smoke bomb
కొత్త పార్లమెంటు భవనంపై ఆకతాయిల దాడి దుమారం రేగుతోంది. ఓ నలుగురు నిరుద్యోగులు సంచలనం సృష్టించడానికి చేసిన ఈఘటన పార్లమెంటు భవనం భద్రతనే సందేహంలో పడేస్తోంది. పార్లమెంటు సమావేశాలు జరుగుతుండగా విజిటర్స్ గ్యాలరీ నుంచి ఓ ఇద్దరు హటాత్తుగా సభలోకి దూకి కలర్ స్మోక్ ప్రయోగించారు. టేబుళ్ల పై నుంచి దూకుతూ స్పీకర్ దగ్గరకు పరుగు తీస్తుండటంతో ఎంపీలు అప్రమత్తమై వారిని పట్టుకున్నారు. ఊహించని ఈ ఘటనతో బిత్తర పోయిన స్పీకర్ సభను రెండు గంటలకు వాయిదా వేశారు.
ఆ ఇద్దరిలో ఒకరు తన షూలో దాచి తెచ్చిన కలర్ స్మోక్ ను గాల్లోకి వదిలాడు. దాంతో పార్లమెంటు అంతా గందరగోళంగా మారింది. వెంటనే అలెర్ట్ అయిన వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వారిలో ఒకరిని పట్టుకున్నారు. ఇద్దరు ఎంపీలు మరోకరిని పట్టుకుని చేతులు వెనక్కి విరిచి పట్టుకుని పెట్టి పిడిగుద్దులు కురిపించారు. ఇంతలో భద్రతా దళాలు వచ్చి వారిని బయటకు తీసుకెళ్లారు. సభలో కలకలం రేపిన వ్యక్తులు మనోజ్ రంజన్, సాగర్ శర్మ కాగా అదే సమయంలో పార్లమెంటు బయట మరో ఇద్దరు నినాదాలుచేస్తూ హంగామా చేశారు. వీరిలో ఒకరు హర్యానాలోని హిస్సార్ కు చెందిన నీలం కాగా, మరో వ్యక్తి మహారాష్ట్ర లాతూర్ కు చెందిన అమోల్ షిండే.
పబ్లిసిటీ కోసం పార్లమెంటు వేదికనా? smoke bomb
సాగర్ శర్మ, మనోరంజన్, నీలం, అమోల్ షిండే అనే వీరు నలుగురూ సోషల్ మీడియాలో పరిచయస్తులు.. అప్పటినుంచి పబ్లిసిటీ కోసం ఏదైనా సంచలనం చేయాలని నిర్ణయించుకున్నారు.. పార్లమెంటులోకి వెళ్లి హంగామా చేయాలని అనుకున్నారు.కర్ణాటకకు చెందిన వీరు మైసూరు ఎంపీ ప్రతాప్ సింహా నుంచి విజిటర్స్ పాస్ లు పొందారు. సెషన్ ప్రారంభం కాగానే విజిటర్స్ గ్యాలరీలో ఉన్న వీరు మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో గ్యాలరీ నెంబర్ 4,5 లనుంచి సభలోకి దూకారు.. తమ షూస్ లో దాచుకున్న కలర్ స్మోక్ ను ప్రయోగించారు. ఆవేశంగా నినాదాలు చేశారు. అందుకే పార్లమెంటుపై దాడి జరగొచ్చని భద్రతా దళాలకు ముందే సమాచారం అందింది. అయినా ఆగంతకులను నిలువరించలేకపోయారు. షూలో ఆగంతకులు కలర్ స్మోక్ తెచ్చినా భద్రతా సిబ్బంది గుర్తించలేకపోవడం సందేహాలకు తావిస్తోంది.
గొప్ప కట్టడం సరే.. భద్రతా ప్రమాణాలు ఏవి?
కొత్త పార్లమెంటును కట్టుదిట్టమైన భద్రతతో , అట్టహాసంగా నిర్మించామని, చరిత్ర ఉన్నంతకాలం నిలిచిపోయే అద్భుత కట్టడంగా తీర్చి దిద్దామని ప్రధాని మోడీ చెప్పారు. అయితే కొత్త పార్లమెంటులో భద్రత ఇంత డొల్లగా ఉందా? సాధారణంగా గుండు సూది తీసుకెళ్లినా ఎంట్రన్స్ లో మెటల్ డిటెక్టర్లు గొడవ చేస్తాయి. భద్రతా సిబ్బంది పట్టుకుంటారు. అలాంటిది ఈ నలుగురిని పార్లమెంటు ప్రాంగణంలోకి, అక్కడనుంచి లోక్ సభలోకి ఎలా అనుమతించారన్న సందేహాలు రేగుతున్నాయి.. సరిగ్గా 22 ఏళ్ల క్రితం పాత పార్లమెంటు భవనంపై ఉగ్రదాడి జరిగింది. మళ్లీ సరిగ్గా ఇదే రోజున ఈ దాడి జరగడం యాదృచ్చికమే అయినా ఇంత తేలికగా దుండగులు లోపలికి ప్రవేశించడం మన భద్రతా వ్యవస్థ డొల్ల తనాన్ని తెలియచేస్తోంది. smoke bomb
ఇది ఉగ్రవాదులకు ఉప్పందించినట్లు కాదా? పబ్లిగ్గా ఇంత సులభంగా దుండగులు పార్లమెంటులోకి చొరబడుతుంటే ఇంటెలిజెన్స్, భద్రతా సిబ్బంది చోద్యం చూస్తూ కూర్చోడం నివ్వెరపరుస్తోంది. పార్లమెంటుపై దాడి అంటేనే మన అత్యున్నత రాజ్యాంగ వ్యవస్థపైనా, మన సార్వభౌమాధికారంపైనా దాడి జరిగినట్లు. ప్రజల తరపున ప్రాతినిధ్యం వహించే వందల సంఖ్యలో ఎంపీలు ఉండే సభలో ఆగంతకులు అంత సులభంగా ప్రవేశించారంటే ఇది బయటి ఉన్మాద శక్తులకు ఎలాంటి సంకేతాలిస్త్తోంది? ఆగంతకులు తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పు తప్పే.. ఎవరు పడితే వారు అత్యున్నత రాజ్యాంగ వ్యవస్థలలోకి చొరబడి ఇష్టానుసారం చేస్తానంటే ఉపేక్షించకూడదు.
వీరికి కఠినమైన శిక్ష విధించడం ద్వారానే బయటి వారికి గట్టి సంకేతాలిచ్చినట్లవుతుంది. అది మామూలు స్మోక్ కాబట్టి సరిపోయింది.అదే ఏదైనా ప్రమాదకరమైన గ్యాస్ అయి ఉంటే ఏమై ఉండేది? ఉన్మాద శక్తులు తమ పబ్లిసిటీకి, సరదాలకు పవిత్ర రాజ్యాంగ వ్యవస్థలను వేదికలుగా మార్చుకోవడం అత్యంత దురదృష్టకరమైన అంశం. ఇప్పటికైనా కేంద్రం అలెర్ట్ అవ్వాలి. smoke bomb