తెలంగాణలో కాంగ్రెస్ విజయానికి మూలకారకుడైన వ్యూహకర్త సునీల్ కనుగోలును ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. కర్ణాటకకు చెందిన ఈ మేధావి ఎన్నికల రాజకీయాలు చేయడంలో దిట్ట గా పేరు పడ్డారు. రాష్ట్రం ఇచ్చి కూడా పదేళ్లపాటు ప్రతిపక్షంలో చతికిల పడిన కాంగ్రెస్ కు ఈసారి సునీల్ వ్యూహాలు చాలా బాగా సాయం చేశాయి. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రాడానికి స్ట్రాటజీ వర్కవుట్ చేసిన సునీల్ అందులో సక్సెస్ అవడంతో సిద్దరామయ్య ప్రభుత్వంలో ఆయనకు కేబినెట్ ర్యాంకు హోదా కల్పించారు.
తెలంగాణ కాంగ్రెస్ గెలుపుకు కూడా వ్యహ రచన చేయించింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ వాణిజ్య ప్రకటనలు కూడా ఈ సారి గెలవడానికి చాలా ఉపకరించాయి. సంక్షిప్త సందేశాలు సూటిగా, స్పష్టంగా డిజైన్ చేయడంలో సక్సెస్ అయ్యారు సునీల్. ఈసారి కాంగ్రెస్ ప్రచార ప్రకటనలు చాలా హుందాగా, క్లుప్తంగా, అద్భుతంగా ఉన్నాయి. అందుకు సునీల్ ను అభినందించి తీరాల్సిందే.
చెప్పినా వినని గెహ్లాట్, కమల్ నాథ్
పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, సునీల్ అద్భుతమైన కాంబినేషన్ ఈసారి విజయాన్ని సాధ్యం చేసింది. 119 స్థానాలున్న తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ 64 స్థానాలు గెలిచి చరిత్ర సృష్టించింది. కానీ రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తిస్ గఢ్ లలో సునీల్ స్ట్రాటజీ ఏ మాత్రం వర్కవుట్ కాలేదు. అయితే రాజస్థాన్, మధ్యప్రదేశ్ నేతలైన అశోక్ గెహ్లాట్, కమల్ నాథ్ ల ఆలోచనా విధానం సునీల్ కు ఏ మాత్రం మ్యాచ్ కాలేదన్నది ఒక టాక్.
అందుకే అక్కడ గెలుపు సాధ్యం కాలేదని అంటున్నారు. గెలుపు గుర్రాలు కొందరిని ఎంపిక చేసి వారికే టిక్కెట్లు కేటాయించాలని కనుగోలు చెప్పినా రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ వినలేదని, నరేష్ అరోరా అనే మరో వ్యూహ కర్తను ఆయన ఆశ్రయించారని అదే కొంప ముంచిదని అంటున్నారు.
దాదాపు అన్నిపార్టీలకు పని చేసిన చరిత్ర
కర్ణాటక, తెలంగాణలలో సునీల్ కు తగిన స్వేఛ్చ ఇవ్వడంతో ఆయన గెలుపు ఫార్ములా రచించి విజయం సాధించగలిగారని సునీల్ అనుచరులు చెబుతున్నారు.40 ఏళ్ల సునీల్ కర్ణాటకకు చెందిన వ్యక్తి.. కర్ణాటకలో బీజేపి ప్రభుత్వ విధానాలను, అక్కడి సీఎం ను పే సీఎం అంటూ సంభోదించి రచించిన యాడ్స్ బాగా క్లిక్ అయ్యాయి. బీజేపి ప్రభుత్వ అవినీతి ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు. అలాగే తెలంగాణలో కూడా కల్వకుంట్ల కుటుంబం అవినీతిపై ప్రచారాస్త్రాలు సంధించారు సునీల్ కనుగోలు. ఇవి జన సామాన్యానికి బాగా అర్ధమయ్యాయి.
ప్రజలకు కనెక్ట్ అయ్యే విధంగా ప్లాన్ చేసిన ఆరు గ్యారంటీలు కూడా బాగా హిట్ అయ్యాయి. 2018లో కర్ణాటకలో బీజేపి ఎన్నికల వ్యూహకర్తగా కనుగోలు పనిచేశారు. అప్పట్లో ఆయన రచించిన వ్యూహం వల్లనే బీజేపి 104 సీట్లతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆవిర్భవించింది. 2014 ఉత్తర ప్రదేశ్, గుజరాత్ ల లో బీజేపి ప్రచార కాంపెయిన్ ను రచించినది కూడా సునీలే కావడం విశేషం.
2019 తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే పార్టీ ప్రచారం కోసం నమక్కు నామె (మనకోసం మనం) అనే కాంపెయిన్ ను సునీల్ రచించారు. అది డీఎంకేకు గౌరవ ప్రదమైన సీట్లను తెచ్చి పెట్టింది. అలాగు 2021లో అన్నా డీఎంకేకు ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసి ఆపార్టీ 75 సీట్లను గెలుచుకోడానికి కారకుడయ్యాడు.
జోడో యాత్ర ఆయన సృష్టే
మొదట్లో మెకెన్సీ సంస్థలో టాప్ పొజిషన్ లో పనిచేసిన సునీల్ గత ఏడాది కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్తగా గత ఏడాది బాధ్యతలు తీసుకున్నారు. కర్ణాటకలో పార్టీని గెలిపించారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ రాహుల్ గాంధీ పాదయాత్ర భారత్ జోడో యాత్రను డిజైన్ చేసినది కూడా ఈ వ్యూహకర్తే.. మొదట్లో ప్రశాంత్ కిషోర్ తో కలసి పనిచేసిన సునీల్ ఆ తర్వాత అతని నుంచి విడిపోయి సొంతంగా సంస్థను పెట్టుకున్నాడు. అప్పటినుంచి రాజకీయ పార్టీలకు గెలుపు వ్యూహకర్తగా పనిచేస్తున్నారు.