Nari Shakti
బిజినెస్ మ్యాగజైన్ ఫోర్బ్స్ లో అత్యంత శక్తిమంతమైన మహిళల జాబితాలో భారత్ నుంచి ఏకంగా నలుగురు మహిళలకు అవకాశం దక్కింది.వారి హోదా, ర్యాంకు, సంపాదించిన ఆస్తులు, మీడియాలో పలుకుబడి, వారు సమాజంపై చూపిన ప్రభావం అనే నాలుగు కొలమానాల ఆధారంగా ఫోర్బ్స్ ఈ జాబితా రూపొందించింది.2023 నాటి ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాను ఈ మ్యాగజైన్ తయారు చేసింది. ఈనలుగురు మహిళలు ఆంక్షల అద్దాల మేడలను ఛేదించుకుని, బయటకొచ్చి ప్రపంచ యవనికపై వారి గళాలను ప్రస్ఫుటంగా వినిపించిన వారే.. ఆ నలుగురు భారత దేశానికి చెందిన వారు కావడం మనకు గర్వకారణం. నాయకత్వ లక్షణాలకు, ప్రతిభకు, ఓర్పుకు, మేథాశక్తికి ఈనలుగురు శక్తివంతమైన మహిళలు ప్రతినిధులుగా నిలబడ్డారని ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రశంసించింది.
నిర్మలా సీతారామన్ (32వ ర్యాంకు) Nari Shakti
భారత ఆర్థిక మంత్రి 64 ఏళ్ల నిర్మలా సీతారామన్ బీజేపికి చెందిన వారు.. 2019 నుంచి ఆర్థిక శాఖ, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిగా ఆమె సేవలందిస్తున్నారు. 2017 -2019 మధ్య కాలంలో దేశానికి 28వ రక్షణ మంత్రిగా ఆమె వ్యవహరించారు. ఇందిరాగాంధీ తర్వాత మన దేశంలో ఆర్థిక, రక్షణ శాఖలను నిర్వహించిన రెండో మహిళా మంత్రి నిర్మలే. 2022లో ఫోర్బ్స్ ఆమెకు36వ ర్యాంకు ఇవ్వగా ఈ ఏడాది ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మహిళగా 32వ ర్యాంకును ఆమె సాధించారు.
రోషిణీ నాడార్ మల్హోత్రా (60వ ర్యాంకు) Nari Shakti
రోషిణీ నాడార్ మల్హోత్రా భారత దేశ స్వచ్ఛంద విరాళ దాతల్లో ఒకరు. 42 ఏళ్ల రోషిణి కోటీశ్వరురాలు. హెచ్ సీఎల్ టెక్నాలజీస్ సంస్థ ఛైర్ పర్సన్ గా సేవలందిస్తున్న రోషిణి మనదేశంలో లిస్టెడ్ ఐటీ కంపెనీకి నేతృత్వం వహిస్తున్న తొలి మహిళ కూడా. శివనాడర్ ముద్దుల పట్టి , ఏకైక కుమార్తె అయిన రోషిణీ దేశంలో గుర్తింపు పొందిన కోటీశ్వరురాలు. ఇండియాస్ రిచ్ లిస్ట్ లో ఆమె పేరు నమోదైంది. ఫోర్బ్స్ మ్యాగజైన్ లో 2019 నుంచి వరుసగా అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో చోటు దక్కించుకున్నారీమె.2019లో 54వ ర్యాంకు కాగా,2020లో 55వ ర్యాంకు, 2023లో 60వ ర్యాంకు పొందిన మహిళగా గుర్తింపు పొందారు.
సోమా మండల్ (70వ ర్యాంకు) Nari Shakti
స్టీల్ అథార్టీ ఆఫ్ ఇండియా ఛైర్ పర్స్ గా కొనసాగుతున్న సోమా మండల్ కు 60 ఏళ్లు.2021 తర్వాత ఈ పదవిని చేపట్టిన తొలి మహిళ ఈమే కావడం గమనార్హం.భువనేశ్వర్ లో పుట్టిన సోమా 1984లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో గ్రాడ్యుయేషన్ చేశారు. మెటల్ ఇండస్ట్రీలో 35 ఏళ్ల అనుభవం గడించిన ఈ మహిళ నాల్కోలో తొలుత ఉద్యోగంలో చేరి అదే కంపెనీ డైరక్టర్ గా మారారు.
2017కల్లా సెయిల్ డైరక్టర్ అయిపోయారు సోమా. సెయిల్ ఛైర్మన్, మహిళా డైరక్టర్ గా ఆమె రికార్డులకెక్కారు. దీనితో పాటు స్కోప్ అనే సంస్థ కు ఛైర్ పర్సన్ గా కూడా వ్యవహరిస్తున్నారు సోమా మండల్.2023 ఎకనామిక్ టైమ్స్ ప్రైమ్ విమెన్ లీడర్ షిప్ అవార్డుకు సోమా ఎంపికయ్యారు. ఆ తర్వాతే ఆమె కంపెనీ సీఈఓగా పదోన్నతి పొందారు. ఫోర్బ్స్ లో ఆమె ర్యాంకు 70వ ర్యాంకు…
కిరణ్ ముజుందార్–షా (76వ ర్యాంకు)
కిరణ్ ముజుందార్ షా కోటీశ్వరురాలు, వాణిజ్య వేత్త కూడా. బయోకాన్ లిమిటెడ్ అనే సంస్థను స్థాపించారు. బెంగళూరులో బైకాన్, బయోలాజిక్స్ లిమిటెడ్ సంస్థను ఏర్పరచారు. బయోటెక్నాలజీ కంపెనీల ఏర్పాటు, నిర్వహణలో కీలక పాత్ర పోషించిన ఆమె బెంగళూరు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ ఛైర్ పర్సన్ గా కూడా వ్యవహరించారు. ముజుందార్ షా అనేక అవార్డులు, రివార్డులను సాధించారు.
2014లో సైన్స్, రసాయన శాస్త్ర రంగానికి చేసిన సేవలకు ఆమెను ఓథ్మర్ గోల్డెన్ మెడల్ వరించింది.2011 ఫైనాన్షియల్ టైమ్స్ బిజినెస్ లిస్ట్ లో టాప్ 50లలో చోటు సంపాదించారు.2019,2020లో ఫోర్బ్స్ సంస్థ ఆమెను 86వ శక్తివంతమైన మహిళగా గుర్తించింది.2023 ఫోర్బ్స్ శక్తివంతమైన మహిళల జాబితాలో 76వ ర్యాంకు సాధించారు కిరణ్ ముజుందార్.
ఒకేసారి నలుగురు భారతీయ మహిళలు శక్తికి ప్రతీకలుగా ప్రపంచం దృష్టిని ఆకర్షించడం హర్షణీయం.