తెలంగాణ ముఖ్యమంత్రిగా అనుముల రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ హై కమాండ్ లైన్ క్లియర్ చేసేసింది. వాస్తవానికి ఎన్నికలైన మరుసటి రోజే సీఎం ప్రమాణం ఉంటుందని అంతా అనుకున్నారు. హడావుడి కూడా అలానే కనిపించింది. కానీ ఎక్కడా లేని, కాంగ్రెస్ లో మాత్రమే ఉండే భావ ప్రకటన స్వేచ్ఛ సహజంగానే ఏకగ్రీవ ఎంపికకు అడ్డు పడింది. నిన్న, మొన్న వేరే పార్టీనుంచి వచ్చిన వాడు ఇవాళ పార్టీ పగ్గాలు చేపడితే సహించాం.. ఇప్పుడు సీఎం కూడా అయితే మా పరువేంగానూ.. ఆయన కింద మేం ఎలా పనిచేస్తాం అంటూ అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇటు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి లాంటి వాళ్లు వ్యతిరేక గళం వినిపిస్తున్నారు.
అంతా పద్ధతి ప్రకారమే…
మరో వైపు ఊళ్లనుంచి హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్ కు చేరుకోవాల్సిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆ రాత్రికి చేరుకోలేకపోవడంతో మీటింగ్ మరుసటి రోజుకి అంటే నిన్న ఉదయానికి వాయిదా పడింది. ఉదయం తర్వాత జరిగిన మీటింగ్ లో సీఎం ఎంపిక అధికారాన్ని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు అప్పచెబుతూ పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ ఏక వాక్య తీర్మానం చేయడం, ఆతర్వాత ఉత్తమ్, భట్టి, లాంటి నేతలు స్వయంగా డీకే శివ కుమార్ ను కలసి తమ అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో సీఎం అభ్యర్ధి ఎన్నిక ప్రోసెస్ డిలే అయిపోయింది.
కాంగ్రెస్ సంప్రదాయం ప్రకారం ఢిల్లీకి వెళ్లిన ఏకవాక్య తీర్మానం సీల్డ్ కవర్ ను ఏఐసీసీ అధ్యక్షుల వారు పరిశీలించి, సోనియా, రాహుల్,, కేసీ వేణుగోపాల్ లాంటి కీలక నేతలను సంప్రదించి సీఎం పేరును బాహాటంగా ప్రకటిస్తారు. కాంగ్రెస్ రాజ్యాంగం ప్రకారం ఇది జరగాల్సిన ప్రోసెస్.. ఈ ప్రోసెస్ లో భాగంగానే రేవంత్ ఎన్నిక వాయిదా పడిందన్నది ఒక టాక్. అదీకాక ప్రతీ ఎమ్మెల్యేను వ్యక్తిగతంగా కలసి వారి అభిప్రాయాన్ని రికార్డు చేసి ఉంచుతారని, ఈ అభిప్రాయాల ప్రాతిపదికనే సీఎం అభ్యర్ధి ఎంపిక ఉంటుందని, కాంగ్రెస్ లో అంతా పద్ధతి ప్రకారం జరుగుతుందని ఆ పార్టీ నేతలు చెప్పుకొస్తున్నారు.
భట్టి, ఉత్తమ్ ససేమిరా
సీఎం పదవి ఆశించి భంగపడిన భట్టి, ఉత్తమ్ రేవంత్ సారధ్యంలో పనిచేయడానికి ససేమిరా అంటున్నారు. కాంగ్రెస్ అందరి అభిప్రాయాలకు విలువ ఇస్తుంది కాబట్టి డీ.కె. శివకుమార్, మాణిక్ రావు ఠాక్రే లాంటి నేతలు నచ్చ చెప్పినా సమస్య సద్దుమణగకపోవడం, వీరి అభిప్రాయాలను పార్టీ హై కమాండ్ కు నివేదించడంతో హై కమాండ్ రంగంలోకి దిగింది. భట్టి, ఉత్తమ్ లను ఢిల్లీకి పిలిచింది. వారితో విడి విడిగా సమావేశమై వారి అభ్యంతరాలను, కోరికలను తెలుసుకుంటుంది. భట్టి విక్రమార్క సీఎం పదవి ఆశించారు. కాదూ కూడదంటే తనకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చిన పక్షంలో ఏదైనా కీలక శాఖకు మంత్రిని చేయాలని ఆయన పట్టుబడుతున్నారు. అంతేకాదు మరెవరికీ డిప్యూటీ సీఎం పోస్ట్ ఇవ్వరాదన్నది ఆయన కండిషన్.. అలా ఇస్తే ఇక తనకూ , మిగతా వాళ్లకూ తేడా లేకుండా పోతుందన్నది అతగాడి ఆవేదన. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి కి కూడా సీఎం కావాలనే ఉంది.
కానీ రేవంత్ ను దాటి తనను సీఎంను చేయడం కష్టం అనుకుంటే… తన భార్యకు కీలక మంత్రి పదవి కావాలని ఆయన పట్టుబడుతున్నారు. రేవంత్ కేబినెట్ లో తాను మంత్రిగా చేరడం చిన్న చూపుగా భావిస్తున్నారాయన. తాను మొదట్నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని, తన సీనియారిటీ, హోదా, ఇలా రకరకాల కారణాలు చెబుతున్నారు ఉత్తమ్. సో ఉత్తమ్ ను సీఎంను చేయని పక్షంలో ఆయన భార్య పద్మావతికి కీలక మంత్రి పదవి కావాలట. వీటితో పాటు, ఎస్టీ, ఎస్సీ, బీసీ సామాజిక సమీకరణల ఆధారంగా మంత్రిపదవులు, డిప్యూటీ సీఎం పదవుల కేటాయింపు జరగాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి మేజిక్ ఫిగర్ కన్నా ఓ మూడు స్థానాలు అధికంగా వచ్చాయి . అంతే తప్ప భారీ మెజారిటీ రాలేదు.. ఎప్పుడైనా ప్రభుత్వం కూలే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి హై కమాండ్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది.
కాంగ్రెస్ లో మాత్రమే సాధ్యం
మూడు రాష్ట్రాల్లో ఘోరంగా ఓడిన విషాదంలో ఉన్న కాంగ్రెస్ హై కమాండ్ కు గెలిచిన ఒకే ఒక్క రాష్ట్రంలో ఇన్ని తలనొప్పులు.. కాంగ్రెస్ లో ఉన్న భావ ప్రకటనా స్వేచ్ఛ పార్టీకి ప్రతిబంధకంగా మారుతోందేమో అనిపిస్తుంది ఒక్కోసారి.. కానీ ఆ పార్టీలో ఎంత స్వేచ్ఛ లేకపోతే పక్క పార్టీనుంచి కాంగ్రెస్ లోకి వచ్చి ఐదేళ్లలోనే రేవంత్ లాంటి నేత సీఎం కాగలిగాడు? సమర్ధతకు, సత్తాకు పెద్ద పీట వేస్తారన్నది ఈ ఒక్క ఇన్సిడెంట్ చూస్తే అర్ధమవుతుంది. ఇవాళ భట్టి, ఉత్తమ్ ల బుజ్జగింపు కార్యక్రమం, పదవుల పందేరం కార్యక్రమం ఒక కొలిక్కి వస్తే రేపు ప్రమాణ స్వీకారాలు, మంత్రి వర్గ కేటాయింపులు ఉండొచ్చు.. పదేళ్ల బీఆర్ ఎస్ ప్రభుత్వ పాలన తర్వాత తొలిసారి కాంగ్రెస్ పాలన ఎలా ఉంటుందో వేచి చూద్దాం…