PSPK
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇమేజ్ రాను రాను పడిపోతోందా? నిన్నటి వైజాగ్ సభ చూశాక ఎవరికైనా కలిగే సందేహం ఇదే..విశాఖ ఎంవీపీ కాలనీ , ఏఎస్ రాజా గ్ర్రౌండ్స్ లో పవన్ సభ జనం లేక వెల వెలబోయింది. జనం రాక మూడు, నాలుగు గంటలు హోటల్ రూమ్ లోనే వెయిట్ చేయాల్సిన దౌర్భాగ్యకర పరిస్థితి ఏర్పడింది. అంత సేపు వెయిట్ చేసినా జనం రాకపోవడంతో చివరికి ఆ తక్కువ జనం మధ్యనే ప్రసంగించారు. యధాప్రకారం పవన్ ఆత్మస్తుతి, పరనిందకే ప్రాధాన్యం ఇచ్చారు. తానన్న వాడిని లేకపోతే ఉద్దానం సమస్య వెలికి రాదని, ఉత్తరాంధ్ర ప్రజలు ఆ మాత్రం చైతన్యవంతంగా లేకపోతే ఎలా అనీ కోపగించుకున్నారు.తన శక్తి మేరకు నడపగలిగినంత వరకూ ఒంటరి పోరాటం చేస్తూనే ఉంటానని అన్నారు.
తనకు సీఎం అవ్వాలని కోరికలేం లేవని అన్నారు. మిగతాదంతా ఎప్పుడూ మాట్లాడే సోదే.. అయితే ఇక్కడ విశేషంగా చెప్పుకోవాల్సింది పవన్ నిర్ణయం గురించి. జగన్ ను విమర్శించడం తగ్గించాలని పవన్ నిర్ణయించినట్లుగా నిన్నటి ఆయన స్పీచ్ చూస్తే తెలుస్తోంది. ఎక్కువగా ఉత్తరాంధ్ర ప్రజలను పవన్ నిన్న ఆడిపోసుకున్నారు. చైతన్యం లేదని, చురుకు తనం లేదని, సమాజం పట్ల బాధ్యత లేదని, ఇంత స్తబ్దుగా, ఇంత నిస్త్రాణంగా ఎలా ఉంటున్నారని ఫైర్ అయ్యారు.
స్టీల్ ప్లాంట్ సమస్యపై అందరూ కలసి వస్తే ఉద్యమించేందుకు ఢిల్లీ తీసుకు వెళ్లేందుకు తాను రెడీ అని ఏడాది క్రితం వారికి చెప్పానని, అయినా ఇప్పటి వరకూ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు కదిలినది లేదని విసుక్కున్నారు. ఉద్దానం సమస్య తాను లేవనెత్తితే తప్ప పరిష్కారం కాలేదన్నారు. ఇలా పవన్ తన ఫోకస్ ను జగన్ పై నుంచి ఈసారి ప్రజలపైకి మళ్లించారు.అయితే ప్రజలనూ ఆయన ఆడిపోసుకున్నారు. చైతన్యం కలిగి సమాజం పట్ల బాధ్యతగా ఉండాలని పిలుపునిచ్చారు.
పవన్ వి నిలకడ లేని రాజకీయాలు.
నిలకడ లేని రాజకీయాలు ఇంకెన్నాళ్లు చేస్తారో పవన్.. తెలంగాణలో బీజేపితో పోత్తులో ఉండి ముందూ వెనక ఆలోచించకుండా 32 సీట్లలో పోటీ చేస్తాం అంటూ ప్రకటించేశారు. ఆ తర్వాత షరా మామూలుగా వెనకడుగు వేశారు. ఏపీలో టీడీపీతో, తెలంగాణలో బీజేపితో అర్ధం లేని పొత్తులు పెట్టుకున్నారు.
ఈ నిర్ణయాలను సమర్ధించుకున్నారు. చివరకు చచ్చీ చడీ 8 చోట్ల పోటీ చేశారు. వారి కోసమైనా ప్రచారంలోకి దిగారా అంటే చివరి వారం రోజులు మాత్రమే ప్రచారంలో పాల్గొన్నారు. అక్కడ మనస్ఫూర్తిగా జనసేనకు ఓటు వేయమని అడిగింది లేదు.. ఇంత మొక్కుబడి పోటీలు ఎందుకు?
జనంలో పలచన అవడం ఎందుకు? PSPK
ఇప్పుడేమో ప్రజలను నిందించడం మొదలు పెట్టారు. తెలంగాణలో ఓడిపోయాక పవన్ లో కలిగిన మార్పు ఇది.. తాను తీసుకుంటున్న అనాలోచిన నిర్ణయాలను ప్రజల్లో సమర్ధించుకోడానికి ఇలా గంటకో పాలసీ మార్చేస్తున్నారు. టీడీపీతో పొత్తు కుదిరాక ఇక తననెవరూ ఆపలేరన్నట్లుగా చెలరేగిపోయారు.జనసేన క్షేత్రస్థాయి నేతలంతా పొత్తును వ్యతిరేకిస్తుంటే వారికి క్లాస్ పీకారు. నిన్న విశాఖ సభలో కూడా తన నిర్ణయాలు నచ్చని వారు పార్టీ వదిలి వెళ్లిపోవచ్చని, వాళ్లని కోవర్టులుగా భావిస్తాననీ, తాను ఒక్కడినైనా పార్టీ నడుపుకుంటూనంటూ అసలు లాజిక్ లేని మాటలు మాట్లాడారు. మెజారిటీ జనసేన అభిమానులకు ఆయన రాజకీయ నిర్ణయాలు అస్సలు నచ్చడం లేదు…
వాళ్లందరూ తమ అభిప్రాయం చెప్పాలనుకుంటే వారిని పొమ్మంటున్నారు. కేవలం చంద్రబాబు మోచేతి నీరు తాగి తరిద్దామన్నట్లుగానే పవన్ వ్యాఖ్యలు ఉంటున్నాయి. చంద్రబాబుతో అంటకాగితే కనీసం రెండు , మూడు సీట్లైనా పార్టీ గెలిచి పరువు నిలబడుతుందన్న ఆశ కామోసు.. పవన్ ఆలోచనలెలా ఉన్నా.. 14 ఏళ్లు జెండా మోసిన కార్యకర్తలు మాత్రం అలసిపోయి, విసిగిపోయారు. ఇప్పుడిక ఫ్రస్ట్రేషన్ లో జెండాను సైతం వదిలేసేందుకు సిద్ధపడుతున్నారు…