనే ఆమెకు ఒకటి, రెండు పదవులు ఆఫర్ చేసినా ఆమె తిరస్కరించారని సమాచారం.