(A-370)
జమ్ము కశ్మీర్ ఎట్టకేలకు భారత ప్రభుత్వంలో అతర్భాగం అయిపోయింది. ఆర్టికల్ 370 ని రద్దు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లను ప్రత్యేకంగా, సుదీర్ఘంగా విచారించిన సుప్రీంకోర్టు ప్రభుత్వ చర్య సరైనదేనని తేల్చింది. ఒకే దేశంలో రెండు జాతీయజెండాలు, రెండు రాజ్యాంగాలు, రెండు పవర్ సెంటర్లు ఉండి, సామంత రాజ్యంలా పాలన నడవడం అన్నది దేశప్రయోజనాల దృష్ట్యా క్షేమకరం కానేకాదు. సుప్రీం కోర్టు కూడా ఇదే చెప్పింది. అంతేకాదు వచ్చే ఏడాది సెప్టెంబర్ లోగా అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరిపి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది.
మోడీ ప్రభుత్వం చారిత్రక నిర్ణయం
2019 ఆగస్టులో జమ్మూ కశ్మీర్ లో ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని రద్దు చేస్తున్నట్లు మోడీ ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఆ తర్వాత అనేకమంది న్యాయవాదులే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టుకి ఎక్కారు. స్థానిక ప్రజల అభీష్టానికి విరుద్ధంగా ఈ నిర్ణయం ఎలా తీసుకుంటారంటూ అనేకమంది ఇండిపెండెంట్ న్యాయవాదులతో పాటు, నేషనల్ కాన్ఫరెన్స్ కూడా పిటిషన్ దాఖలు చేసింది. పిటిషనర్ల అభ్యంతరాలను ఏడుగురు సభ్యుల ధర్మాసనానికి సిఫారసు చేయమన్న వినతిని కూడా సుప్రీంకోర్టు తోసిపుచ్చంది. 2023 ఆగస్టు 2 నుంచి ఈ పిటిషన్లను రోజు వారీ విచారణ మొదలు పెట్టింది సుప్రీం కోర్టు. దీనిపై దాఖలైన 23 పిటిషన్లను పక్షం పాటు విచారించిన సుప్రీం కోర్టు ఆ తర్వాత తీర్పును రిజర్వు చేసింది. చివరకు మొన్న 11వ తేదీన ప్రభుత్ర్వ నిర్ణయాన్ని సమర్ధిస్తూ సర్వోన్నత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. కేంద్రం నిర్ణయం సరైనదేనని వెంటనే ఏడాది లోగా ఎన్నికలు జరపాలని ఆదేశించింది.
కాంగ్రెస్ తప్పిదమే కశ్మీర్ పాపం (A-370)
కశ్మీర్ సమస్య విషయంలో కాంగ్రెస్ పార్టీ మొదట్నుంచి అవలంబించిన వైఖరి చారిత్రక తప్పిదమే.. పాక్ ఆక్రమిత దళాలను తిప్పి కొట్టకుండా మెతక వైఖరి అవలంబించి నెహ్రూ తప్పు చేస్తే ఆ తర్వాత మన సమస్యను తీసుకెళ్లి ఐక్య రాజ్యసమితి ముందు పెట్టి ప్రపంచ దేశాల జోక్యాన్ని కోరడం మరో తప్పు. ఆ పొరపాటు వల్లే ఆర్టికల్ 370 ఆవిర్భావం, కశ్మీర్ ను భారత అంతర్భాగంగా చేయడంలో అడ్డంకి ఏర్పడ్డాయి.అప్పటినుంచి కశ్మీర్ విషయంలో జరిగిన ప్రతీ నిర్ణయం ఘోర తప్పిదాలే. ఒక దశలో సిమ్లా ఒప్పందం ప్రకారం ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేందుకు పాకిస్థాన్ సిద్ధం అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం పీఓకే అని ఓ వివాదాస్పద భూభాగంలా గుర్తించి పాకిస్థాన్ మరింత ఆక్రమించేందుకు కారణమైంది. ఈ తప్పిదాలన్నింటినీ మోడీ ప్రభుత్వం వచ్చాకే సరిచేసే ప్రయత్నం చేసింది.
ఇక కశ్మీర్ అందరిదీ… (A-370)
ఏ దేశంలోనైనా ఇద్దరు ప్రధానులు, రెండు రాజ్యాంగాలు ఉండకూడదు.. అలా ఉంటే కశ్మీర్ ఎప్పటికీ పరాయిది అనే భావన ఇటు యావద్దేశానికి, అటు కశ్మీరీ ప్రజలకూ కూడా కలుగుతుంది. ఇదే వేర్పాటు వాద భావజాలం వేళ్లూను కోడానికి పొరుగుదేశం ఆక్రమణలకు కారణమవుతుంది. బీజేపి వచ్చాక ఉగ్రవాద కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయి. శాంతి, భద్రతలు మెరుగుపడ్డాయి. అభివృద్ధి మండళ్ల ఏర్పాటుతో కశ్మీరీ యువతలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. కశ్మీరీ పండిట్లకు మెరుగైన జీవితాన్ని, బతుకుపై భద్రతను కల్పించేందుకు మార్గం సుగమం అయింది.
మోడీ ప్రభుత్వం సాధించిన అతిపెద్ద విజయంలో జమ్ము కశ్మీర్ లో శాంతి భద్రతలు ఏర్పడి, మామూలు వాతావరణం రావడమే.. ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీర్ కు పట్టిన దరిద్రం వదిలినట్లే..అదే సమయంలో ప్రజా ప్రభుత్వ స్థాపన కూడా జరగాలి. కశ్మీరీ పండిట్ల భద్రతకు భరోసా ఇవ్వాలి. వేర్పాటువాద మూకలను అణచివేసి యువత లో భవిష్యత్తుపై భద్రత కల్పించాలి. మైనారిటీల భద్రతకూ భరోసా ఇవ్వాలి. మైనారిటీల కొమ్ము కాసే పేరుతోశాంతి భద్రతలను భగ్నం చేసే ఉగ్రమూకలను సమూలంగా ఏరివేయడమే ఇప్పుడు ప్రభుత్వ తక్షణ కర్తవ్యం. (A-370)