నెల్లూరు టౌైన్ నియోజకవర్గంలో ఎన్నికల యుద్ధం మొదలయింది. 2019 ఎన్నికల చిత్రమే మళ్లీ 2024లోనూ రిపీట్ కానుంది. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వైసీపీ నుంచి పోటీ చేస్తారన్నది దాదాపుగా ఖాయమయింది. వైసీపీలో ఇటీవల కొంత గ్రూపులు ఇబ్బంది పెడుతున్నా ఎన్నికల సమయానికి అవి సర్దుకుంటాయన్నది పార్టీ నాయకుల అభిప్రాయం. ఎమ్మెల్యే అనిల్ కుమార్ ఆయన బాబాయి రూప్కుమార్ల మధ్య గత కొద్ది రోజులుగా పెద్ద పంచాయతీయే నడుస్తుంది. అనిల్ కుమార్ మాత్రం వైసీపీ టిక్కెట్ తనకేనన్న నమ్మకంతో ఉన్నారు. జగన్ తనను పక్కన పెట్టరన్న పూర్తి విశ్వాసంతో అనిల్ ఉన్నారు.
ఈసారి కూడా…
అలాగే గత ఎన్నికల్లో వైసీపీ నుంచి అనిల్ కుమార్ యాదవ్ పోటీ చేయగా, తెలుగుదేశం పార్టీ నుంచి అప్పట్లో మంత్రిగా ఉన్న నారాయణ బరిలోకి దిగారు. ఇద్దరి మధ్య ఫైట్ మామూలుగా జరగలేదు. కేవలం 1,457 ఓట్ల తేడాతోనే అనిల్ కుమార్ యాదవ్ గెలిచారు. ఇది అతి తక్కువ మెజారిటీ అనే చెప్పాలి. అనిల్ కుమార్ యాదవ్కు 73,942 ఓట్లు రాగా, నారాయణకు 72, 485 ఓట్లు వచ్చాయి. అప్పట్లో జనసేన కూడా బరిలో ఉండటంతో కొంత చీలిక రావడంతో నారాయణ ఓటమి పాలయ్యారంటారు. ఎన్నికలకు ముందు నెల్లూరు నగరంలో తాను చేసిన అభివృద్ధితో గెలవడం గ్యారంటీ అని భావించిన నారాయణకు జనసేన పెద్ద దెబ్బేసిందనే చెప్పాలి.
జనసేనతో పొత్తుతో…
అయితే ఈసారి జనసేనతో పొత్తు ఉండటంతో గెలుపు ఖచ్చితంగా తమదేనని తెలుగుదేశం పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇప్పటి వరకూ ఇన్ఛార్జిగా ఉన్న శ్రీనివాసులురెడ్డిని తప్పించి కాపు సామాజికవర్గానికి చెందిన నారాయణను చంద్రబాబు అక్కడ అభ్యర్థిగా ఎంపిక చేశారు. ఈ ఎంపికను జనసేన కూడా కాదనలేని పరిస్థితి. నారాయణ ఆర్థికంగా కూడా బలవంతుడు కావడంతో ఆయన వైపు మొగ్గు చూపారు. పార్టీకి ఫైనాన్షియల్గా అండగా నిలుస్తున్న నారాయణ నాలుగేళ్ల పాటు కార్యక్రమాలకు దూరంగా ఉన్నప్పటికీ చంద్రబాబు మాత్రం ఆయననే క్యాండిడేట్గా నిర్ణయించారు. గెలుపు ప్రధానంగానే ఈ ఎంపికను టీడీపీ అధినేత చేసినట్లు తెలిసింది.
ఎవరు ఆపేదంటూ…
మరోవైపు అనిల్ కుమార్ కూడా ఈసారి కూడా తన గెలుపును ఎవరూ ఆపలేరని అంటున్నారు. జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో పాటు, నగరంలో గత నాలుగేళ్లుగా జరిగిన అభివృద్ధి ఈసారి అత్యధిక ఓట్లతో గెలుస్తానంటూ సవాల్ విసురుతున్నారు. తనపై నారా లోకేష్ పోటీ చేయాలంటూ ఆయన పదే పదే సవాల్ విసురుతున్నారు. తనను 2024లోనూ అసెంబ్లీలో అడుగు పెట్టకుండా ఎవరూ ఆపలేరంటూ ఛాలెంజ్ చేస్తున్నారు. తాను ఈసారి ఓటమిపాలయితే రాజకీయాల నుంచి తప్పుకుంటానని కూడా అంటున్నారు. ఈ నేపథ్యంలో పాత నేతల మధ్యనే మరోసారి ఫైట్ జరగబోతుంది. మరి ఈసారి నెల్లూరు ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారన్నది ఆసక్తికరంగా మారింది.
Follow Us On : YouTube , Google News