Bhutan
ఆక్రమణలకు పెట్టింది పేరైన చైనా మన దేశాన్నేకాదు.. సరిహద్దు దేశాలన్నింటిలోనూ దురాక్రమణలకు పాల్పడుతోంది. తాజాగా భూటాన్ దేశాన్ని కబళిస్తున్న ఉపగ్రహ ఛాయా చిత్రాలు కలకలం రేపుతున్నాయి. భూటాన్, చైనా దేశాలు తమ సరిహద్దులను పునర్నిర్వచించుకునే అంశంపై రెండు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. అయితే చర్చల దారిని చర్చలు జరుగుతుండగానే ఉత్తర భూటాన్ లోని జకర్ లంగ్ వ్యాలీలో అక్రమ ఆక్రమణలకు పాల్పడి నిర్మాణాలు చేపడుతోంది. తాజా శాటిలైట్ చిత్రాలను గమనిస్తే థింపుకు చైనా దురాక్రమణలను ఆమోదించడం తప్ప మరే అవకాశమూ లేకుండా పోతోంది.
యాభై కిలోమీటర్ల మేర ఆక్రమణ
తూర్పు భూటాన్, అరుణా చల్ ప్రదేశ్ సరిహద్దుల్లో యాభై కిలోమీటర్ల మేరకు చైనా ఆక్రమించి అక్రమ కట్టడాలను నిర్మిస్తోంది. గొర్రెల కాపరులు, స్థానిక జాతుల వారిని అక్కడకు పంపి వారితో ఆక్రమణలకు పాల్పడి ఆ తర్వాత నెమ్మదిగా ఆ ప్రాంతాన్ని కబళించడం డ్రాగన్ కంట్రీ ఆనవాయితీ.అక్కడ గ్రామాలు, కాలనీలను, మిలటరీ బ్యారక్ లను, సెక్యూరిటీ అవుట్ పోస్టులను నిర్మిస్తోందని లండన్ లోని స్కూల్ ఆఫ్ ఓరియంటల్ అండ్ ఆఫ్రికన్న స్టడీస్ లో టిబెట్ చరిత్రను అధ్యయనం చేస్తున్న ప్రొఫెసర్ రాబర్ట్ బార్నెట్ తెలిపారు.
జకర్ లాంగ్ ను ఆక్రమించేసిన డ్రాగన్ Bhutan
భూటాన్ మతపరంగా, సంస్కృతి పరంగా కీలకమైన బెయూల్ ఖెంపాజంగ్ ను ఆనుకునే చైనా ఆక్రమిత జకర్ లంగ్ ప్రాంతముంది. భూటాన్ కు సంస్కృతి, సంప్రదాయాల పరంగా కీలక ప్రాంతమైన ఆ ప్రాంతాన్ని తనకు సంబంధమేలేని, సెంటిమెంట్లు, సంస్కృతిని గౌరవించే సంస్కారం లేని చైనా ఆక్రమించడం ఆదేశ దుర్భుద్ధికి నిదర్శనం. దీనిపై భూటాన్ ఎటూ స్పందించలేని నిస్సహాయ స్థితిలో పడిపోయింది.
వందల సంఖ్యలో భవనాలు నిర్మించిన చైనా
మాక్సర్ శాటిలైట్ ఇమేజ్ లను పరిశీలిస్తే జకర్ లంగ్ వ్యాలీలో గత రెండేళ్లుగా చైనా ఎలాంటి ఆక్రమణలకు పాల్పుడుతోందో స్పష్టమవుతుంది. గతవారం తీసిన శాటిలైట్ చిత్రాలలో చైనా అక్కడ నివాస ప్రాంతంగా మార్చి ఒకేసారి ఏకంగా 129 భవనాలు నిర్మించింది. ఆ తర్వాత ఈ ప్రాంతానికి కొంచెం దూరంలో రెండవ విడతగా 62 భవనాలు నిర్మించింది. 2021 ఆగస్టు నాటి ఛాయా చిత్రాలలో ఇలాంటి నిర్మాణాలే అక్కడ లేవు. అంటే ఆ తర్వాత కాలంలో అక్కడ ఈ నిర్మాణాలు వెలిశాయి. స్థూలంగా ఈ నిర్మాణాలను పరిశీలిస్తే ఆ గ్రామాలు కేవలం అవుట్ పోస్టులే కాదు.. చైనా ప్రాదేశిక సమగ్రతను కాపాడేందుకు ఉద్దేశించిన ఆ దేశ ఆంతరింగిక నిర్మాణాలనీ, వాటన్నింటినీ సమగ్ర పర్యావరణ ప్రణాళికతోనే నిర్మించారని అర్ధమవుతోంది. సూటిగా చెప్పాలంటే భూటాన్ తూర్పు, పశ్చిమ ప్రాంత భూభాగాన్ని ఆక్రమించేస్తోంది చైనా.
సరిహద్దులపై చర్చల సమయంలోనే.. Bhutan
చైనా నుంచి చొరబాట్లను నిలువరించడానికి ఆదేశంతో చర్చలు జరిపి శాశ్వత పరిష్కారం సాధించాలని భూటాన్ ప్రయత్నిస్తున్న తరుణంలోనే ఈ ఆక్రమణలకు చైనా పాల్పడుతోంది. ఈ ఏడాది అక్టోబర్ లో భూటాన్ విదేశాంగ మంత్రి చైనా పర్యటించారు. అదే సమయంలో భూటాన్ ప్రధాని లోటే షేరింగ్ రెండు దేశాల సరిహద్దులను నిర్వచిస్తామని ప్రకటించారు. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే ఇక ఆ హక్కు భూటాన్ కు లేదని అర్ధమవుతోంది.
డోక్లాంపై పట్టు వదులుకుంటుందా?
భూటాన్ కు దక్షిణాన ఉన్న డోక్లాం పీఠభూమిపై చైనా తన ఆధిపత్యాన్ని వదులుకుంటే ఇప్పటికీ రెండు దేశాల మధ్య మిగతా సరిహద్దు భూభాగాన్ని చర్చల ద్వారా తేల్చుకునే అవకాశం ఉంటుందని భూటాన్ ప్రధాని అంటున్నారు. గత నెలలో భారత్ సందర్శించిన భూటాన్ రాజు జిగ్మే ఖేర్ నంగైల్ వాంగ్ చుక్ రెండు దేశాల మధ్య జరిగిన చర్చల సారాన్ని బయటకు వెల్లడించలేదు. ఇరు దేశాల పరస్పర సహకారం, ప్రయోజనాల విషయంలో ద్వైపాక్షిక సహకారం గురించి మాత్రమే చర్చించినట్లు ప్రకటించారు. జకర్ లంగ్ వ్యాలీని చైనా ఆక్రమించడం చూస్తుంటే సరిహద్దు ఒప్పందాలు, వివాదాలపైనా చేసుకున్న అవగాహనా ఒప్పందాలను ఏ మాత్రం గౌరవించే సద్భుద్ధి ఆ దేశానికి లేదని తేలిపోతోంది. Bhutan
చైనా దురాక్రమణలపై గతంలోనే అప్పటి భారత త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్ సలామీ స్లైసింగ్ అని పేరు పెట్టారు. దురాక్రమణలన్నీ క్రమ పద్ధతి ప్రకారం, పైకి కనిపించకుండా చేస్తుందని, ఇప్పటికీ చైనా సముద్ర తీర ప్రాంతాలన్నింటినీ మిలటరీ అవుట్ పోస్టులుగా మార్చేసిందని అన్నారు.