Revanth
తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. ఏ ముఖ్యమంత్రి చేయనంత వేగంగా ఆయన నిర్ణయాలు తీసుకుంటున్నారు. బాధ్యతలు చేపట్టిన తొలిరోజు సాధారణంగా ఏ సీఎం అయినా రిలాక్స్ అవ్వాలనుకుంటారు. కొత్త మంత్రులతో పిచ్చాపాటీ మాట్లాడి వ్యవహార సరళిని గమనించి, గత ప్రభుత్వ నిర్ణయాలను సమీక్షించుకుని, ఆపై నెమ్మదిగా అడుగులు వేస్తారు. కానీ రేవంత్ వ్యవహార శైలి దీనికి భిన్నం.. నిన్న సీఎంగా ప్రమాణం చేయకుండానే రేవంత్ ప్రగతి భవన్ ముళ్ల కంచెలు తొలగించారు.
ప్రగతి భవన్ పేరును జ్యోతీ రావు ఫూలే ప్రజా భవన్ గా మార్చేశారు. ప్రమాణం చేసిన వెంటనే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలపై సంతకం చేశారు. అలాగే దివ్యాంగురాలు జ్యోతి ఉద్యోగ నియామక పత్రంపై సంతకం చేసి వేదిక మీదుగానే ఆమెకు అందించారు. ఆ తర్వాత ఇంటికెళ్లి రెస్ట్ తీసుకుంటారనుకున్న వారందరికీ షాక్ ఇస్తూ ఎల్బీ స్టేడియంలో స్ఫూర్తిమంతమైన ప్రసంగం చేశారు. ఆ తర్వాత సెక్రటేరియట్ కు వెళ్లారు. అక్కడ వేద మంత్రాల నడుమ పూజలు నిర్వహించి సీఎం కుర్చీలో కూర్చున్నారు.. ఆ తతంగం అయ్యాక పలువురు ఆయన్ను అభినందిస్తూ బొకేలు, శాలువలతో హడావుడి చేశారు.
నిన్ననే తొలి కేబినెట్ భేటీ
ఆ తర్వాత వెను వెంటనే తొలి కేబినెట్ మీటింగ్ ఏర్పాటు చేశారు. మంత్రులకు శాఖలు కేటాయించారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలు ఎలా అన్న అంశంపై సహచరులతో చర్చించారు. వాటిలో రెండు గ్యారంటీలను వెను వెంటనే అమలు చేయాలని ఆదేశించారు. అది మహిళలకు సిటీ బస్సుల్లో ఉచిత రవాణా అంశం.. మరొకటి రాజీవ్ ఆరోగ్య శ్రీ పరిమితి పెంపు.. ఈ రెండు తక్షణం అమల్లోకి వచ్చేలా ఆదేశాలు జారీ చేశారు. శనివారం నుంచి మహిళలంతా సిటీబస్సుల్లో ప్రయాణించవచ్చని, ఆధార్ చూపితే చాలని కొత్త ప్రభుత్వం స్పష్టం చేసింది.దీనివల్ల ప్రభుత్వంపై పడే భారాన్ని బేరీజు వేసుకుని పథకం అమలులో కొన్ని పరిమితులు భవిష్యత్తులో పెట్టనున్నారు.
విద్యుత్ లెక్కలు కాకి లెక్కలని ఆగ్రహం Revanth
అనంతరం కొత్త కేబినెట్ విద్యుత్ పంపిణీ అంశంపై సాధ్యాసాధ్యాలు చర్చించారు. ఆ సందర్భంగానే విద్యుత్ శాఖలో 85 వేల కోట్ల బకాయిలు ఉన్నాయని అధికారులు చెప్పడం రేవంత్ ను ఆశ్చర్యానికి గురిచేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కరెంట్ సంక్షోభం వస్తుందని ప్రచారం చేసేలా లెక్కలు చెబుతున్నారని మండిపడ్డారు. ముందు పాత లెక్కలు తీయండి… పాత ఎండీ ప్రభాకర రావుని మీటింగ్ కు పిలవండి.. లెక్కలన్నీ చెప్పించండి అంటూ హుకుం జారీ చేశారు. నిన్నటి కేబినెట్ లోనే రేపటి ప్రజా దర్బార్ పై స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేశారు. ఉదయం పది గంటల నుంచి ప్రజాదర్బార్ ఉంటుందని, ప్రజలంతా తమ ఫిర్యాదులు, ఇవ్వొచ్చనీ చెప్పారు.
ప్రజా భవన్ కు ప్రజల క్యూ Revanth
కొత్త ముఖ్యమంత్రి పిలుపు మేరకు ఇవాళ ఉదయం పది గంటలనుంచే ప్రజలు ప్రజాభవన్ కు క్యూ కట్టారు.. వ్యక్తిగత సమస్యల నుంచి , ఉద్యోగాల వరకూ, భూ సమస్యలనుంచి, ఆర్థిక సమస్యల వరకూ ప్రజలు తమ తమ గోడు వెళ్లబోసుకున్నారు. వచ్చినవారి సమస్యను టూకీగా విని అక్కడే డాటా ఎంట్రీ వ్యవస్థను ఏర్పాటు చేసి ఫిర్యాదులు తీసుకుని పరిష్కరించారు రేవంత్.. రేవంత్ వెంట పొంగులేటి శ్రీనివాస రెడ్డి కూడా ఈ ప్రజా దర్బార్ కు హాజరయ్యారు. మొత్తం మీద 24 గంటల్లోనూ తాను డైనమిక్ సీఎంననీ, తన పంథా వేరని రేవంత్ నిరూపించుకున్నారు. భవిష్యత్తులో కూడా రేవంత్ ఇదే తీరును, దూకుడును కొనసాగించగలరా లేదా అన్నది చూడాలి.