భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం లోక్సభ ఎన్నికలకు ఇప్పటి నుంచే సమాయత్తమవుతుంది. అందుకు సంబంధించిన కసరత్తులు ప్రారంభిస్తోంది. కేంద్రంలో హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసేందుకు అవసరమైన అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటుంది. వచ్చే ఎన్నికల్లోనూ కేంద్రంలో తమదే అధికారం అన్న ధీమా ఉన్నప్పటికీ, ఎక్కడో ఒక మూల డౌట్ కొడుతుంది. 2019 నాటి పరిస్థితులు దేశంలో ఇప్పుడు లేవు. కొంత ట్రెండ్ మారింది. అలాగని ప్రత్యర్థి పార్టీ బలంగా లేదని తేలిగ్గా తోసిపుచ్చలేని పరిస్థితి. ప్రజల మూడ్ ఎలా ఉంటుందో చెప్పలేం. అందుకోసమే ఎన్డీఏను వీడి వెళ్లిన మిత్రులను కలుపుకునేందుకు పార్టీ అధినాయకత్వం తిరిగి ప్రయత్నాలు చేస్తుంది.
గత ఎన్నికల్లో…
2019 ఎన్నికల్లో బీజేపీ కేంద్రంలో ఒంటరిగానే అధికారంలోకి వచ్చింది. మిత్రపక్షాల అవసరం లేకుండానే ప్రజలు మూడు వందలకు పైచిలుకు స్థానాలను కమలం పార్టీకి కట్టబెట్టారు. దీంతో ఈ ఐదేళ్ల నుంచి తమకున్న మిత్రపక్షాలను ఏకపక్ష నిర్ణయాల కారణంగా మోదీ ప్రభుత్వం దూరం చేసుకుందనే చెప్పాలి. ప్రతి రాష్ట్రంలో ఉన్న మిత్రపక్షం ఎన్డీఏను వీడింది. బీహార్లో బలమైన జనతాదళ్ (యు) బీజేపీని వీడి ఆర్జేడీతో భాగస్వామిగా మారి అధికారంలోకి వచ్చింది. పంజాబ్ ఎన్నికల సమయంలో రైతు ఉద్యమం పట్ల కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరును నిరసిస్తూ శిరోమణి అకాలీదళ్ బీజేపీతో స్నేహానికి గుడ్బై చెప్పి వెళ్లింది.
ఈసారి జనం మూడ్…
మహారాష్ట్రలోనూ శివసేన ముఖ్యమంత్రి పదవి పంపకాల్లో తేడా వచ్చి కాంగ్రెస్, ఎన్సీపీ కూటమివైపు చేరింది. గత ఎన్నికల్లో హిందీ ప్రాబల్యం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో బీజేపీ కూటమి అత్యధిక స్థానాలను సాధించింది. ఈసారి ఎన్నికల్లో అంతకు మించి సీట్లయితే రావు. బీహార్, పంజాబ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో ఈసారి మరింత తగ్గే అవకాశముంది. గత ఎన్నికల్లో దక్షిణాదిన కర్ణాటకలో ఇరవై నాలుగు ఎంపీ స్థానాల వరకూ బీజేపీ గెలుచుకుంది. కానీ ఈసారి కన్నడ ప్రాంతంలో అన్ని సీట్లు దక్కే అవకాశం కన్పించడం లేదు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ కన్నడ ప్రజలు కాంగ్రెస్కు ఏకపక్ష విజయాన్నిఅందించారు. ఒడిశాలోనూ పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు.
దక్షిణాదిన…
తమిళనాడు, కేరళ, ఏపీ, తెలంగాణలను చూసుకున్నా పరిస్థితులు సానుకూలంగా మాత్రం కమలం పార్టీకి లేవు. ఏమాత్రం నార్త్ లో సీట్లు తగ్గితే అధికారంలోకి రావడం అటుంచి.. అసలుకే ముప్పు ఏర్పడుతుంది. అందుకే పరిస్థితి గమనించిన మోదీ, అమిత్షాలు తమ కూటమిని వీడిపోయిన మిత్రులను తిరిగి చేర్చుకునే ప్రయత్నంలో పడ్డారని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. ప్రతిపక్షాలలో సయితం ఐక్యత కనిపిస్తుండటం వీరి కలవరానికి కారణమయింది. అందుకే వివిధ కారణాలతో తమ మిత్రులను తిరిగి కలుపుకోవాలని దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. అయితే ఏ పార్టీలను కలుపుకుంటే తమకు లాభమన్న కోణంలో కేంద్ర నాయకత్వం ఆలోచన చేస్తుంది. అది కొలిక్కి వచ్చిన వెంటనే మిత్రపక్షాలను కలుపుకునేందుకు ఒక కార్యాచరణ ప్రకటించనున్నారని సమాచారం.
టీడీపీతో పొత్తు విషయంలో…
తెలుగు రాష్ట్రాల విషయం తీసుకుంటే.. తెలంగాణలో కలుపుకు పోయేందుకు పెద్దగా ఏ పార్టీ కన్పించడం లేదు. ఒక్క ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే అన్ని పార్టీలు బీజేపీకి మద్దతుగా, కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఉన్నాయి. జగన్ పార్టీ నేరుగా బీజేపీతో పొత్తు పెట్టుకునే పరిస్థితి ఉండదు. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు కోసం అర్రులు చాస్తుంది. ఇప్పటికే చంద్రబాబు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఏ విషయంపై చర్చించారన్న విషయం మాత్రం బయటకు రాలేదు. అయితే చంద్రబాబుతో పొత్తు విషయం మోదీ ఫైనల్ చేయనున్నారు. మోదీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. తనను తీవ్రంగా వ్యతిరేకించిన చంద్రబాబును మోదీ కలుపుకు పోయేందుకు అంగీకరిస్తారా? లేదా? నిర్దాక్షిణ్యంగా నో చెబుతారా? అన్నది మరికొద్ది రోజుల్లోనే తేలనుంది.
Follow Us On : YouTube , Google News