Tirumala : తిరుమలలోని గోగర్భం డ్యామ్ సమీపంలో విశాఖ శారదా పీఠం నిర్మిస్తున్న రెండు భవనాల నిర్మాణాలను నిలిపివేయాలని ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. “తిరుమల క్షేత్రాల రక్షణ సమితి” అధ్యక్షుడు ఓంకార్ హైకోర్టులో దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) ప్రకారం, తిరుమల గోగర్భం డ్యామ్ సమీపంలో విశాఖ శారదా పీఠం ఏ, బీ అనే రెండు భవనాలను నిర్మించేందుకు టీటీడీ దగ్గర అనుమతిని తీసుకుంది. అయితే వారు సరైన అనుమతులు లేకుండా అదనపు అంతస్తుల నిర్మాణం, నిర్మిస్తున్న భవనాల చుట్టూ అవసరమైన సెట్బ్యాక్లు వదలకుండా నిర్మించడం మరియు భవనాల పక్కనే ఉన్న కాలువను ఆక్రమించుకుని నిర్మాణాలు చేపట్టడాన్ని పిటిషనర్ హైకోర్టు ధర్మాసనం దృష్టికి తీసుకురాగా, హై కోర్టు ఈ మధ్యంతర ఉత్తర్వులను ఇచ్చింది.
భవనాల క్రమబద్ధీకరణ నిమిత్తం టీటీడీకి నగదు రూపంలో చెల్లింపులు
శ్రీ వారి సేవకు వచ్చే భక్తుల సౌకర్యాలను పెంపొందించడమే లక్ష్యంగా శారదా పీఠం భవనాల నిర్మాణం జరుగుతుందని శారదా పీఠం ప్రతినిధి హై కోర్ట్ లో వాదించారు. భవనాల క్రమబద్ధీకరణ నిమిత్తం టీటీడీకి నగదు రూపంలో చెల్లింపులు కూడా జరిగాయని వాదించారు. ఇరుపక్షాల వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం, వాస్తవానికి శారదా పీఠం భవనాల నిర్మాణంలో ఉల్లంఘనలు జరిగాయని సూచిస్తూ వ్యాఖ్యలు చేసింది. తక్షణమే పనులు నిలిపివేయాలని శారదా పీఠం మరియు టీటీడీని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరాజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ ఆర్.రఘునందన్ రావులతో కూడిన ధర్మాసనం ఆదేశించింది.
కౌంటర్ దాఖలకు మూడు వారాల సమయం
భవనాల నిర్మాణంలో జరిగిన ఉల్లంఘనల పరిధిని గుర్తించేందుకు హై కోర్టు ఒక అడ్వకేట్ కమిషన్ను నియమించింది. క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి సమగ్ర నివేదిక అందించాలని ఆదేశాలు జారీ చేసింది. టీటీడీ ఈవో, టీటీడీ చీఫ్ ఇంజనీర్, టీటీడీ జేఈవో, విశాఖ శారదా పీఠం తిరుమల రీజియన్ మేనేజర్ సహా పలు అధికారులకు ఏపీ హైకోర్టు నోటీసులు పంపింది. విచారణను మూడు వారాల పాటు వాయిదా వేస్తూ కౌంటర్ దాఖలు చేయాలనీ ఆదేశించింది.