ఏప్రిల్ నెలకు సంబందించిన ఆర్జిత సేవ టిక్కెట్ల వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ప్రకటించింది. జనవరి 18 నుండి ఆర్జిత సేవ మరియు ఇతర దర్శన టిక్కెట్లకు సంబందించిన ఆన్లైన్ కోటాను విడుదల చేస్తున్నామని తెలిపింది. శ్రీవారి ఆలయం లో తెల్లవారుజామున జరిగే పూజలు మరియు అష్టదళ పాదపద్మారాధన సేవలో పాల్గొనాలనుకునే భక్తులు జనవరి 18వ తేదీ ఉదయం 10 గంటల నుండి తమ పేర్లను ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని తెలిపింది.
జనవరి 20న ఉదయం 10 గంటల వరకు ఈ రిజిస్ట్రేషన్ విండో తెరిచి ఉంచబడుతుందని, ఆ తర్వాత లక్కీ డిప్ ద్వారా ఎంపికైన భక్తులు జనవరి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు టిక్కెట్ మొత్తాన్ని చెల్లించి, తమ టిక్కెట్లను కన్ఫర్మ్ చేసుకోవాలి అని టీటీడీ భక్తులను కోరింది.
అంగ ప్రదక్షిణం టోకెన్లు జనవరి 23న ఉదయం 10 గంటలకు , శ్రీవాణి బ్రేక్ దర్శనం టిక్కెట్లు ఉదయం 11 గంటల నుంచి , సీనియర్ సిటిజన్లు, ప్రత్యేక పౌరుల దర్శనం టోకెన్లు మధ్యాహ్నం 3 గంటల నుంచి అందుబాటులో ఉంటాయి అని తెలిపింది.
కల్యాణోత్సవం, ఊంజల్ మరియు సహస్ర దీపాలంకార సేవ టిక్కెట్లు, ఏప్రిల్ 21 మరియు 23 మధ్య నిర్వహించే మూడు రోజుల వార్షిక వసంతోత్సవాలకు సంబంధించిన టిక్కెట్ల ను జనవరి 22 ఉదయం 10 గంటల నుంచి టీటీడీ వెబ్సైటు ద్వారా పొందవచ్చు అని తెలిపింది.
జనవరి 24న ఉదయం 10 గంటలకు ₹300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్ల కోటా విడుదల చేయడంతో పాటుగా అదే రోజు మధ్యాహ్నం 3 గంటల నుండి తిరుమల మరియు తిరుపతి లో రూమ్ లను బుక్ చేసుకోవచ్చని టీటీడీ తెలిపింది. తమ అధికారిక వెబ్సైట్ https://ttdevasthanams.ap.gov.inలోకి లాగిన్ చేసి మాత్రమే టిక్కెట్లను బుక్ చేసుకోవాలని టీటీడీ భక్తులను కోరింది.