అదో భారీ బ్యాంక్ దోపిడీ. వాళ్లు మామూలు దొంగలు కాదు.. ఏకంగా ఏకే 47 రైఫిల్స్ ధరించి మరీ వచ్చి దర్జాగా దొంగతనం చేశారు. దాదాపు గా 18కోట్ల 85వేలు లూటీ చేశారు. జాతి ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపూర్లో బ్యాంకు దోపిడీలు విచ్చల విడిగా సాగుతున్నాయ్. ఉఖ్రుల్ జిల్లాలోని వ్యూలాండ్ లో ఈ ఘటన జరిగింది. అక్కడి పంజాబ్ నేషనల్ బ్యాంక్ పై ఈ దొంగల ముఠా దాడి చేసి ఈ ఘాతుకానికి పాల్పడింది. బ్యాంకు సిబ్బంది రోజు వారీ లావాదేవీలు పూర్తి చేసి కస్టమర్లను బయటకు పంపి ముగింపు పనులు పూర్తి చేసుకుంటున్న తరుణంలో ఈ ముఠా లోనికి ప్రవేశించిందిః
సినీ ఫక్కీలో భారీ దోపిడీ
పక్కా సినీ ఫక్కీలో ఈ దొంగతనం జరిగింది. పది మంది సభ్యులు కలిగిన ఈ దొంగల ముఠా వస్తూ వస్తూనే లోపలకి వెళ్లి తలుపులు వేసేశారు. బ్యాంకు మేనేజర్, సిబ్బంది, సెక్యూరిటీ గార్డులను బందీలుగా పట్టుకున్నారు. ఆపై స్ట్రాంగ్ రూమ్ లోకి వెళ్లి బ్యాంకులో ఉంచిన పద్ధెనిమిది కోట్ల ఎనభై ఐదువేలు లూటీ చేశారు. అందరూ ముసుగులు ధరించడంతో వారెవరు? ఎలా ఉంటారు అన్నది ఎవరూ పసిగట్టలేకపోయారు. సిబ్బందిలో బ్యాంకు మేనేజరును టాయిలెట్ లో బంధించారు. మిగిలిన ఉద్యోగులను కూడా అదే రీతిలో బ్యాంకులోని మరో రూమ్ లో పెట్టి తాళం వేశారు. మరో దొంగ భద్రతా సిబ్బందిని కూడా మరో రూమ్ లో బంధించాడు. ఆ తర్వాత ఒక ఉద్యోగిపై తుపాకీ గురి పెట్టి భయపెట్టారు.
బ్యాంకు లాకర్ తెరవాల్సిందిగా ఆదేశించారు. భయపడిన ఆ ఉద్యోగి వారు చెప్పినట్లే చేశాడు. ఆ వెంటనే బ్యాంకులో ఉన్న నగదును పకడ్బందీగా తరలించారు. అడుగడుగునా పకడ్బందీ ప్లాన్ తో దొంగలు ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. ఉఖ్ రుల్ జిల్లాలోని బ్యాంకులు, ఏటీఎంలకు తరలించడానికి అవసరమైన నగదును రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ బ్యాంక్ లోనే నిల్వచేస్తుందని అధికారులు చెబుతున్నారు. బ్యాంకులోని సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దొంగలు దొంగతనం నిర్వహించిన తీరును పోలీసులు గమనించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు జరపాలని నిర్ణయించారు. అధికారులు ఘటనపై ఉఖ్రుల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిందితులను గుర్తించేందుకు పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు.
దుండగుల దగ్గర ఇతర ఆయుధాలు…
ఉఖ్రుల్ ఎస్పీ నగరంలోని అన్ని ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. దాంతో పాటు నగరంలోని అన్ని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. దుండగుల వద్ద ఏకే రైఫిల్స్ తో పాటు ఇంకా అనేక రకాల ఆయుధాలు ఉన్నట్లు తేలింది. చోరీ జరిగిన సమయంలో బ్యాంకులో మొత్తం 8 మంది ఉద్యోగులు ఉన్నారని బ్యాంకు ఇన్ఛార్జ్ మేనేజర్ ఎం.కుముని తెలిపారు. ఆ సమయంలో సెక్యూరిటీ సిబ్బంది అంతా బ్యాంకులో లేరని చెప్పారు.
శుక్రవారం బ్యాంకు ఉద్యోగులందరినీ పోలీసులు క్షుణ్ణంగా విచారించారు. మే 3న జాతుల వివాదం మొదలైన తర్వాత మణిపూర్లో బ్యాంకు దోపిడీకి పాల్పడడం ఇది మూడోసారి. గతంలో జరిగిన దోపిడీ ఘటనల్లో కాంగ్పోక్పిలోని మణిపూర్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ బ్రాంచ్ లూటీకి గురైంది. ఇదే కాకుండా చురచంద్పూర్ జిల్లాలోని యాక్సిస్ బ్యాంక్ బ్రాంచ్ కూడా లూటీకి గురైంది. ఈ రెండు ఘటనల్లోనూ కంప్యూటర్లు, ఇతర యంత్రాల నష్టం రూ.కోటి ఉంటుందని, నగదు, నగలు మాయమైనట్లు రూ.2.25 కోట్లుగా అంచనా. ప్రస్తుతం ఈ కేసులన్నింటినీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.