KCR – REVANTH
తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇన్ స్టాంట్ జస్టిస్ అంటే తక్షణ న్యాయం మీద ఎక్కువ నమ్మకం కాబోలు .. ఏ పనైనా వాయిదాలు నచ్చవు కామోసు.. ఏ పనైనా పెండింగ్ లేకుండా అప్పటికప్పుడు స్పందించి వెంటనే చేసేస్తున్నారు.తన చురుకైన కదలికలు,నిర్ణయాలతో ప్రత్యర్ధుల మతి పోగొడుతున్నారు. ముఖ్యంగా తన ప్రత్యర్ధుల పరామర్శకి స్వయంగా వెళ్లడం, తనను కలసిన ప్రజలను అక్కున చేర్చుకోవడం, వారికి చేయాల్సిన సాయంపై అధికారులను అక్కడికక్కడ ఆదేశించడం లాంటి సంచలనాలతో సత్ సంప్రదాయాలను నెలకొల్పుతున్నారు…
ఎన్నికల టైమ్ లో కేసీఆర్, రేవంత్ ఒకరినొకరు ఎంతలా తిట్టుకున్నారో అందరం చూశాం.. ఆ తిట్లు విన్నవారెవరూ వారు మళ్లీ ముఖా ముఖాలు చూసుకుంటా రనుకోరు. కానీ రేవంత్ ఇందుకు భిన్నంగా ప్రవర్తిస్తున్నారు… రేవంత్ ను బాగా తిట్టేవారు సైతం ఇప్పుడు ఆయన ప్రవర్తన చూసి ఆశ్చర్యపోతున్నారు.
కేసీఆర్ ఆరోగ్యంపై రేవంత్ ఆరా KCR – REVANTH
ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తుంటి శస్త్ర చికిత్సకోసం ఆస్పత్రిలో చేరారని తెలిసిన వెంటనే రేవంత్ చొరవ తీసుకున్నారు. ఆరోగ్య శాఖ కార్యదర్శిని హుటాహుటిన ఆస్పత్రికి పంపి ఆయనకు మెరుగైన వైద్యం అందేలా ఆదేశాలు జారీ చేశారు.నిజానికి యశోద ఆస్పత్రి కేసీఆర్ సొంత ఆస్పత్రి లాంటిదే.. అలాంటి చోట ముఖ్యమంత్రి ఆదేశాల అవసరమే పడదు.. అయినా రేవంత్ దూకుడుగా స్పందించారు. ఆయన ఆరోగ్యం గురించి రెగ్యులర్ ఫాలో అప్ లో ఉండాలని చీఫ్ సెక్రటరీని ఆదేశించారు. కేసీఆర్ గాయపడిన రోజే రేవంత్ ఆస్పత్రికి వెళ్లాల్సింది.
కానీ డాక్టర్లు ఇప్పుడే రావొద్దని కోరడంతో ఆయన తన సందర్శనను వాయిదా వేసుకున్నారు. కేసీఆర్ కు సర్జరీ పూర్తయ్యాక వెళ్లారు రేవంత్. వెంట షబ్బీర్ ఆలీ, సీతక్క తదితరులు రాగా రేవంత్ యశోదా ఆస్పత్రికి వెళ్లి కేసీఆర్ ను పరామర్శించారు. ఆయనకు చేతులెత్తి నమస్కరించి ఆరోగ్యంపై ఆరా తీశారు. తాను ముందే రావాలనుకున్నా డాక్టర్లు వారించడంతో ఒకరోజు ఆగి ఇప్పుడు వచ్చానని రేవంత్ కేసీఆర్ కు తెలిపారు. కేసీఆర్ దగ్గర ఉన్నది రెండు నిమిషాలే అయినా తమ ప్రభుత్వం, పరిపాలనపై విలువైన సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరారు. వినయంగా పరామర్శించి వెనుదిరిగారు రేవంత్. రేవంత్ తీరుని విమర్శకులు సైతం మెచ్చుకుంటున్నారు.
పరామర్శలకు కేసీఆర్ దూరం
సాధారణంగా కేసీఆర్ కు ఇలాంటి పరామర్శల అలవాటు లేదు..చాలా చాలా సమీప బంధువులు, అత్యంత సన్నిహితులకు ఏమైనా అయితే మాత్రమే కేసీఆర్ స్పందిస్తారు. గతంలో గద్దర్ లాంటి ఎందరో ప్రముఖులు అనారోగ్యం పాలయినప్పుడు కేసీఆర్ పరామర్శకు వెళ్ల లేదు.. తన పార్టీ వారు, తనకు సన్నిహితులు, తనకు అత్యంత సన్ని హితులతో మాత్రమే కేసీఆర్ ఇలాంటి రిలేషన్స్ మెయిన్ టెయిన్ చేస్తారు. కానీ రేవంత్ అందుకు విరుద్ధంగా కేసీఆర్ ను పలకరించారు.
ఎంఐఎం ను లైన్ లో పెట్టారా?
ఇదే కాదు అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం సందర్భంగా కూడా రేవంత్ కొత్త సంప్రదాయానికి తెర తీశారు. స్పీకర్ గా సీనియర్ ను కూర్చొబెట్టే అవకాశం ఉన్నా ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ను ప్రోటెం స్పీకర్ గా నియమించి కేసీఆర్ మిత్రపక్షాన్ని లైన్ లో పెట్టారు.. సెక్రటేరియట్ దాటి తాను కాలు బయటపెడితే ఇక ప్రజలకోసమే బయటకు వస్తున్నట్లు భావించే సంకేతాలిచ్చారు…
ప్రజలెవరు పలకరించినా, పిలిచినా దగ్గరకు వెళ్లి ఆప్యాయంగా పలకరించడం, వారికి కావాల్సిన సహాయ సహకారాలు వెంటనే అందేలా ఆదేశాలివ్వడం లాంటివి గత ముఖ్యమంత్రులెవరూ ఇలా కుర్చీ ఎక్కాక పాటించిన దాఖలాలు లేవు..
ఈ మధ్య కాలంలో రేవంత్ ఇలాంటి సరికొత్త సంప్రదాయానికి తెర తీసి ప్రశంసలు పొందుతున్నారు. సీఎం అయిన కొత్త కాబట్టి ఇలా ప్రవర్తిస్తున్నారా? లేక అయిదేళ్లు ఇదే దూకుడు, ఇదే మంచితనం, ఇదే వినయం, ప్రజలతో ఇవే సత్సంబంధాలు మెయిన్ టెయిన్ చేస్తారా? చూడాలి.. ముందు ముందు ఏం జరుగుతుందో..