Revanth Reddy
తెలంగాణలో కాంగ్రెస్ జెండా రెపరెపలాడింది. పదేళ్ల తర్వాత కొలువుతీరిన కాంగ్రెస్ ప్రభుత్వం పాత సంప్రదాయాలను తెరపైకి తెచ్చింది. గులాబీ జెండాల రెపరెపల స్థానంలో మువ్వన్నెల జెండాలు కనిపించాయి. చాలా ఏళ్లుగా ఏదో పాత సినిమా చూసిన భావన కలిగంది. గతమైపోయిన జ్నాపకమేదో మళ్లీ కళ్లముందు కదలాడినట్లయ్యింది.రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారమహోత్సవం పాత సంప్రదాయాలన్నింటినీ గుర్తు చేసింది.
పదిహేనేళ్ల క్రితం వైఎస్ ప్రమాణ స్వీకార ఘట్టం కళ్ల ముందు కదిలింది. రేవంత్ కుటుంబం కూడా వైఎస్ కుటుంబం లాగే స్టేజీ ఎక్కి సందడి చేసింది. కానీ ఎల్బీ స్టేడియం పెద్దగా నిండలేదు.. ఈమధ్యకాలంలో ఆరోగ్యం బాగోక ఎక్కడకీ రాని సోనియా రేవంత్ ప్రమాణానికి మాత్రం ఓపిక చేసుకుని వచ్చారు. సోనియా కుటుంబం మొత్తం స్టేజీపై సందడి చేస్తూ కనిపించింది.
సోనియా గాంధీ,రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉపముఖ్యమంత్రి డి.కె. శివకుమార్, ఇంకా ఇతర సీనియర్ కాంగ్రెస్ నేతలు, మందీ మార్బలం పెద్ద సంఖ్యలో వేదిక పై ఆశీనులయ్యారు. రేవంత్ భార్య, కుమార్తె, అల్లుడు, మనుమడు, వియ్యంకుడు కూడా ముందు వరసలో కూర్చున్నారు. ప్రమాణానికి ముందు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రేవంత్, ప్రత్యేకంగా అలంకరించిన పూల రథంపై స్టేడియం అంతా కలియతిరిగి ప్రజలకు అభివాదం చేశారు. అనంతరం స్టేజీపైకి చేరుకున్నారు. రేవంత్ మనవడు రేయాన్ ను పలువురు నేతలు ముద్దు చేస్తూ కనిపించారు.
ఎనుముల రేవంత్ రెడ్డి అను నేను Revanth Reddy
రేవంత్ రెడ్డి చేత గవర్నర్ తమిళి సై ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం డిప్యూటీ సీఎంగా మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, రాజనరసింహా, కోమటిరెడ్డి, కొండాసురేఖ, సీతక్క, తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు. మళ్లీ ఇందిరమ్మ రాజ్య స్థాపన తెస్తానంటూ రేవంత్ పగ్గాలు చేపట్టారు. ప్రగతి భవన్ ముళ్ల కంచెలు బద్దలు కొట్టామని, దొరల పాలన కు గుడ్ బై చెప్పామన్నారు. దాని పేరు జ్యోతీరావు ఫూలే ప్రజాభవన్ గా పేరు మార్చినట్లు రేవంత్ ప్రకటించారు. తెలంగాణకు పట్టిన చీడ పోయిందనీ ప్రజలందరి బాధలు, ఆశలు,ఆశయాలన్నింటినీ పట్టించుకుని అడుగు ముందుకేస్తాననీ రేవంత్ ప్రమాణం చేశారు.
ఈ దూకుడు మంచిదేనా ?
రేపే ప్రజా దర్బార్ నిర్వహిస్తామని రేవంత్ వేదిక పైనుంచే ప్రకటించడం బాగున్నా.. మరీ ఎక్కువ ఎగ్జైట్ అవుతున్నారా అనిపిస్తోంది. ఎందుకంటే ప్రజా సమస్యలనేవి తేనెతుట్టలాంటివి.. సమస్యల పరిష్కారం ఒక వైపు నుంచి పద్ధతి ప్రకారం జరగాలి. కానీ రేవంత్ ప్రమాణం చేసిన వెంటనే ఇలాంటి ప్రకటనలు చేయడం సమస్యలను కొనితెచ్చుకోడమేననే భావన కలుగుతోంది. ఎందుకంటే నాయకుడు అంత స్పీడ్ గా కదలడం మొదలు పెడితే ప్రజల ఆలోచనలు, అంచనాలు కూడా వేగం పుంజుకుంటాయి. ప్రతీ ఒక్కరూ తమ సమస్య ముందు అంటే తమది ముందు అడ్రస్ చేయాలని ఆవేశపడతారు. ఫలితంగా త్వరగా వ్యతిరేకత వచ్చే ప్రమాదముంది.
ఆరు గ్యారంటీలు అమలయ్యేనా ? Revanth Reddy
తాను గతంలోనే చెప్పినట్లు కాంగ్రెస్ ఆరు గ్యారంటీలపై తొలి సంతకం చేశారు రేవంత్.. ఇక ప్రచార సమయంలో గాంధీ భవన్ కు వచ్చి కలసి ఉద్యోగం కోరుకున్న దివ్యాంగురాలు జ్యోతికి ప్రమాణ స్వీకార వేదికపైనే ఉద్యోగ పత్రంపై సంతకం చేశారు. పదేళ్ల బానిస పాలన అంతమైందని, దొరల పాలను స్వస్తి పలికామని అసలు సిసలైన ప్రజాపాలన మొదలైందనీ రేవంత్ ప్రకటించారు. కాంగ్రెస్ చెప్పిన ఆరు గ్యారంటీల అమలు కోసం యావత్ తెలంగాణ వేయి కళ్లతో ఎదురుచూస్తోంది. ఈ హమీలు అమలు జరగకపోతే మాత్రం రేవంత్ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందుల పాలు కాక తప్పదు.