వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే ఆయన వచ్చే ఎన్నికలకు సంబంధించి స్ట్రాటజీని ఖరారు చేసుకున్నారు. రెండో దఫా విజయం సాధించడమే లక్ష్యంగా జగన్ తన క్యాంప్ కార్యాలయంలో పని చేసుకుబోతున్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ పనితీరు కంటే అభ్యర్థుల ఎంపిక ముఖ్యం. ఏ ప్రభుత్వంలోనైనా సర్కార్ పనితీరుతో పాటు స్థానిక ఎమ్మెల్యేపై వ్యతిరేకత కూడా ఎన్నికల్లో గెలుపోటములపై ప్రభావం చూపుతుంది. అందుకే జగన్ ఈసారి సర్వే నివేదికల ద్వారా తనకు అందిన సమాచారం ప్రకారం అభ్యర్థులను ఖరారు చేయనున్నారు.
సర్వే నివేదికల…
ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ టీం పలుమార్లు ఏపీలోని 175 నియోజకవర్గాల్లో పలుమార్లు సర్వేలు నిర్వహించింది. ఆ నివేదికలు జగన్ వద్ద సిద్ధంగా ఉన్నాయి. కొందరి ఎమ్మెల్యేల పనితీరు మెరుగుపడగా, మరికొందరిపై మాత్రం స్థానిక ప్రజల్లో వ్యతిరేకత ఇంకా అలాగే కొనసాగుతుంది. ఇంకా ఎన్నికలకు తొమ్మిది నెలలు మాత్రమే సమయం ఉంది. ఈ తొమ్మిది నెలల్లో వారి పనితీరు మెరుగుపడుతుందని అనుకోలేం. అలాగే మరికొందరు ఎమ్మెల్యేల విషయంలో సామాజికవర్గం అడ్డుగా ఉంది. ఈసారి గెలవాలంటే కొందరు ఎమ్మెల్యేలను మార్చాల్సి ఉంటుంది. వారి పనితీరు బాగా ఉన్నా సరే జిల్లాలో ఉన్న క్యాస్ట్ ఈక్వేషన్స్ ను బట్టి టిక్కెట్ దక్కడం కష్టమేనంటున్నారు.
ప్రత్యర్థి పార్టీ అభ్యర్థిని బట్టి…
2019 ఎన్నికల్లో అధికారంలో జగన్ లేరు. అందుకే అప్పుడు ఆయన ఫ్రీగా ఉన్నారు. ప్రశాంత్ కిషోర్ టీం ఇచ్చినట్లు ఒకేసారి అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. కానీ ఈసారి అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. పైగా ప్రత్యర్థులు పొత్తులతో ఎన్నికల బరిలో ఉండటంతో ఈసారి ఆచితూచి అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంటుంది. ప్రత్యర్థి పార్టీ అభ్యర్థిని బట్టి కూడా కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీ క్యాండిడేట్ ను ఎంపిక చేయాల్సి ఉంటుంది. అందుకోసమే జగన్ ఈసారి దశల వారీగా అభ్యర్థుల జాబితాను విడుదల చేసే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. టీడీపీ, జనసేన జాబితా బయటకు వచ్చిన తర్వాత కానీ అభ్యర్థుల ఎంపికపై ఒక నిర్ణయం తీసుకునే ఛాన్స్ లేదు.
విడతల వారీగా…
ముందుగా ఎలాంటి ఇబ్బందులు లేని కొన్ని నియోజకవర్గాల జాబితాను విడుదల చేస్తారంటున్నారు. వచ్చే ఏడాది మొదట్లో తొలి జాబితాను జగన్ రిలీజ్ చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముందుగా యాభై నుంచి అరవై నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల లిస్ట్ ను విడుదల చేస్తారన్నది తాడేపల్లి నుంచి వినిపిస్తున్న టాక్. అందుకే గతంలో మాదిరి ఒకేసారి ఎమ్మెల్యే, ఎంపీల జాబితాను విడుదల చేయరు. కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులను కూడా ఎంపీ స్థానాలకు ఎంపిక చేయాల్సి రావడంతో లెక్క సరి చూసుకున్న తర్వాతనే అభ్యర్థుల జాబితా వైసీపీ నుంచి వస్తుందని తెలిసింది. మరి ఇందులో ఎవరికి టిక్కెట్ దొరుకుతుంది? ఎవరికి దక్కదు? అన్నది తేలాలంటే మరికొంత కాలం వేచి చూడక తప్పదు.
Follow Us On : YouTube , Google News