Congress
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరుతున్న వేళ ఆ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో ఇప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారుతోంది. ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చారంటూ అటు ఇతర పార్టీలు, ఇటు విశ్లేషకులు కూడా పెదవి విరుస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆరు వాగ్దానాలను పక్కా అమలు చేసి తీరతాం..మీరే చూస్తారంటూ ధీమా వ్యక్తం చేస్తోంది.
రైతులు, మహిళలు, నిరుద్యోగులను అడ్రస్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఈసారి మేనిఫెస్టోను రూపొందించింది కేసీఆర్ పాలనలో ఈ మూడు వర్గాలు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయి. సెక్రటేరియట్ నిర్మాణం, అమరవీరుల జ్నాపక చిహ్నాల నిర్మాణం, కాళేశ్వరం నిర్మాణం, హైదరాబాద్ లో ఫ్లయ్ ఓవర్ల నిర్మాణం ఇలా నిర్మాణ రంగంలో తనదైన వేస్తూ లక్షల కోట్లు ఖర్చు చేసి పదికాలాల పాటు తన పేరు నిలబడిపోయేలా కేసీఆర్ అద్భుత నిర్మాణాలు చేశారు. ఇవి చరిత్ర ఉన్నంత కాలం నిలిచిపోతాయి. అయితే రైతులు, మహిళలు, నిరుద్యోగులను బీఆర్ ఎస్ పార్టీ తీవ్రంగా నిర్లక్ష్యం చేసింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల స్ట్రాటజిస్ట్ ఈ రంగాలను ఒడిసి పట్టుకుని ప్రజారంజకంగా మేనిఫెస్టో రూపకల్పన చేశారు.
కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు Congress
స్థూలంగా చెప్పాలంటే కాంగ్రెస్ మహిళల కోసం మహాలక్ష్మీ స్కీమ్ ప్రకటించింది. దీని ప్రకారం మహిళలకు ప్రతీనెలా రెండు వేల సాయం అందిస్తారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణం, రూ.500 లకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని ప్రకటించారు.
అలాగే రైతుల కోసం రైతు భరోసా ప్రకటించారు. దీని ప్రకారం కౌలు రైతులకు ఏటా రూ.15 వేల పంట పెట్టుబడి సాయం. వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి రూ.12 వేల సాయం, వరిపంటకు ప్రతీ క్వింటాల్ కు రూ500 బోనస్ గా ప్రకటించారు.
ఇక గృ హజ్యోతి పథకం కింద ప్రతీ కుటుంబానికి రెండు వందల యూనిట్ల వరకూ ఉచిత కరెంటు ఇస్తామన్నారు.
ఇక ఇళ్లు లేని వారికి ఇంటి స్థలంలో నిర్మాణానికి ఐదు లక్షల రూపాయల ఆర్థికసాయం, ఉద్యమ కారుల కుటుంబాలకు 250 చదరపు గజాల స్థలం కేటాయిస్తామన్నారు.
విద్యార్ధుల కోసం ఐదు లక్షల రూపాయల విలువచేసే విద్యా భరోసా కార్డు, ప్రతీ మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటును ప్రకటించారు. నిరుద్యోగుల కోసం గ్రూపు పరీక్షలను నిర్వహించడం, 13 విభాగాల్లో ఖాళీలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. చేయూత పథకం కింద నెలకు 4వేల రూపాయల చొప్పున పింఛను, రూ. పది లక్షల వరకూ రాజీవ్ ఆరోగ్య శ్రీ బీమా అందిస్తామన్నారు.
ఈ వాగ్దానాలన్నీ ఆచరణ సాధ్యమేనా అని విశ్లేషకులు నోరు వెళ్ల బెడుతుంటే పక్కాగా చేస్తాం అంటోంది కాంగ్రెస్ పార్టీ. అసలు తామీ వాగ్దానాలన్నీ ప్రభుత్వ బడ్జెట్, ఆదాయ , వ్యయాలు, అప్పులను స్టడీ చేశాకే గ్యారంటీలను రచించామంటున్నారు పీసీసీ చీఫ్ రేవంత్.
రాష్ట్ర ఖజానా ప్రస్తుత పరిస్థితి
రాష్ట్ర బడ్జెట్ లో ఐదు లక్షల కోట్లకు పైగా అప్పులున్నాయి. ఏటా 15 నుంచి20 వేల కోట్ల ఆర్థిక లోటు ఉంది. చేసిన అప్పులకు వడ్డీల కింద నెల నెలా వేల కోట్లు వడ్డీ కింద ప్రభుత్వం కడుతోంది. సంక్షేమానికి అయ్యే ఖర్చు లక్ష కోట్లు, పంచాయతీలు, మౌలికం, ఆరోగ్య రంగానికి ప్రాధాన్యత ఇచ్చి తీరాలి. 200 యూనిట్లు దాటితే చార్జీలు రెట్టింపు అవుతాయా అనే భయం వినియోగ దారుల్లో ఉంది.మరి ఈ సందేహాలకు ప్రభుత్వమే సరైన పాలనతో సమాధానం చెప్పాలి.
కాంగ్రెస్ తీరు మారిందా? Congress
గతంతో పోలిస్తే నిజానికి కాంగ్రెస్ కొంత తీరు మార్చుకున్నట్లే కనిపిస్తోంది. సీఎం పదవి కోసం వీధులకెక్కి కొట్టుకోవడం, బలప్రదర్శనలు, క్యాంపు రాజకీయాలకు ఈసారి తెర తీయలేదు. అభ్యంతరాలను హై కమాండ్ కు చెప్పుకోవడం వరకూ సీనియర్లు కంట్రోల్ లోనే ఉన్నారు. పార్టీ నేతల్లో కొంత వరకూ డిసిప్లీన్ వచ్చినట్లే. కానీ ఈ నిలకడ ఐదేళ్ల పాటూ కొనసాగాలి. కేసీఆర్ లాగా అహంకారానికి పోకుండా , అణచివేత ధోరణికి పాల్పడకుండా రేవంత్ పాలన సాగించాలి.
అలాగే పొరుగున ఉన్న ఏపీతో సత్సంబంధాలను నెలకొల్పుకోవడం, ఉమ్మడి సమస్యల పరిష్కారానికి పెద్ద మనసుతో చొరవ చూపడం, సహనంతో వ్యవహరించడం లాంటివి చేయాలి. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీయే ఉంది కాబట్టి కావేరి నదీ జలాల సమస్య సానుకూలంగా పరిష్కారం అవుతుందా? ఏపీతో కృష్ణా నదీ జలాల విషయంలో ఏపీకి మోకరిల్లారంటూ కేసీఆర్ పై విమర్శలు చేసిన రేవంత్ రేపు తానెలా వ్యవహరిస్తారు? వీటన్నింటికి త్వరలోనే సమాధానం దొరుకుతుందేమో.