Revanth Reddy
పట్టుదల, సాధించాలన్న కోరిక బలంగా ఉండాలేకానీ మనిషి అనుకున్నది ఏదైనా సాధించగలడు అనడానికి తెలంగాణ కొత్త సీఎం రేవంత్ రెడ్డి గొప్ప ఉదాహరణ. రాజకీయాలలో స్వయంగా ఎదగడం కాస్త కష్టం..ఎవరో ఓ నేత అండ లేనిదే చక్రం తిప్పడం అసాధ్యం.. కానీ కొందరు నేతలుంటారు. వారు స్వయంగా ఎవరి అండా లేకుండా గాడ్ ఫాదర్లు లేకుండా రాణించగలరు..అలాంటి స్వయం నిర్మిత నేతలలో రేవంత్ ఒకరు.
విద్యార్ధి దశనుంచి ఆయన ఎదుగుదలే కాస్త విచిత్రంగా అనిపిస్తుంది. నాగర్ కర్నూల్ జిల్లా, వంగూరు మండలం,కొండారెడ్డి పల్లి అనే మారుమూల పల్లెటూరిలో పుట్టి ఈరోజు రాష్ట్ర సీఎంగా అంచెలంచెలుగా, అతి తక్కువ టైమ్ లోనే ఎదిగిన నేత రేవంత్..అందునా చుట్టూ శత్రువులు తోడేళ్లలా వెనక్కి లాగే కాంగ్రెస్ పార్టీలో వారందరినీ నిలువరించి ముందుకు సాగి అనుకున్నది సాధించడం అనేది చిన్న విషయం కాదు.
మెరుపువేగం Revanth Reddy
రేవంత్ చురుకైన వ్యక్తి.. మెరుపు వేగంతో కదులుతారు. మనిషి చూడటానికి చాలా బలహీనంగా, రివటలా ఉంటారు. ఆజాను బాహుడు అసలే కాదు.. కానీ చిచ్చర పిడుగులా ఆయన శరీర కదలికలు వేగంగా ఉంటాయి. హుషారుగా, వేగంగా నడుస్తారు. మాట మాట్లాడారంటే తూటాల్లా పేలతాయి. సూటిగా సుత్తి లేకుండా కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడతారు. ఒకరకమైన తెలంగాణ యాస ఆయన స్పెషాలిటీ. సవాళ్లు లేనిదే ఆయన ప్రసంగాలే ఉండవు.. ప్రతీ అంశంపైనా నాలెడ్జి పెంచుకోవడం, పట్టుదలతో సబ్జెక్ట్ ను అవగాహన చేసుకోవడం ఆయన ప్రత్యేకతలు…
చాలా వేగంగా ఎదిగిన కెరీర్ Revanth Reddy
విద్యార్ధి దశలో ఏబీవీపిలో చేరినా ఆ తర్వాత 2006లో జడ్పీటీసీ సభ్యుడిగా ఎవరి అండా లేకుండా సొంతంగా గెలిచారు. ఆ తర్వాత స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించారు. రేవంత్ చురుకుతనం చూసి చంద్రబాబు ఆయన్ను టీడీపీలో చేర్చుకుని కొడంగల్ టిక్కెట్ ఇచ్చారు. అప్పటినుంచి రెండు సార్లు టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచి టీడీపీ శాసన సభాపక్ష నేతగా కూడా కొనసాగారు.
ఆ తర్వాత ఓటుకు నోటు కేసు ఆయన కెరీర్ ను డిస్ట్రబ్ చేసినా, అంతిమంగా ఆయన కెరీర్ పై ఎఫెక్ట్ మాత్రం పడలేదు.2017లో కాంగ్రెస్ లో చేరి కొడంగల్ నుంచి పోటీ చేశారు.అప్పట్లో మాజీ మంత్రి హరీష్ రావు, బీఆర్ ఎస్ నేతలు బరిగీసి కార్నర్ చేసి ఓడించడంతో స్వల్ప మార్జిన్లో ఓడిపోయారు. 2018లో టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకుని 2019లో మల్కాజ్ గిరి లోక్ సభనుంచి ఎంపీగా గెలిచారు. రేవంత్ దూకుడు, వ్యవహార శైలి చూసిన రాహుల్ ఆయన్ను 2021 లో పీసీసీ అధ్యక్షుడిగా నియమించారు.
శత్రువులను సైతం కలుపుకు పోయిన తీరు
మొదట్లో కాంగ్రెస్ సీనియర్లెవరూ రేవంత్ కు సహకరించలేదు. అయినా లెక్క చేయకుండా తన ఈగోను పక్కన పెట్టి తనను వ్యతిరేకించిన ప్రతీ నేత ఇంటికీ వెళ్లి మరీ కలసి నడుద్దామని రిక్వెస్ట్ చేసిన ఘనత రేవంత్ దే.. చాలా మంది సీనియర్లు రేవంత్ తో చేతులు కలపడానికి కూడా ఇష్టపడలేదు. కాంగ్రెస్ లో ఇప్పటికీ సీనియర్లకు ఆయనపై తీవ్రమైన వ్యతిరేకత ఉంది. కానీ పార్టీ గెలుపు బాధ్యతలు భుజాన వేసుకుని రాత్రి, పగలు లేకుండా కష్టపడ్డారు.
పార్టీకి జవ జీవాలు కల్పించిన ఘనత Revanth Reddy
లంగాణలో స్తబ్దుగా పడి ఉన్న పార్టీకి జవ జీవాలు కల్పించారు. నిరంతరం పాదయాత్రలు, పల్లెనిద్రలు చేయడం ద్వారా పార్టీపై ప్రజల్లో కాస్త పాజిటివ్ ధృక్పధం తీసుకొచ్చారు. రైతు, యువత, మహిళా, దళిత, నిరుద్యోగ విభాగాలుగా డిక్లరేషన్లు రూపొందించి మీటింగులు పెట్టి కాంగ్రెస్ అంటే ఓ భరోసాను కల్పించారు. రేవంత్ బాధ్యతలు స్వీకరించాకే కాంగ్రెస్ జెండా ఊరు, వాడా రెప రెపలాడటం మొదలు పెట్టింది. తరచుగా సమావేశాలు, బహిరంగ సభలతో హడావుడి చేశారు. ఇక ఎన్నికల టైమ్ లో అయితే కాలికి బలపం కట్టుకు తిరిగారు.
కామారెడ్డి లాంటి నాన్ లోకల్ బరిలో కూడా మొదట్లో సీఎం కేసీఆర్ ను ఎదుర్కొని టఫ్ ఫైట్ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార బాధ్యతలను నెత్తికెత్తుకుని కొదమ సింహం లాంటి కేసీఆర్ ను కేటీఆర్ ను చాలా చాలా డైనమిక్ గా ఢీకొన్నారు. రేవంత్ లో ఈ దూకుడే రాహుల్,సోనియా, ప్రియాంకలకు నచ్చింది.
దాంతో ఆయన్నే సీఎం చేయాలని నిర్ణయించారు. ఉత్తమ్, భట్టి లాంటి సీనియర్లకు రేవంత్ నియామకంపై అభ్యంతరాలున్నా లెక్క చేయలేదు.. వారిని ఢిల్లీ పిలిచి మరీ సర్దిచెప్పి, బుజ్జగించింది అధిష్టానం. రేవంత్ కు ఫ్రీ హ్యాండ్ ఇస్తూ బాధ్యతలు అప్పగించింది. వైఎస్ మరణం తర్వాత తెలంగాణలో మట్టికొట్టుకుపోయిన కాంగ్రెస్ ను దుమ్ము దులిపి లేపి నిలబెట్టిన వ్యక్తి రేవంత్..కాంగ్రెస్ లాంటి జాతీయపార్టీకి రాష్ట్రంలో ఉన్న వాక్యూమ్ చూసి అది తనకు కలసి వచ్చే అంశమని గ్రహించి ఓ ట్రయల్ వేసి అనుకున్నది సాధించారు రేవంత్…