తెలంగాణ రాజకీయాలు ఎన్నికలు దగ్గరపడే కొద్దీ మారుతున్నాయి. పార్టీలు కూడా తమ వ్యూహాలను మార్చుకుంటున్నారు. మారిన వ్యూహం ఎవరికి లాభం? ఎవరికి నష్టం? అన్నది లెక్కలు వేసుకుని మరీ ప్రకటనలు చేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ కొంత బలోపేతం అవుతుంది. బీజేపీని తోసిరాజని ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ చేసిన ప్రకటన కూడా పొలిటికల్ సర్కిళ్లలో హాట్ టాపిక్ గా మారింది. ఒవైసీ ఎవరి ప్రయోజనం కోసం పనిచేస్తారు? అన్న చర్చ మొదలయింది.
హైదరాబాద్ నగరానికే…
తెలంగాణలో ఎంఐఎం కేవలం హైదరాబాద్ నగరానికే పరిమితమయింది. నగరంలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు హైదరాబాద్ పార్లమెంటు స్థానం కూడా ఒవైసీ గడప దాటి వెళ్లే అవకాశం లేదు. గతంలో కాంగ్రెస్ కు మద్దతుగా ఉండే ఎంఐఎం రాష్ట్ర విభజన తర్వాత ప్రత్యక్షంగా కాకున్నా పరోక్షంగా బీఆర్ఎస్ మిత్రపక్షంగా వ్యవహరిస్తూ వస్తుంది. బీఆర్ఎస్ కూడా ఎంఐఎంను మంచి మిత్రుడిగానే చూస్తుంది. ఇప్పటివరకూ జరిగిన ఎన్నికల సమయంలో పరోక్ష ఒప్పందాలు రెండు పార్టీలు కుదుర్చుకున్నట్లు విమర్శలు వినిపించాయి.
మంచి మిత్రుడిగా…
ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న చోట కూడా ఎంఐఎం పోటీ చేయకపోవడాన్ని ఈ సందర్భంగా కొందరు ఉదహరిస్తున్నారు. అయితే ఇప్పుడు ముస్లిం సామాజికవర్గంలో కొంత ప్రభుత్వ వ్యతిరేకత బయలుదేరిందన్న వ్యాఖ్యలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. దళితబంధు, బీసీ బంధు ప్రకటించిన కేసీఆర్ ముస్లింలను పట్టించుకోలేదన్న విమర్శలు ఆ సామాజికవర్గంలో ఉన్నాయి. దీంతో ఎంఐఎం పోటీ చేయని నియోజకవర్గాల్లో ముస్లిం ఓటు బ్యాంకు కాంగ్రెస్ వైపునకు టర్న్ అయ్యే అవకాశాలు లేకపోలేదని గులాబీ బాస్ అంచనా వేస్తున్నారు.
కాంగ్రెస్ ను దెబ్బతీసేందుకు…
అదే జరిగితే తమకు నష్టమని భావిస్తున్నారు. బీఆర్ఎస్ కేంద్రంలో ఉన్న అధికారంతో పైపైన కవ్వింపులకు దిగడంతో పాటు, ముస్లిం సామాజికవర్గాన్ని పట్టించుకోకపోవడాన్ని ఎక్కువ మంది తప్పుపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఒవైసీ చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. తెలంగాణలో మెజారీటీ నియోజకవర్గాల్లో ఎంఐఎం పోటీ చేస్తుందని అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. దళిత బంధులాగా ముస్లింబంధు ప్రకటించాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. కానీ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడానికి, బీఆర్ఎస్ కు ఫీల్డ్్లో అనుకూల వాతావరణం కల్పించడానికి ఎంఐఎం ఈసారి ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తుందన్నది విపక్షాల విమర్శ. కేసీఆర్ పై యుద్ధం పైకి ప్రకటిస్తున్న కనిపించిన ఈ పాతబస్తీ నేత లోపాయికారీగా మేలు చేయడానికి, కాంగ్రెస్ వైపు ఓట్లు వెళ్లకుండా ఉండేందుకు ఒవైసీ తనపార్టీని ఎక్కువ స్థానాల్లో పోటీకి దించుతున్నారన్నది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Follow Us On : YouTube , Google News