తెలంగాణ ఎన్నికల సస్సెన్స్ వీడింది. స్వపరిపాలన కాంక్షతో ఏర్పాటైన రాష్ట్రంలో పదేళ్ల తర్వాత ఉద్యమ పార్టీకి గాక మరో పార్టీకి అంటే తెలంగాణ ఇచ్చిన పార్టీకి ప్రజలు పట్టం కట్టారు. కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీ దిశగా దూసుకుపోయింది. ఇక రేపో, ఎల్లుండో కాంగ్రెస్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారమే తరువాయి. కాంగ్రెస్ లో సీఎం ఎవరు అవుతారన్నది ఇప్పుడు ప్రశ్న.. పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, నల్లగొండను క్లీన్ స్వీప్ చేసిన కోమటి రెడ్డ వెంకట రెడ్డి, సీనియర్ నేత జానా రెడ్డి, ఇలా తెరపైకి చాలా పేర్లే వస్తున్నాయి.
వీరిలో రేవంత్ టీడీపీనుంచి కాంగ్రెస్ కు వచ్చిన వ్యక్తి కాగా, మిగిలిన వారంతా ఒకే పార్టీని నమ్ముకున్న వారు. అయితే కాంగ్రెస్ సీఎం క్యాండిడేట్ గా రేవంత్ తనను తాను ప్రొజెక్ట్ చేసుకోవడంలో సక్సెస్ అయ్యాడు. హైకమాండ్ ఎవరి పేరు చెబితే వారే సీఎం. . ఎమ్మెల్యేలు అంతా కలసి సీఎల్పీ నేతను ఎన్నుకుంటారు. ఇప్పటి వరకూ జరిగిన పరిణామాలను బట్టి రేవంత్ రెడ్డి సీఎం గా ఎంపిక ఇక లాంఛనమే.. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను నిలబెట్టుకోవడం ఇప్పుడు ఆ పార్టీ ప్రథమ కర్తవ్యం.
దక్షిణాదిన చేజారిన హాట్రిక్ రికార్డ్
ఎన్నికల్లో ఓటమి బహుశా కేసీఆర్ ను నిరాశ పరచి ఉండొచ్చు.. ఫలితాలు ఇంకా వెలువడుతున్న సమయంలోనే ఆయన తన రాజీనామాను పంపేశారు.. ఓఎస్డీతో లేఖను గవర్నర్ కు పంపి ఆయన ఫామ్ హౌస్ కు వెళ్లిపోయారు. తెలంగాణకు సిసలైన ప్రతినిధిని అని గర్వంగా చాటుకున్న కేసీఆర్ పై పదేళ్ల తర్వాత ప్రభుత్వ వ్యతిరేకత ఎదురు గాలిలో కొట్టుకు పోయారు.నిప్పుకైనా చెద పడుతుందన్నట్లు కేసీఆర్ దొరతనం, ఆయన వ్యవహార శైలి తీవ్రమైన వ్యతిరేకతను పెంచాయి. ప్రజలకు అందుబాటులో లేకపోవడం, కాళేశ్వరంపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు, అహంకారం అన్నీ ఆయనకు శాపంగా మారాయి. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీలో విఫలం కావడం ,ఇలా అనేక వైఫల్యాలు వెంటాడాయి. అంతెందుకు కేసీఆర్ అహంకార పూరిత విధానాలకు ఒక చిన్న ఉదాహరణ..
జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీకి చట్టం ప్రకారం ఇవ్వాల్సిన భూమిని ఇప్పటి వరకూ హ్యండ్ ఓవర్ చేయలేదు. సుప్రీం కోర్టు ఉత్తర్వులు ఉన్నా ఆ భూమిని ఇప్పటికీ జర్నలిస్టులకు బదలాయించలేదు. ఇది ఆయన అహంకారానికి నిదర్శనం.. 13 ఏళ్లుగా ఈ భూమి కేటాయింపు జరగక ఆ భూమిపైనే ఆశపెట్టుకున్న ఎంతో మంది జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయారు. డబ్బు కట్టీ, స్థల కేటాయింపు జరగక, అద్దె ఇళ్ల భారం భరించలేక ఎంతో మంది జర్నలిస్టులు ఇబ్బందులు పడుతున్నారు.జర్నలిస్టులకు ఇవ్వాల్సిన ఈ భూమి ఏమీ ఉద్దర కేటాయింపు కాదు.. 13 ఏళ్ల క్రితం వారు సొమ్ము చెల్లించి కొనుక్కున్న భూమి.. సుప్రీం కోర్టు కేసు పుణ్యమాని ఇన్నేళ్లు పట్టింది.
తీరా కోర్టు తీర్పు సానుకూలంగా వచ్చి ఏడాది గడుస్తున్నా.. ఆ ఫైల్ క్లియర్ చేయకుండా ఆపింది కేసీఆర్ ప్రభుత్వం. పైగా.. మాకు వ్యతిరేకంగా వార్తలు రాసే జర్నలిస్టుల పని పడతాం.. వారికి ఏ విధమైన లబ్ది కలగనివ్వం అంటూ హెచ్చరించడం ఆయన అహంకారానికి పరాకాష్ట. తమను ఎవరూ వ్యతిరేకించకూడదా? తవ్వుతూ పోతే కేసీఆర్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల అపరిష్కృతంగా నానుతున్న సమస్యలు ఇంకా చాలానే ఉన్నాయి. రెండుసార్లు దిగ్విజయంగా గెలిచిన కేసీఆర్ మూడో సారీ గెలుస్తారని, దక్షిణాదిన ఏ సీఎం పొందని హ్యాట్రిక్ విజయం పొందుతారని ఆ పార్టీ పదే పదే చెప్పుకుంది.. కానీ అది సాధ్యపడలేదు.
కాంగ్రెస్ మాట నిలబెట్టుకోవాలి…
విపక్షం బలంగా లేకపోతే అధికా పక్షానిది ఆడినది ఆట, పాడినది పాట అవుతుంది. ఇన్నాళ్లూ కేసీఆర్ కి ఎదురన్నది లేకుండా పోయింది. కాంగ్రెస్ తన లోపాలను సవరించుకుని ఐక్యంగా నిలబడటం వల్ల ఈ గెలుపు సాధ్యమైంది. . మరి ఈ ఐక్యతను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఆ పార్టీపైనే ఉంది. ఇందులో కాంగ్రెస్ కృషి మాటెలా ఉన్నా ప్రభుత్వ వ్యతిరేకత ఆ పార్టీకి అనుకూలంగా మారిందని చెప్పాలి. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేయడం ఇప్పుడు అతిపెద్ద సవాల్. ఈ హామీని నిలబెట్టుకుంటేనే ఆ పార్టీపై ప్రజలకు నమ్మకముండేది…