Narasaraopeta: అధికార వైఎస్సార్సీపీకి (YSRCP) మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు తన ఎంపీ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాజీనామా అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత కొంతకాలంగా పార్టీలో నెలకొన్న అనిస్థితి పరిస్థితులే ఈ నిర్ణయానికి దారితీశాయని పేర్కొన్నారు. గత రెండ్రోజులుగా జరుగుతున్న పరిణామాలతో కార్యకర్తలు కంగారు పడుతుండడంతో వారికి స్పష్టత ఇచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అయన తెలిపారు. నాలుగున్నరేళ్లలో నరసారావుపేట నియోజకవర్గ అభివృద్ధికి తనవంతు కృషి చేశానని పేర్కొన్నారు. నరసరావుపేట లోక్సభ స్థానానికి బీసీ సామజిక వర్గానికి చెందిన అభ్యర్థిని పోటీకి దింపాలని సీఎం జగన్ భావిస్తున్నారు.
ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు రాజీనామా..!
లావు శ్రీకృష్ణదేవరాయలు (Lavu Srikrishna Deva Rayalu) కొద్దిరోజుల క్రితం సీఎం జగన్తో సమావేశమయ్యారు. ఆ తర్వాత ఓ న్యూస్ ఛానల్ తో మాట్లాడిన ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. “నా అభిప్రాయాలతో సీఎం జగన్ కన్వీన్స్ కాలేదు, గుంటూరు నుంచి పోటీ చేయాలన్న ముఖ్యమంత్రి ప్రతిపాదనను నేను తిరస్కరించాను. సీఎం చాలా బిజీగా ఉన్నారని, మళ్లీ కలిసే అవకాశం ఉండదు” అని ఆయన ప్రకటించారు. వైస్సార్సీపీ కి చెందిన ఇద్దరు ఎంపీలు, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, కర్నూలు ఎంపీ సంజీవ్కుమార్లు రాజీనామా చేయగా, తాజాగా లావు శ్రీకృష్ణ దేవరాయలు రాజీనామాతో ఆ సంఖ్య మూడుకి చేరుకుంది. వైస్సార్సీపీ కి రాజీనామా చేసిన మచిలీపట్టణం ఎంపీ బాలశౌరి జనసేన పార్టీలో చేరారు.