KCR
అధికారాంతమునన్ చూడవలెన్ ఆ అయ్య సౌభాగ్యముల్ అంటారు.. పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా తెలంగాణపై తిరుగులేని పెత్తనాన్ని వెలగబెట్టిన కేసీఆర్ నిన్నటి ఎన్నికతో మాజీ సీఎం అయిపోయారు. తెలంగాణ ఆత్మ గౌరవ ప్రతీక గా నిలబడిన బీఆర్ ఎస్ పార్టీ చివరకు కుటుంబ పాలన, అవినీతి, ఆశ్రి తపక్ష పాతం ఆరోపణలతో ఎన్నికల్లో ఓడిపోయింది. స్వయంగా రెండు చోట్ల పోటీ చేసిన కేసీఆర్ చావుతప్పి కన్ను లొట్ట పోయిన చందంగా గజ్వేల్ లో గెలిచారు.. కామారెడ్డిలో ఘోరంగా ఓడిపోయారు.
కేసీఆర్ లాంటి వ్యక్తికి అది ఘోరమైన ఓటమి కిందే లెక్క.. కామారెడ్డిలో రేవంత్, కేసీఆర్ కొదమ సింహాల్లా ఢీకొంటే అక్కడ బీజేపి అభ్యర్ధి వెంకట రమణా రెడ్డి గెలిచాడు. ఇది కేసీఆర్ కు అవమానకరమే.. కామారెడ్డిలో కూడా మొదట రేవంత్ గెలుస్తాడని అనుకున్నారు. అయితే బీజేపి అభ్యర్ధి గెలిచి కేసీఆర్ అతి కష్టం మీద రెండో స్థానాన్ని నిలబెట్టుకున్నారు. రేవంత్ మూడో స్థానానికి పరిమితమయ్యారు.
ఆయన రూటే సెపరేట్
అయితే ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది కేసీఆర్ నైజం గురించి. ఎలాగోలా గెలిచేస్తామనుకున్న కేసీఆర్ కుటుంబానికి ఈ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అందుకే ఫలితాలు వచ్చిన వెంటనే కేసీఆర్ రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడి వరకూ బానే ఉంది. కాని ప్రభుత్వాల దగ్గర ఒక సంప్రదాయం ఉంటుంది. గవర్నర్ కు స్వయంగా ముఖ్యమంత్రి వెళ్లి రాజీనామా సమర్పించడం, కొత్త ప్రభుత్వ ఏర్పాటు వరకూ గవర్నర్ ఆయన్ను ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగమనడం ఏళ్ల తరబడి వస్తున్న సంప్రదాయం.. అయితే కేసీఆర్ తన రూటే సెపరేట్ అన్నట్లు ఉంటారు కాబట్టి.. తన రాజీనామాను ఓఎస్డీతో పంపించారు. ప్రభుత్వ కార్లను సైతం వినియోగించుకోలేదు.
భద్రతా కాన్వాయ్ ను సైతం వదిలేశారు. తన ప్రైవేట్ వాహనంలో ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు వెళ్లిపోయారు. అప్పటికప్పుడు ప్రగతి భవన్ ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఓడిపోయినా కేసీఆర్ లో గర్వం, పొగరు, అహంకారం తగ్గలేదని ఈ తీరు చూసిన వారు కామెంట్ చేస్తున్నారు. ప్రజలిచ్చిన తీర్పును శిరసా వహిస్తామనిగానీ, 39 సీట్లిచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలియ చేయడం కానీ ఏమీ లేదు.. అసలు మీడియా ముందుకే కేసీఆర్ రాలేదు. తన ముఖం చూపించలేదు.. కేటీఆరే వచ్చి చాలా బాలెన్స్ డ్ గా, పాజిటివ్ గా మాట్లాడారు.
రెండేళ్ల నుంచి తగ్గిన తీరు KCR
అసలు గత రెండేళ్ల నుంచి కేసీఆర్ తీరులోనే మార్పు వచ్చింది. మోడీపై తాడెత్తున మండిపడే తీరు కు భిన్నంగా కామెంట్ చేసేందుకు కూడా భయపడుతున్నారు. కుమార్తె కవిత మద్యం స్కామ్ లో చిక్కుకున్నాక ఆయన బాగా వెనక్కి తగ్గిపోయారు. రాజకీయంగా ఏ అడుగు వేయాలన్నా.. ఇవన్నీ ప్రతిబంధకాలుగా మారాయి. అవినీతి ఆరోపణలు, కుటుంబ పాలన ఈ రెండు అంశాలు కేసీఆర్ ఇమేజ్ ను దారుణంగా దెబ్బతీశాయి. ప్రాంతీయ పార్టీని తలా తోకా లేని జాతీయ పార్టీగా మార్చడం వరకూ అడుగడుగునా కేసీఆర్ వి తప్పటడుగులుగానే కనిపిస్తున్నాయ్.
నాలుగు గోడల మధ్య బందీ KCR
ప్రజలతో ఇంటరాక్ట్ కాకపోవడం, వాళ్లకేం కావాలో తెలుసుకోకపోవడం, చివరకు స్కీములు , పథకాల విషయంలోకూడా తనకు తోచినది, తాను అనుకున్నదే ప్రకటించడం, ప్రజలు వాటితో సర్దుకుపోవాలనడం … ఇలా వన్ సైడ్ కమ్యూనికేషన్ నడుస్తోంది. తెలంగాణ తెచ్చానన్న ధీమా కావచ్చు.. తెలంగాణ జాతిపిత అన్న గుర్తింపు కావొచ్చు.. తాను చేసినదే పరిపాలన అన్నట్లుగా మారిపోయింది ఆయన తీరు.. ప్రజలలో తిరగడం, బహిరంగ సభల్లో పాల్గొనడం లాంటి కార్యక్రమాలకు ఆయన దూరం.. ప్రగతి భవన్ దాటి అడుగు ముందుకు వేసినది లేదు.. అయితే ఫామ్ హౌస్.. లేదంటే ప్రగతి భవన్.. ఇలా నాలుగు గోడలకే ఆయన పరిమితమైపోయారు. దాంతో అహంకారం పెరిగింది.
ప్రతిపక్షాలను చీల్చడం, ఆ పార్టీ నేతలకు పదవుల పందేరం చేసి తన పార్టీలో చేర్చుకుని, విపక్షం ఉనికి లేకుండా చేయడం.. ఇలా రాజకీయంగా అరాచకం సృష్టించిన చరిత్ర ఆయనది. తాను చేస్తే రాజకీయం.. ఎదుటి వారు చేస్తే ఘోర అపరాథం అన్న తీరుగా కేసీఆర్ వ్యవహార శైలి మారిపోయింది. రాష్ట్రం వచ్చిన మొదట్లో అయితే ప్రజలు నమ్మే వారేమోగానీ.. పదేళ్ల తర్వాత ఈ అహంకారం మరింత ముదురుతోందే తప్ప పార్టీ ధోరణిలో మార్పు లేకపోవడం.. ప్రభుత్వ వ్యతిరేకతకు దారితీశాయి.చివరికి తెలంగాణ గడ్డపై కేసీఆర్ అనే మహావృక్షం రాజకీయంగా కూలిపోయింది.
ఇంత జరిగినా ఆయన ధోరణిలో మార్పు లేదని ఆయన అధికార నివాసాన్ని ఖాళీ చేసిన తీరే చెబుతోంది.. తన రాజకీయ ప్రత్యర్ధి రేవంత్ సీఎం సీటులో కూర్చుని అసెంబ్లీలో ప్రతిపక్షంలో తాను కూర్చోవల్సి రావడం కేసీఆర్ లాంటి వ్యక్తి మెంటాలిటీకి అస్సలు సరిపడదు. అందుకే కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయ్..దటీజ్ కేసీఆర్ దొర..